ఇప్పటివరకు సేకరించిన ఇక్ష్వాకుల చరిత్ర అంతా నాగార్జున కొండ తవ్వకాల చుట్టే తిరిగి, కృష్ణానది దిగువ భాగం అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థలాలకు పరిమితమై అమరావతి కేంద్రంగా ఉన్నది. నాగార్జున కొండకూ అమరావతికీ మధ్య ఎంతదూరమో దాదాపు అంతే దూరంలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఉన్నాయి. ఇవికూడా ఇక్ష్వాకుల కాలంలో వర్ధిల్లిన స్థలాలే. అందుకే తెలంగాణలోని కృష్ణా-మూసీ పరీవాహక ప్రాంతాల్లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా తవ్వకాలు జరిపి మరింత పరిశోధన చేసి ఈ ఖాళీని పూర్తిచేయకపోతే ఇక్ష్వాకుల పాక్షిక చరిత్ర మాత్రమే మిగులుతుంది.
ఇక మూడో రాజు ఎహువల చాంతమూల (రెండో చాంతమూల) చేసిన యుద్ధాలు, రాజకీయం గురించిన శాసనాలు నాగార్జునకొండ, ఫణిగిరి తవ్వకాల్లో దొరికినయి. ఇతడి పాలనలో రాజకీయాంశాల గురించి ఫణిగిరిలో ఒక విరిగిన శిలాఫలకంపై ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసన భాగం చెప్తుంది. నాగార్జునకొండ శాసనంలో ఎహువల చాంతమూలకు ఎలిసిరి అనే పేరుగల మహాతలవర యుద్ధంలో విజయం సాధించిన వివరాలున్నాయి. ఇతడి కాలంలోనే ఇక్ష్వాకుల రాజధాని అభీర వసుషేణుడి చేతిలోకి కొద్దికాలం పోయింది. ఇక్ష్వాకుల పాలన మధ్యలో ఇక్ష్వాకుల విజయపురిలో అభీర వసుషేణుడి శాసనం ఉండటంతో ఇక్ష్వాకులను ఓడించి కొంతకాలం అభీరులు పాలించారని చరిత్రకారుల అభిప్రాయం.
ఇక చివరి రాజైన రుద్ర పురుషదత్త కాలాన్ని సూచించే కీలక శాసనం ఫణిగిరిలో దొరికింది. ఫణిగిరి ఇక్ష్వాకుల చరిత్రలో ఎంత ప్రత్యేకమైందంటే సిరిపర్వత ప్రాంతంలోని ఇక్ష్వాకు నిర్మాణాలకు, అమరావతికీ దీటుగా విలసిల్లిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలానికి చెందిన 15 శాసనాలు దొరికినయి. అన్నిటికంటే ముఖ్యమైనది రుద్రపురుషదత్తుడి స్తంభ శాసనం. ఈ శాసనాన్ని పరిష్కరించేవరకు రుద్రపురుషదత్తుడి పరిపాలనా కాలం 11 ఏండ్లుగా భావించారు. అయితే ఈ శాసనంలో రుద్రపురుషదత్త 18వ రాజ్యకాలంలో అని ఉండటంతో, ఇతడి పాలనాకాలం 18 ఏండ్లుగా నిర్ధారించడంతో పాటు ఇక్ష్వాకుల వంశకాలం కూడా ఏడేండ్లు పెరిగి నాలుగో శతాబ్దంలోకి చేరింది. అష్ట భుజాకారంలో మూడు మీటర్ల పొడవైన ఈ స్తంభంపై రుద్రపురుషదత్త అగ్రభిషజుడు (ప్రధాన వైద్యుడు) నందిణ్ణక, ధమ్మసేన అనే బౌద్ధ భిక్కు (భిక్షువు) ఆధ్వర్యంలో ధర్మచక్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రాకృత భాషలో చెక్కి ఉన్నది. అయితే ఇదే శాసనంపై బౌద్ధంతో పాటు వైదిక దేవుళ్లు శివ, విష్ణు, కృష్ణ ప్రస్తావన కూడా ఉండటం విశేషం. వైదిక మత ప్రాబల్యం ఇక్ష్వాకుల కాలంలో పెరుగుతున్నదనడానికి ఇదికూడా ఒక సూచిక. అంతేకాదు ఈ శాసనంలో ప్రాకృతంతో పాటు సంస్కృతం కూడా ఉండటంతో శాసన, చారిత్రకపరంగా ప్రత్యేకమైంది. రుద్రపురుషదత్తుడి తర్వాత అతడి తమ్ముడు రెండో వీరపురుషదత్తుడి పేరు శాసనాల్లో ‘మహా రాజకుమార’ అన్న సంబోధనతో కనిపిస్తుంది. అయితే ఆయన రాజుగా ఏలిన ఆధారాల్లేవు. ఇప్పటికీ తెలంగాణలోని కృష్ణా-మూసీ తీరంలో ఎన్నో ఆధారాలు ఇంకా బయటకు రాలేదు. కొత్త పురాతత్వ ప్రదేశాలు, ఆధారాలు బయటపడితే ఇక్ష్వాకుల వంశ-కాల క్రమణికలో ఇప్పుడున్న ఖాళీలను పూరించవచ్చు.
ఇక్ష్వాకుల కాలంలో స్త్రీలు: శాతవాహన కాలంలో నాగానిక, గౌతమి బాలసిరి లాగే ఈ కాలంలో కూడా ఇక్ష్వాకు వంశ స్త్రీలు, కొందరు పాలకవర్గానికి చెందిన వాళ్ల పేర్లు శాసనాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. దీనికి కారణం ఇక్ష్వాకు రాజ్య విస్తరణలో, సుస్థిరతలో వాళ్ల భాగస్వామ్యం ఉండటమే. శాతవాహనుల్లానే తల్లి పేరు రాజుల పేర్లకు ముందు ఉండటం మాతృ నామ పద్ధతికి కొనసాగింపే. మేనత్త కూతుళ్లను చేసుకోవడం ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తుంది.
వీరపురుషదత్తుడి ఐదుగురు రాణుల్లో బాపిసిరి, చాతిసిరి ఒక మేనత్త హమ్మసిరి కూతుళ్లు. ఇంకో మేనత్త కూతురు చాంతిసిరి. ఇంకో ఇద్దరు భార్యలు భాతిదేవ, రుద్రదేవ భట్టారిక (శక యువరాణి) బయటి సంబంధాలు. ఇప్పటికీ మేనరికపు పెండ్లిళ్ల ఆచారం గోదావరీ లోయ ప్రాం తం కన్నా, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మేనత్త కూతురిని చేసుకోవ డంతో ఇంకో పాలకవర్గ వంశాన్ని అనుకూలం గా మలుచుకునే రాజకీయపు ఆలోచన స్పష్టమవుతుంది. ఈ కాలంలో చాంతిసిరి అనే పేరు ప్రముఖమైందనిపిస్తుంది. మొదటి చాంతమూలుడి సోదరి పేరు చాంతిసిరి. వీర పురుషదత్తుడి కూతురు కొడబలిసిరి.
వీళ్ల పేర్లు శాసనంలో ప్రముఖంగా ఉండటానికి కారణం వాళ్లు బౌద్ధ సంఘానికి చేసిన దానాలే. వాసిష్టీపుత్ర సిరి చాంతమూల సోదరి చాంతిసిరిని ఒక శాసనం ‘మహాదానపతిని’గా వర్ణిస్తుంది. నాగార్జున కొండపై స్తూపం నిర్మించి, దానిపై ఆయక స్తంభాలను నిలిపింది ఈమెనే. ఈ కాలంలో రాణివాసపు లేదా అధికార వర్గపు స్త్రీలు ఇంకో అదనపు హోదాను పొందినట్టు శాసనాల వల్ల తెలుస్తున్నది. భర్త హోదాను భార్యకు కూడా వర్తింపజేసి సంబోధించడం విశేషం. మహాతలవరి అడవి చాంతిసిరి (భర్త మహాతలవర), మహాసేనాపతి మహాతలవర వాసిస్టిపుత్ర మహాకందసిరి (భర్త మహాతలవర, మహాసేనాపతి కూడా) ఇలా వారి పేర్లు, వారు చేసిన దానాలు, వారి భర్తకున్న హోదాలతో శిలాక్షరాలైనాయి. ఇదే సందర్భంలో ప్రస్తావించాల్సిన ఇంకో స్త్రీ బోధిసిరి. ఈమె రాణి వాసపు స్త్రీ కాదు. బోధిశర్మ అనే కోశాధికారి మేనకోడలు. ఉపాసిక (సంసార జీవితంలో ఉంటూ బౌద్ధాన్ని ఆచరించే స్త్రీలు) అయిన బోధిసిరి, చూళ దమ్మగిరి విహారాన్ని సిరిపర్వత ప్రాంతంలో నిర్మించింది.
ఇక్ష్వాకు రాజ్య పతనం
వీరి పతనానికి కారణం చెప్పే పూర్తి ఆధారాలు ఇప్పటివరకు రెండు శాసనాలే. పల్లవరాజు సింహవర్మ వేసిన మంచికల్లు శాసనం. రెండోది బృహత్పలాయన వంశరాజు జయ వర్మ వేయించిన కొండముది శాసనం. ఈ రెండూ ఆంధ్రలో దొరికినయి. మరి ఇక్ష్వాకుల తర్వాత తెలంగాణలోని కృష్ణా-మూసీ ప్రాంతం లో విష్ణుకుండి రాజులూ వచ్చేవరకు ఉన్న పెద్ద ఖాళీని మనం ఇంకా శోధించాల్సి ఉన్నది. ఇక్ష్వాకుల తర్వాత మళ్లీపెద్ద రాజ్యం ఏర్పడేవరకు మహా తలవరలు వంటి సామంతుల అధికారం కింద ఉందా? ఇక్ష్వాకులు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఏలినప్పుడు గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఏ రాజ్యవంశం ఏలిం ది? ఇలాంటి ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
ఇక్ష్వాకుల మొదటి రాజైన సిరి చాంతమూల తరువాత ముగ్గురు రాజులు పాలించారు. రెండవ రాజు మాధరీపుత్ర వీర పురుష దత్త. శాసనాల్లో ‘శ్రీపర్వతాధిపతి’గా ఇతడిని వర్ణించారు. ఇతడి శాసనాలు నాగార్జునకొండ, ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట, ఉప్పుగుండూరులలో దొరికినయి. చరిత్రలో రాజ్య విస్తరణ రెండు పద్ధతుల్లో జరిగింది. ఒకటి యుద్ధం, రెండోది వివాహ సంబంధం. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని సుస్థిరం చేసిన రాజు ఇతడు. ముగ్గురు మేనత్త కూతుళ్లను పెళ్లి చేసుకోవడం ద్వారా స్థానిక పాలకవర్గాలతో నెయ్యం కుదిరింది. ఉజ్జయిని పాలక శక క్షాత్రప వంశ యువరాణిని పెళ్లి చేసుకొని ఆ వంశాలతో, కూతురును బనవాసిని పాలిస్తున్న ఛూటులకు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా బలమైన పొరుగు రాజ్యాలతో వియ్యం అందుకొని రాజ్య స్థిరత్వాన్ని సాధించాడు. ఇతని కాలంలో సిరిపర్వత ప్రాంతం బౌద్ధానికి అతిపెద్ద కేంద్రమైంది.
ఏ సమాజంలోనైనా స్త్రీల పరిస్థితి నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇక్ష్వాకు రాజుల్లో ఒక్క వీరపురుషదత్తుడు తప్ప మిగిలిన ముగ్గురూ వైదిక ఆలయాలను నిర్మించి, వాటిని పోషించి, వైదిక యజ్ఞాలు చేసినవాళ్లే. అయితే వాళ్ల రాణులు మాత్రం రాజు చేస్తున్న యజ్ఞాల్లో పాల్గొంటూనే బౌద్ధ విహారాలను, స్తూపాలను నిర్మించడం, వాటికి దానాలు చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అర్థం అయ్యేదేమంటే ఒకవైపు సమాజంలో బలంగా ఉన్న బౌద్ధమతాన్ని ఆదరిస్తూనే, ఇంకోవైపు క్రమంగా విస్తరిస్తున్న వైదిక మతాన్ని కూడా ఆదరించడం జరిగింది. ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీలు మిశ్రమ సమాజానికి ప్రతీకలు.
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్ ,81069 35000