పండితుడు బయలుదేరి శ్రీశైలం చేరుకునే సరికి బసవేశ్వరుడు లింగైక్యం చెందాడని తెలుస్తుంది. పండితుడు అక్కడే ఆగిపోయి అతడుకూడా లింగైక్యం చెందుతాడు. ఈ విధంగా మల్లికార్జున పండితుడు వేంగీ ప్రదేశంలో పుట్టినా తెలంగాణలోకి ప్రవేశించి ఉత్పాతాలు సృష్టించి చివరకు శ్రీశైలం ప్రాంతంలో లింగైక్యం చెందాడు. దీన్ని బట్టి పండితునితోపాటు వీరశైవం వీరరూపాన్ని ధరించి తెలంగాణలోకి ప్రవేశించిందని తెలుస్తున్నది. మల్లి కార్జున పండితుణ్ని ‘నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు, వేదవిదుడవు. ఈ విధంగా విభూతి, రుద్రాక్షలు ధరించటం తగునా?’ అని బ్రాహ్మణులు అతడిని ప్రశ్నించారట.
గోవిందప్రగడ, రాజుకు పెద్ద లెంక అయిన ధవళేశు నామయ్య ఇద్దరూ పండితుని శిష్యులైనారు. వారు రాజు ఆజ్ఞకన్నా పండితుని ఆజ్ఞను మన్నించడం మొదలుపెడ్తారు. దాంతో రాజు కోపిస్తాడు. అల్లయ్య, మధుపయ్యలు అనే శివభక్తులను బిజ్జల మహారాజు చంపగా బసవేశ్వరుడు ‘కళ్యాణి నగరం నాశనమగు గాక’ అని శపిస్తాడు. భక్తులు సేవకవృత్తితో ఉండాలని చెప్పి నామయ్య రాజుగారి చేతిలో ఉన్న కత్తిని తీసుకొని గోపురం పైకి ఎక్కి ‘ఉదయనచోడుని వంశం అంతరించునుగాక’ అని శాపమిచ్చి తనను తాను నరుక్కున్నాడు. మల్లికార్జున పండితుడు కోపంతో.. ‘రాజు బంధువర్గంతో సహా నశించునని శాపమిస్తాడు’. పానగల్లులో ఉత్పాతాలు పుట్తాయి.
కన్నడదేశంలో వీరశైవంలో కులవిభేదాలు కనపడవు. కానీ, మల్లికార్జున పండితుడు.., ‘ జనంపై ప్రేమ జనయిత్రిపై భక్తి-వదలలేని బాల పగిడి నేను/ భక్తిమీది వలపు బ్రాహ్మంబుతో పొత్తు-పాయజాల నేను బసవలింగా..’ అని అంటాడు. అందుకే, వర్ణవిభేదాన్ని పాటించే వీరశైవ బ్రాహ్మణులు తెలుగు ప్రాంతాలో ఆరాధ్యులుగా పిలువబడుతున్నారు. కన్నడదేశం వీరశైవంలో ఎటువంటి వర్ణభేదాన్ని పాటించరు. కానీ, తెలుగుదేశంలో వర్ణభేదాన్ని పాటించటం ఉంది.
తెలంగాణలో వీరశైవ కవుల్లో ప్రసిద్ధమైనవాడు పాల్కురికి సోమన. అతనికి తెలంగాణలోనే గాక, కన్నడదేశంలో కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి. సోమనాథుడు ఓరుగల్లు సమీపంలోని ఈ నాటి జనగామ ప్రాంతంలోని పాలకుర్తి గ్రామ నివాసి. సోమన తెలుగులో ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ అనే ద్విపద మహాకావ్యాలు రచించాడు. ‘అనుభవసారం’, ‘బసవోదాహరణం’, ‘చెన్నమల్లు సీసాలు’, ‘పంచప్రాకార గద్య’, ‘అష్టోత్తర నామగద్య’, ‘ఆకాంక్ష గద్య’, ‘శరణు బసవగద్య’, ‘బసవ రగడ’, ‘గంగోత్పత్తి రగడ’, ‘వృషాధిప శతకం’, ‘బసవలింగ శతకం’ మొదలైన లఘుకృతులను రచించాడు. కన్నడ భాషలో ఆయన ‘సద్గురు రగడ’, ‘చెన్నబసవ రగడ’, ‘శరణు బసవ రగడ’, ‘అక్షరాంక పద్యాలు’, ‘లింగ నామావళి’, ‘శీల సంపాదనం’, ‘శివగణ సహస్రమాల’ అనే లఘుకృతులను రచించాడు. పాల్కుర్కి సోమన ‘బసవపురాణం’లో బసవేశ్వరుని చరిత్రను, ‘పండితారాధ్య చరిత్ర’లో మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రను ఇతివృత్తంగా తీసుకొని రచించాడు. బసవ పురాణంలో బసవేశ్వరుణ్ని ఒక పురాణ పురుషునిగా భావించాడు.
జైన సాహిత్యంలో తీర్థంకరుల జీవితాలను చెప్పే కావ్యాలకు ‘పురాణం’ అని పేరుపెట్టడం ఉంది. అదే సంప్రదాయాన్ని అనుసరించి పాల్కుర్కి సోమన బసవేశ్వర చరిత్రకు ‘బసవ పురాణం’ అని పేరు పెట్టాడు. బసవన్నను ఒక పురాణ పురుషునిగా చేసి ఈ కావ్యాన్ని రచించాడు. ఆయన రచించిన రెండు కావ్యాల్లోనూ ఇతివృత్తాలు దేశీయమైనవి. ఈ ప్రాంతాల్లోనే దక్షిణ భారతంలో పుట్టిన మహాపురుషుల చరిత్రలు, దేశీయమైన ద్విపద ఛందస్సును తీసుకొని ఆ కావ్యాలను రచించాడు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606