టీఆర్ఎస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఇప్పుడు నిజరూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. నేడో, రేపో పీఆర్సీలోని అన్ని విషయాలు చట్టరూపంలోకి వచ్చి అమల్లోకి వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆయుర్దాయం పెరిగిందని ప్రపంచస్థాయి మానవ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పుట్టిన వ్యక్తి సగటున ఎంతకాలం జీవించగలుగుతాడనే అంచనాలూ పెరిగాయి. 1800 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య నిపుణులు శాస్త్రీయంగా అంచనా వేసిన మానవుల జీవన ప్రమాణ వయస్సు 28 ఏండ్లు మాత్రమే. ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. బ్రిటన్లో 2018లో పుట్టిన పిల్లలకు జీవన ప్రమాణ వయస్సును పురుషులైతే 87.6 ఏండ్లుగా, స్త్రీలు అయితే 90 ఏండ్లుగా అంచనా వేశారు. అమెరికాలో జీవన ప్రమాణ వయస్సును 78.81గా నిర్ణయించారు. రష్యాలో ఇది 72.79, జపాన్లో 84.67. వేర్వేరు దేశాల్లో ఈ జీవన ప్రమాణ వయస్సును సగటున 80 ఏండ్లకు పైగా అంచనా వేశారు. ఇక మన దేశంలో మనుషుల జీవన ప్రమాణ వయస్సు 69.7 ఏండ్లు. ఈ వయస్సును సగటున లెక్కవేసిందే. విద్యావంతులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. జీవన ప్రమాణాన్ని బట్టి మనిషి ఆరోగ్యంగా ఉండి పనిచేయగలిగే వయస్సు బాగా పెరిగింది. ఈ కారణంగా ఉద్యోగంలో పదవీ విరమణ వయస్సును పెంచడం చాలా అవసరం.
ఇక అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులకు పదవీ విరమణకు వయస్సు పరిమితి అనేదే లేదు. మన తెలుగువాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన సాహితీవేత్త ఆచార్య వెల్చేరు నారాయణరావు 85 ఏండ్లు దాటిన తర్వాత కూడా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా పనిచేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మానవ శాస్త్రవేత్త అలన్ డండెస్ షికాగో విశ్వవిద్యాలయంలో తన 76వ ఏట తరగతి గదిలో పాఠం చెప్తూనే గుండెపోటుతో కన్నుమూశారు. వేర్వేరు అభివృద్ధి చెందిన దేశాల్లో 70 ఏండ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఆలోచించగలిగిన వరకు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సందర్శక ఆచార్యులుగా పనిచేయడానికి కూడా ఆ దేశాల్లో వయస్సు పరిమితి అనేదే లేదు.
అత్యుత్తమ శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు వయస్సులో చాలా పెద్దవారైనవారే చేశారు. పరిణతులైనవారి ఉన్నత అనుభవం, వారి సేవలు జాతికి ఎంతో విలువైన ఆస్తులు.ఈ దృష్ట్యా అనుభవజ్ఞుల సేవలు ఏ ప్రభుత్వానికైనా అవసరం.
విశ్వవిద్యాలయ ఆచార్యుల్లో, శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది రిటైర్ అయిన తర్వాతనే ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. వేరే దేశాల్లో ఉదాహరణలు అలా ఎన్నైనా చెప్పవచ్చు కానీ మన తెలుగువారిలో కొన్ని ఉదాహరణలు చెప్పుకొందాం. ఆచార్య తూమాటి దోణప్ప, ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య రవ్వా శ్రీహరి వంటి ఆచార్యులు 70 ఏండ్ల వయస్సు దాటిన తర్వాత కూడా ఎంతో అపురూపమైన పరిశోధన గ్రంథాలను రచించారు. ఆచార్య భద్రిరాజు 80 ఏండ్ల వయస్సు దాకా ప్రపంచస్థాయి పరిశోధనలను చేశారు. పండిన వయస్సులో, పండిన అనుభవంతో ఇలాంటి ఆచార్యులు పనిచేయడమనేది అటు శాస్త్రరంగంలో, ఇటు మానవ శాస్ర్తాల్లో చాలా అవసరం. అత్యుత్తమ శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు వయస్సులో చాలా పెద్దవారైనవారే చేశారు. పరిణతులైనవారి ఉన్నత అనుభవం, వారి సేవలు జాతికి ఎంతో విలువైన ఆస్తులు. ఈ దృష్ట్యా అనుభవజ్ఞుల సేవలు ఏ ప్రభుత్వానికైనా అవసరం. రంగరాజన్, మన్మోహన్సింగ్ వంటి ఆర్థికవేత్తలు, రక్షణ రంగంలో నిపుణులైన ఆచార్య రాజారామన్న, ఆచార్య హరినారాయణ, ఆచార్య పల్లె రామారావు వంటివారు మన దేశానికి అమూల్యమైన సేవలందించారు. ఇలాంటి నిపుణులకు వారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం సేవచేసే వెసులుబాటు ఉండాలి.
ఆర్థికశాస్త్ర, రాజనీతిశాస్త్ర, సామాజిక శాస్త్ర అధ్యయనాలు దేశ ప్రగతికి ఎంతో అవసరం. ఆయా రంగాల్లో పనిచేసే ఆచార్యుల సేవలు పరిణత వయస్సులో మరింత బాగుంటాయి. వాటిని జాతి వినియోగించుకోవడం చాలా అవసరం. న్యాయపాలన రంగంలో న్యాయమూర్తులు 65 ఏండ్ల వరకే కాదు 70 ఏండ్ల వయస్సు వరకు పనిచేసి వారి పరిణతమైన అనుభవాన్ని దేశానికి అందించాలి.
ఈ దృష్టితోనే తెలంగాణలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యరంగ ఆచార్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లుగా పెంచుతూ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకున్నది. వైద్యరంగంతోపాటు, ఇంజినీరింగ్, న్యాయశాస్త్ర, సాహిత్య రంగాలు, ఇతర మానవశాస్ర్తాలు కూడా దేశాభివృద్ధికి ఎంతో అవసరమైనవి. వైద్యంలో తక్షణ ప్రయోజనం కనిపించినట్లు ఈ రంగాల్లో జరిగే పరిశోధనల వల్ల తక్షణ ప్రయోజనం కనిపించకపోవచ్చు. కానీ ఈ రంగాల్లో కూడా జాతికి ఎంతో ప్రయోజనం చేకూరే విషయాలెన్నో ఉంటాయి. ఆర్థికశాస్త్ర, రాజనీతిశాస్త్ర, సామాజిక శాస్త్ర అధ్యయనాలు దేశ ప్రగతికి ఎంతో అవసరం. ఆయా రంగాల్లో పనిచేసే ఆచార్యుల సేవలు పరిణత వయస్సులో మరింత బాగుంటాయి. వాటిని జాతి వినియోగించుకోవడం చాలా అవసరం. న్యాయపాలన రంగంలో న్యాయమూర్తులు 65 ఏండ్ల వరకే కాదు 70 ఏండ్ల వయస్సు వరకు పనిచేసి వారి పరిణతమైన అనుభవాన్ని దేశానికి అందించాలి.
ఉద్యోగాలు క్రమంగా ప్రభుత్వరంగం నుంచి ప్రైవేట్ రంగానికి పోతున్నాయి. ప్రైవేట్ రంగంలో వయస్సు పరిమితి ఇంతే ఉండాలని ఆయా సంస్థలు నిర్ణయించుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలున్నా వారికి వెసులుబాటు ఉంటుంది. పనిచేస్తున్న ఉద్యోగులను తొందరగా ఇంటికి పంపడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందనుకోవడం అశాస్త్రీయమైన ఆలోచన. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 వరకు పెంచిన నిర్ణయం ఆహ్వానించదగినదే.