అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ
దరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ర్టామురరిపు వరాహస్య భవతి!
(సౌందర్యలహరి-3)
‘అమ్మా! నీ పాదధూళి రేణువులు, అంతరంగంలోని అవిద్య అనే చీకట్లను తొలగించే జ్ఞానమనే సూర్యకాంతి సమూహాల వంటివి. మందమతులకు చైతన్యమనే కల్పవృక్ష పుష్పగుచ్ఛం నుంచి స్రవించే తేనియల ప్రవాహంగా, దరిద్రులకు వారి కోరికలు తీర్చే చింతామణి లాంటిది. జనన మరణాలనే సంసార సముద్రం మధ్యలో నిండా మునిగిన వారిని సముద్ధరించే యజ్ఞవరాహమూర్తి కోరల వంటివి’ అని స్తుతించారు ఆది శంకరాచార్యులు.
అమ్మవారి కృపాకటాక్షాలు ఉంటేనే భౌతిక ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగగలుగుతాం. పూర్వం అమ్మ పాదరేణువు ఒక్కటి ఎలాగో సంపాదించిన త్రిమూర్తులు తమతమ విధులను నిర్వహించ గలుగుతున్నారు. దేవతలు కాబట్టి, అది వారికి సాధ్యమైంది. మరి అజ్ఞానం, బద్ధకం, దారిద్య్రంలాంటి మాయామోహ సంసార చక్రంలో నిరంతర ప్రలోభాల పాలబడుతున్న మానవుల సంగతి ఏమిటి? దానికి పరిష్కారం చూపుతున్నారు శంకర భగవత్పాదులు. ఏకాగ్రతతో అమ్మను ధ్యానించి, సమర్పణా భావనతో సేవించిన వారిని తరింపజేయడానికి ఎల్లప్పుడు అమ్మ సిద్ధంగా ఉంటుంది.
విద్య.. అంటే అక్షరాస్యత కాదు. సద్వివేకంతో కూడిన జ్ఞానం. ధర్మాధర్మ వివక్ష. వీటినే పరాపర విద్యలు అంటారు. పరావిద్య పారమార్థిక జ్ఞానాన్ని బోధిస్తుంది. అపరావిద్య భౌతిక జగత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. వ్యక్తి పురోగతిలో రెండూ అవసరమే. పరావిద్యను ఆశ్రయించిన సాధకుల మనసులో ఏ విధమైన అజ్ఞాన అంధకారం ఉన్నా, దానిని సూర్యకాంతి.. చీకట్లను తొలగించినట్లుగా అమ్మవారే తొలగిస్తుంది. ‘అజ్ఞానధ్వాంత దీపికా’.. ‘అజ్ఞానమనే తిమిరాన్ని హరించే జ్యోతి లాంటిది అమ్మవారు’ అంటుంది లలితా సహస్రనామం. చీకట్లకు సొంత ఉనికి లేదు. వెలుగు లేకపోవడమే చీకటి. ఆ వెలుగు అమ్మను ఆశ్రయించడం వల్ల లభిస్తుంది. జ్ఞానాన్ని పొందాలన్నా, అంతశ్చేతనలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించాలన్నా.. బుద్ధి వికసించాలి. జడుడైనా అమ్మను ఆరాధిస్తే బుద్ధి చైతన్యవంతమవుతుంది.
అపరావిద్యను ఆశ్రయించిన వారికి అమ్మ ప్రగతినిస్తుంది. నిజానికి దరిద్రమనేది సంపద లేకపోవడం కాదు. ఉన్నదానిని గుర్తించి ప్రతిభావంతంగా వినియోగించుకోలేకపోవడమే. ఆశయాన్ని కాక ఆశ వెంట పరుగులు తీయడం దుఃఖహేతువు అవుతుంది. ఆ దుఃఖాన్ని తొలగించే ‘చింతామణి గృహాంతస్థా’.. ‘ఆశించిన ఫలితాలను ఇచ్చే చింతామణుల గృహాలలో ప్రభవించే తల్లి, లలితాంబ’ అంటుంది లలితా సహస్రనామం. ‘దుఃఖహంత్రీ’.. ‘దారిద్య్రం, పుట్టుక మొదలైన సకల దుఃఖాలను నాశనం చేయు పరాత్పరి’ అని పేర్కొంది.
ఫలితాపేక్షతో భౌతిక కర్మలను ఆచరించడం వల్ల ప్రయోజనం సిద్ధించినా, పరిమితమైన ఫలితాన్నిచ్చే అసంగతమైన కర్మల వల్ల జననమరణ చక్రంలో చర్వితచర్వణమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాకాక, సర్వసమర్పణా బుద్ధితో తల్లిని ఆశ్రయించే వారిని జగన్మాత తనలో లయం చేసుకుంటుంది. అవిద్య వల్ల జడత్వం, జడత్వం వల్ల దరిద్రం, దరిద్రం వల్ల జన్మబంధనం కలుగుతాయి. అవిద్య నశిస్తే జడత పోతుంది. దానివల్ల దరిద్రం అంతరిస్తుంది. ఫలితంగా అమ్మలో లయమయ్యే మోక్షసిద్ధి కలుగుతుంది. ఇవే ధర్మార్థ కామమోక్షాలు. వీటికి మూలమైన అవిద్యను పోగొట్టుకోవాలంటే అమ్మపాదాలను ఆశ్రయించాలి. అమ్మను ‘ముక్తిదా’ (ముక్తిని ప్రసాదించు చిద్రూపిణి), ‘ముక్తిరూపిణి’ (నిజస్వరూపాన్ని తెలుసుకోవడమనే ముక్తికి రూపమైన అమ్మ), ‘ముక్తినిలయా’ (సామీప్య సాలోక్య సారూప్య సాయుజ్యాలనే ముక్తికి నిలయమైన తల్లి) అని స్తుతించాయి లలితా సహస్రనామాలు. అలాంటి తల్లి మనందరికీ శ్రేయస్కరమైన జీవితాన్ని అనుగ్రహించాలని కోరుకుందాం.
పాలకుర్తి
రామమూర్తి