‘రాజుగా.. నువ్వే ఇంటికి పెద్దోనివి, నువ్వు సక్కగుంటే, ఇల్లు మంచిగుంటది. చెల్లెకు పెండ్లి చేసి, ఐదుగురు తమ్ముళ్లకు తొవ్వ సూపెట్టాల్న’ని అవ్వ మధునవ్వ దినాం చెప్తుండేది. మా ఆరుగురి తోడ ఒక్క చెల్లె. నాయిన లింగయ్య అమాలి పనికివోతె, అవ్వ శేనుకో కైకిలి వోయేది. రికాం లేకుండ రోజు నాలుగు రెక్కలాడినా మా కడుపులు పురాగ ఎన్నడూ నిండలె. మేం తిన్నంక మిగుల్తే అవ్వ తినేది, లేకుంటే ఆ పూట పస్తులుండేది.
కోపెన బియ్యం వారం ఎల్లకముందే ఒడుస్తుండె. బియ్యమొడిసిన రోజు ఊరి మీద వడి అన్నం అడుక్కచ్చేది అవ్వ. దయగల్లోల్లు మిగిలిందేసేది. దయలేనోళ్లు ‘ఈ మధునవ్వకు ఏ..డ పన్లేదు, తల్లి కోడి, పిల్లల్ని ఎంబడేసుకొని అచ్చినట్టు రోజు ఇంటి మొకానొస్తద’ని దెప్పిపొడిసే మాటలనేది. అట్లన్నా సరే.. మా కడుపులు ఎండవెట్టకపోయేది. ఓ రోజు పగటీలి బడికి వొయ్యొచ్చినం. నాయిన అమాలి పనికివొయ్యచ్చేసరికి మేం బగోన్లు బోర్లేసినం. ఆకలిమంటతోని అచ్చిన నాయినకు ఉత్త బగోన్లే కనవడ్డయి. రెండు చెంబుల నీళ్లు గుటగుట తాగి మళ్లా పనికివోయిండు.
ఓగుంటన్నర గుడ్డంల ఓ గడ్డి గుడిసే మా ఇల్లు. సుట్టూరా బొంత సంచులే మాకడ్డం. వానొస్తే ఆ గుడిసెలకు మోకాళ్లమందం నీళ్లొచ్చేటియి. అట్ల నో ఇట్లనో నేను పది పాసైన. ‘ఎండకాలం సెలవుల్ల తాత దగ్గర పడుకుందాం దారా తమ్మీ’ అంటే మూడో తమ్ము డు రాలె. ‘గుడిసెల్నే పడుకుంటా..’ అని మొండికేసిండు. తెల్లారి ఐదుగొట్టంగనే లేసే తమ్ముడు ఆ యాళ్ల ఏడైంది, అయినా లెవ్వలె. ఎంత విల్సినా లేస్తలేడేందని, ‘ఏమైందిరా వారి, లెవ్వుమంటే అస్సల్కే సప్పుడు జేత్తలెవ్’ అని కప్పుకున్న శెద్దరి గుంజిన. కనుగుడ్లు తెరిసినట్టే ఉన్నయి. నోటినిండా నుర్సులు కక్కుకొని ఉన్నడు. అవ్వా, నాయి న, పక్కపొంటోళ్లు అయ్యో ఎంతపనైందని నెత్తినోరు కొట్టుకున్నరు. ‘రాత్రి పాము కాటేసినట్టుంది, పోరని జీవునం పోయింద’ని శోకాలు వెట్టిర్రు.
హుజ్రాబాద్ మండలం చెల్పూర్ గ్రామంల వుట్టిన. నా పేరు కనకం రాజ్కుమార్. 2004ల డిగ్రీ దాకా సదువుకున్న. రోజులు గడుస్తున్నయి. ఉన్నట్టుండి ఓ రోజు మధునవ్వ మంచాన వడ్డది. అవ్వను మంచమ్మీద సూడలేక వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీస్కపోయినం. వారం రోజులకు దవాఖాన్లనే పానం వోయింది. మేం రెక్కలిరిగిన పక్షిలెక్కయినం. అవ్వ వోయిన రెండేండ్లకే నాయిన లింగయ్య కూడా అదే తొవ్వ వట్టిండు. అవ్వ, నాయినలు ఒక్కమొకాన కాటికి చేరేసరికి దూలం లేని ఇల్లు లెక్క, మాయి అనాథ బతుకులైనయి. ఓ దిక్కు పెండ్లికెదిగిన చెల్లె, ఇంకో దిక్కు ఎదిగిన తమ్ముళ్లను సూసుకుంటా ‘మేమేం పాపం చేసినంరా దేవుడా’ అని ఏడ్వని రోజు లేదు. ఓ రోజైతే ఏదన్న తాగి సద్దామనుకున్న. కని సత్తె ఈ జీవితానికేం అర్థముంటదని ఎనుకడుగేసిన.
చెల్లెను ఓ ఇంటిదాన్ని చెయ్యాల్నని, 2012ల నేనే ముందుగాళ్ల పెండ్లి చేసుకున్న. పేరు చంద్రకళ (మేన మర్దలు). నా జీవితంలకు చంద్రకళ రాక ఆరిపోయే వత్తికి నూనె అద్దినట్టయింది. చంద్రకళ పెండ్లికాక ముం దునుంచే మిషిన్ కుడుతది. పెండ్లయినంక నాగ్గూడ మిషిన్ కుట్టుడు నేర్పిచ్చింది. ఇద్దరాలుమొగలం చెల్పూర్లనే చెరో మిషిన్ కుట్టుకుంటా బతుకుతున్నం. వానొస్తే ఎప్పుడు కూల్తదో తెల్వని ఇంట్ల నెలకు మూడొందల కిరాయిచ్చుకుంట జీవితాన్ని ఎల్లదీత్తున్నం.
మొన్నటి ఐతారం.. నేను, చంద్రకళ మిషిన్ కుడుతున్నం. రెండుసార్ల రింగయినట్టుంది ఫోన్. మిషిన్ సప్పుడుకు ఇనవడక మూడోసారి ఎత్తి ‘హలో’ అన్న. ‘హలో, నేను ప్రగతిభవన్ నుంచి మాట్లాడుతున్న. రేపు సీఎం కేసీఆర్ సార్ మీ హుజ్రాబాద్కు వస్తున్నడు. అక్క డ మీటింగ్ వెట్టిండు, ఆ మీటింగుల ‘దళిత బంధు’ పథకం కింద మీకు కేసీఆర్ సార్ పది లక్షల రూపాలియ్యబోతున్నడని’ చెప్తే నమ్మబుద్ధి గాలె. బండేస్కొని ఇంటికి రానే అచ్చిండు మా మాజీ సర్పంచి సార్. ‘దళితబంధు పత్కం కింద గవర్మెంట్ మొదాలు సెలెక్ట్ చేసిన 15 మందిల నువ్వు గూడ ఉన్నవ్, జిరాక్స్ పేపర్లియ్యి’మం టే ఆయన చేతిల అన్ని పేపర్లు వెట్టిన. ఆ రోజు నాత్రి నిద్రవడ్తె ఒట్టు. కలనో, నిజమో అర్థం గాలె.
తెల్లారితే సోమారం. అటీటని తెల్లారనే తెల్లారింది. పెద్దపెద్ద సార్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నరు. కేసీఆర్ సార్ శాలపల్లికి రాకముందే 11 గంటల కల్లా పది లక్షల రూపాలు చంద్రకళ అకౌంట్ల జమైనయి.కేసీఆర్ సార్ రానే అచ్చిండు శాలపల్లికి. ఆయన చెయ్యిల మీదుగా ‘దళిత బంధు’ పత్కం కార్డు అందుకున్నం. అసలు నా జీవితంల ఇట్లా జరుగుతదని కలల గూడ ఊహించలె.
నాడే మందు తాగి సద్దామనుకున్న, మొండిగ బతికినందుకు దేవుడే కేసీఆర్ రూపంల అచ్చిండేమో. జీవితంల సూడని పైసల్ని ఒక్కమొకాన చెయిల వెట్టిండు. గవర్మెంట్ సార్లు ఎట్ల చెప్తే అట్లనే చేత్త. ఆ పైసలతోని నచ్చిన పన్జేస్కుంట. నేను బత్కుతా, పది మందిని బతి కిస్త. నేనే కాదు, నా తమ్ముళ్లు గూడ కుషీగున్నరు. అన్ని అర్హతులున్న మనిషికే కేసీఆర్ సార్ ‘దళిత బంధు’ పైసలిచ్చిండని ఊరంతా మెచ్చుకుంటున్నరు. నా రాతే కాదు, ఈ ‘దళితబంధు’ పత్కంతో నా తమ్ముళ్ల రాత గూడ మారుతది. దళిత బిడ్డలందరికీ కేసీఆర్ సార్ న్యాయం చేస్తడు. ఇది మాత్రం నిజం.