కాకతీయుల కాలం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సాహిత్యరంగంలో విశేష కీర్తి ప్రతిష్టలను పొందింది. కాకతీయులు స్వయంగా అనేక ఆలయాలు కట్టించి శాసనాలు వేయించినారు. అందులో సంస్కృత, తెలుగు, పద్య, గద్య శాసనాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో లభించిన ఉప్పరపల్లి శాసనం అచ్చంగా తెలుగు శాసనం. ఈ శాసనం పద్య గద్యాత్మకంగా ఉంది.
కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలంలో శ.సం. 1157 = క్రీ.శ. 1235 కాలంలో వేయించబడిన ఈ శాసనకర్త గణపతిదేవుని మంత్రి రేచర్ల రుద్రుడి మంత్రి రాజనాయకుని కొడుకు కాటయ.
101 పంక్తులున్న ఉప్పరిపల్లి శాసనంలో ఉత్పలమాల, కందం, మత్తేభ వృత్తాల్లో పద్యాలు, 2 గద్యా లున్నాయి. శాసన ప్రారంభంలో గణపతి, దుర్గి, హరి, సూర్యదేవుల ప్రార్థనతో పాటు వీరందరూ శాసనకర్త అయిన కాటయను రక్షింతురుగాక అని చెప్పబడింది. కాకతి గణపతిదేవుని తండ్రి మహాదేవుడని చారిత్రకులందరూ అంగీకరించారు. ఈ శాసనంలో గణపతి దేవుడు రుద్ర నరేంద్రుని సుతుడుగా చెప్పబడినాడు. రుద్రదేవునికి సంతానం లేని పక్షంలో గణపతిదేవుని దత్తపుత్రుడిగా స్వీకరించినట్లు కొందరి అభిప్రాయం. ఈ అంశాన్ని ఈ శాసనం బలపరుస్తున్నది. శాసనంలో గణపతిదేవుడు ‘సాదారాధిత త్రినేత్రుండు, విబుధజన వన వసంతుండు, రమణీయ సీమంతినీ జయంతుండు, సకల జన మనోరంజనుండు, నరాతి రాజ మదభంజనుండు, శరణాగత రాజ శరణ్యుండు, వినుతాఖిల రాజవరేణ్యుండు, ధైర్యామర సానుమంతుండు, దురగ రేవంతుండు, సత్యహరిశ్చంద్రుడు, విభవామరేంద్రుండు’ అని కీర్తించబడినాడు.
ఇక శాసనకర్త కాటయ గురించి ‘స(శ)ర నిధి గంభీరుడు, సుస్థిర తేజుండు, వంశ శేఖరుండు, దయాకరుండు, బుధాంబుజ దశ శతకరుండు’ అని వర్ణింపబడినాడు. ఇతడు గణపతి దేవునికి పరమ భక్తుడై అతని కారుణ్యం వల్ల అతుల విభవ సమేతుండై అనేక శివాలయాలను నిలిపి, తటాకాలను కట్టించి వనాలను నిర్మించినాడు.
పరమేశ్వరుని అంగభోగార్థం అనేక వ్రిత్తులను స మర్పించినాడు. తాను నిల్పిన పంచ లింగాలకు పిం చఱపల్లి గ్రామాన్ని దేవబ్రాహ్మణ వ్రిత్తులు కాకుండా సర్వనమస్యంగా సమర్పించినాడు. ఇంకా రవ్వసాని చెర్వులో రవ్వసాని మామిడితోట, రాజనాయకుని చెర్వులో వెలిపొలము, బొమ్మకంటి తెర్వు పడమటి నుంచి యేటిమడ మామిడి వనము, ఆ వనంలోని చింతవనం, ఊరి దక్షిణం తాటివనం.. ఈ విధంగా సమర్పించిన వ్రిత్తులు, వాటి సరిహద్దులు చెప్పబడినవి. ఇంకా దేవుని అంగభోగ, రంగభోగ, ధూపదీప నైవేద్య, తాంబూలాలకు అంగడి సుంకము కూడా సమర్పించబడింది.
ఈ శాసనంలో ఉన్న భాషను గమనించినట్లయితే పరిపుష్టమైన తెలుగు భాష స్వ రూపం మనకు అవగతమవుతుంది. ఒక్క అరసున్న వాడటం తప్ప మిగితా అన్ని లోపాలు సరిదిద్దబడి పూర్తిగా కావ్యాల్లో ఉపయోగించే భాష ఈ శాసనంలో మనకు స్పష్టంగా కనబడుతుంది.