ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తున్న సందర్భంగా ఒక ఆశాకిరణంలా జో బైడెన్ అగ్రదేశం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధికారం చేపట్టిన మొదటి 4 నెలల కాలం ముగిసింది. ఈ కాలంలో అమెరికా ఆర్థిక అభివృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో 6.3శాతం నమోదు కావడం విశేషం. ఇది గత ఏడాది 2020 చివరి త్రైమాసికం నమోదు 4.3శాతం కంటే రెండు శాతం ఎక్కువ.
2012 నుండి 2020 చివరి వరకు అన్ని త్రైమాసికాల కంటే 2021 మొదటి త్రైమాసికంలోనే అత్యధిక వృద్ధి రేటు నమోదు కావడం గమనార్హం. కేవలం వంద రోజుల పాలనలోనే 15 లక్షల 72 వేల కొత్త ఉద్యోగాలు అంటే నెలకు దాదాపు 5 లక్షల కొత్త ఉద్యోగాలు బైడెన్ సృష్టించగలిగారు. 1939 నుంచి ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ మొదటి వంద రోజుల పాలనలో ఇన్ని ఉద్యోగాలు సృష్టించలేదు. అమెరికా చరిత్రలో ఇది ఒక మైలురాయి.
వంద రోజుల పాలనలోనే ఆర్థిక, ఆరోగ్య రంగాలలో కరోనాను సైతం ఎదుర్కొంటూ అమోఘమైన వృద్ధిని అమెరికా ఎలా సాధిస్తున్నదో పరిశీలించాల్సిన విషయం. అమెరికా సర్వతోముఖాభివృద్ధి కోసం ఆయా రంగాలలో నిష్ణాతులుగా పేరుపొందిన ఆర్థిక వ్యవహార వ్యూహకర్తల సమూహాన్ని నియమించుకున్నారు. అందులో ప్రగతి శీల ఆర్థిక విధాన భావాలు కలిగిన జారెడ్ బెరిస్టిన్, హెదర్ జాసి మొదలు.. అమెరికా బడ్జెట్ కార్యాలయ నిర్వాహకురాలు, ఆదాయ సమానత్వం కోసం అనేక అంశాలను క్రోడీకరించి గ్రంథ రచనలు చేసిన నీరాటాండన్ లాంటి ఆర్థిక వేత్తలు కరోనా కష్టకాలం నుంచి బయటపడటానికి అనేక సంస్కరణలు రూపొందించారు. ముఖ్యంగా దాదాపు 150 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ప్రజల వైద్యం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. వచ్చే పదేండ్లలో 97శాతం జనాభాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే విధంగా చేయడం, అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న 39.6 శాతం ట్యాక్స్ పేయర్స్ నుంచి అదనంగా 4 లక్షల ట్రిలియన్ డాలర్లను పన్నుగా వసూలు చేసి రెవెన్యూ పెంచడం, కార్పొరేట్ ట్యాక్స్ను 28 శాతానికి పెంచడంతో పాటు కాలేజీ చదివే విద్యార్థుల కోసం దాదాపు కోటి రూపాయలు ఫ్రీగా లోన్లు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ‘పనిహక్కు’ చట్టాన్ని తీసుకొచ్చి గంటకు 15 డాలర్ల వేతనం నిర్ణయించారు. ‘అమెరికా వస్తువులనే వాడాలనే’ పాలసీ ద్వారా అమెరికా ఉత్పత్తులను కొనే విధంగా ప్రేరేపించారు. వచ్చే పదేండ్లలో మౌలిక వసతుల కల్పన కోసం 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టడంలాంటి అనేక కార్యక్రమాలను రూపొందించారు.
2019లో దేశంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోని వారు 9.2 శాతం ఉన్నారు. వీరందరికి ఇన్స్యూరెన్స్ తీసుకునే విధంగా ప్రోత్సహించారు. స్కూళ్ళను తెరవడానికి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం క్రింద 20 బిలియన్ డాలర్లు, లక్ష మందిని ప్రభుత్వ ఆరోగ్య కార్మికులుగా తీసుకొని, పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయడం కోసం 50 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఈవిధమైన కార్యాచరణతో అమెరికాలో కరోనా కేసులు కనిష్టస్థాయికి పడిపోయాయి. బైడెన్ పాలనా వ్యవహారాలను చక్కబెట్టడానికి అధ్యక్షుని ఉపన్యాస రచయిత మొదలు నాసా వరకు ప్రభుత్వ పాలనలోని అన్ని విభాగాల్లోనూ మొత్తం 55 మంది భారత సంతతికి చెందిన వాళ్ళను నియమించటం గమనార్హం.(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు)
డాక్టర్ బైరి నిరంజన్