కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా తక్కువే. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత పటిష్టంగా, వ్యూహాత్మకంగా చేపట్టిన చర్యలే దీనంతటికి కారణం.
ప్రజా సంక్షేమం కోసం అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖను తన స్వీయ నియంత్రణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా వైద్య, ఆరోగ్యశాఖను నిర్వహిస్తూ, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం మరే రాష్ట్రంలోనూ జరగలేదు. హైదరాబాద్లోని గాంధీలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను స్వయంగా వెళ్లి పరామర్శించారు కేసీఆర్. గాంధీ దవాఖానలో గంట పాటు జనరల్ వార్డు నుంచి ఐసీయూ దాకా పరిశీలించిన ఆయన నేరుగా కరోనా రోగులతో మాట్లాడి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లను, ఇతర వైద్య సిబ్బందిని అభినందించారు. కరోనా రోగులకు కేసీఆర్ రాక ఎంతో సాంత్వన కలిగించిందనటంలో సందేహం లేదు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైరస్తో విరోచిత పోరాటం చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి కేసీఆర్ మాటలు ఉత్తేజాన్ని కలిగించాయి. కేవలం మాస్కుతోనే తిరుగుతూ కరోనా రోగులను ఓదార్చిన కేసీఆర్ తీరు అక్కడున్నవారిని అబ్బురపరిచింది. రోగుల్లో ఆత్మవిశ్వాసం పెల్లుబుకింది. మాకు కొండంత అండ ఉన్నదనే ధైర్యంతో కరోనా రోగులు కన్నీటి పర్యంతమయ్యారు.
కేసీఆర్ గాంధీ పర్యటన తర్వాత వరంగల్లోని ఎంజీఎం దవాఖానను సందర్శించారు. కుటుంబసభ్యులే దగ్గరకు రాని పరిస్థితిల్లో ముఖ్యమంత్రే స్వయంగా రోగుల దగ్గరికి వచ్చి, పరామర్శించడం చూస్తుంటే ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తున్నది. అక్కడున్న అసౌకర్యాలను తెలుసుకొని, ఎంత ఖర్చయినా సరే, రోగులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా మహమ్మారి ఒక తల్లి అయితే, దాని బిడ్డలు, బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ వ్యాధులు. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో ఫంగస్ల చికిత్స కోసం 230 పడకలను సిద్ధం చేశారు. ఈ వ్యాధి బారినపడిన రోగులకు ఇక్కడ 24 గంటలు చికిత్స అందిస్తున్నారు. చికిత్సతోపాటు రూపాయి ఖర్చులేకుండా ఆపరేషన్లు చేసే వసతులు కూడా కల్పించారు. బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు, మందులిస్తూ కార్పొరేట్ వైద్యానికి దీటుగా చికిత్స అందిస్తున్నారు. సరోజినీదేవి కంటి దవాఖానలో బ్లాక్ ఫంగస్కు గురైన కంటి సమ స్య బాధితులకు అవసరమైన కంటి పరీక్షలను నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఈ ఫంగస్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు 1500 బెడ్లు సిద్ధం చేయాలని, అన్నిరకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఒకవేళ కరోనా రూపం మార్చి మరో దశలో వచ్చి నా అరికట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ వైద్యాధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
కరోనా రోగులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి వైద్య సర్వే దేశానికే ఆదర్శం. ఈ సర్వే ద్వారా కరోనా రోగులు ఎంతమంది, ఎవరెక్కడ ఉన్నారన్న విషయం తేటతెల్లమైపోయింది. వారిని ఎక్కడికక్కడ హోం క్వారంటైన్ చేసింది. దీంతో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
కేసీఆర్కు దీటుగా ఆయన తనయుడు కేటీఆర్ కూడా ‘నేనున్నానంటూ’ కరోనా రోగులకు భరో సా కల్పిస్తున్నారు. తనకు కరోనా వచ్చినప్పటికీ ఐసొలేషన్లో ఉంటూ కూడా ట్విటర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఒక తెలంగాణ నుంచే కాకుండా, ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ సాయాన్ని కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. తనకున్న పరిచయాలతో ఇతర రాష్ర్టాల్లోని నాయకుల సాయం కోరుతూ అక్కడి ప్రజలకు సైతం భరోసానిచ్చారు.
ఈ విధంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం వీరోచిత పోరాటం చేస్తున్నది. రోగులకు అన్నిరకాల చికిత్సలు అందించడంతో పాటు టీకా వేసే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటివద్దే టీకా వేస్తున్నది. సూపర్ స్ప్రెడర్లకూ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభించింది. మూడురోజుల్లో ముప్పై కేంద్రాల్లో మూడు లక్షల మంది నిత్య సేవకులందరికీ వ్యాక్సిన్ అం దించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయం.
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)
–కోలేటి దామోదర్