కాకతీయ సామ్రాజ్యాధినేతల్లో రుద్రమదేవి పరిపాలనా కాలం విశేషమైనది. అనేక
ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఆలయాల నిర్మాణం, దానధర్మాలు
విరివిగా కొనసాగాయి. యాదాద్రిభువనగిరి జిల్లా సమీపంలోని బొల్లేపల్లిలో
తేరాల ఏడిండ్ల రడ్లు వేయించిన శాసనం లభించింది.శాసనకాలం శ.సం. 1189= క్రీ.శ.1267,ప్రభవ, ఆషాఢశుద్ధ పాడ్యమి.
బొల్లేపల్లి మల్లదేవునికి తేరాల ఏడిండ్ల రడ్ల పురము యొక్క పుట్టాయతి (అర్థం తెలియ దు) ఇచ్చినారు. దేవునికి నీరు నేల మర్తురు, వెలిపొలము ముప్పయి మర్తుర్లు.. కార్తిక, వైశాఖ మాసాల్లో పండే రెండు పంటలను సర్వమాన్యంగా ఇచ్చినాడు. ఇతడు దేవాలయానికి స్థానాపతులు మల్లి మల్లిసెట్టి, పూజారి పోత గుండ, పూజారి దేవపలను నియమించినట్లు శాసనంలో ఉన్నది. వీరిని అంగీకరించని వారు పంచ మహాపాతకులని శాసనం తెలిపింది.‘ఏడిండ్ల రడ్లు’ అనేది ఒకే వ్యక్తా లేదా ఒక సమూహానికి సంబంధించిన పేరా అనే అనుమానాలున్నాయి. అయితే ఈ శాసనంలో ఉన్న వర్ణనను గమనిస్తే ఇది ఒక వ్యక్తి పేరే అని భావించవచ్చు.
శాసనంలో తేరాల ఏడిండ్ల రడ్లను గురించి చాలా దీర్ఘమైన వర్ణన, విశేషాలు చెప్పబడినాయి. ‘పరనారీ దూరుండు, పతిహిత గరుడుండు, సమర సౌవర్ణుండు, విటినాయక గజకేసరి బిరుద నాయక జీమూత పవనుండు, గడికోట మల్లుండు, సమర జయార్జునుండు, సత్య హరిశ్చంద్రుండు, విభవ దేవేంద్రుండు, విద్వజ్జన రక్షకుండు,అసగని గరుడ నామాది సమస్త ప్రశస్తి సహితుడు.. శ్రీమతు తేఱాల ఏడిండ్ల రడ్లు’ అని కీర్తించబడినాడు.చక్రవర్తి స్థాయి కాని ఒక సామాన్య వ్యక్తికి ఇన్ని బిరుదులు ఉండటం అరుదు. బహుశా ఇతడు స్థానిక పాలకుడు అయి ఉండవచ్చు.