జ్ఞాన సముపార్జన చుట్టూనే సాగుతుంది మనిషి జీవితం. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అన్నది అవగతం చేసుకునే ప్రక్రియ దీంట్లో ప్రధానం. బుద్ధికి ఉన్న చిత్రమైన స్వభావమేమిటంటే.. అప్పటివరకూ తాను నమ్మిందే నిజమని భ్రమిస్తుంది. ఆ నమ్మకం ఎంత బలమైనదంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు నిజమైన జ్ఞానపు ఛాయలను కూడా బుద్ధి సహించలేదు. తానే సబబు అని మొండికేస్తుంది.
భౌతిక ప్రపంచంలో సామాజికంగా, వృత్తిపరంగా మెరుగైన స్థానంలో ఉండటానికి సంబంధించిన విషయ జ్ఞానం, లౌకిక జ్ఞానం సంగతి పక్కనపెడితే.. ఏ క్షణమైతే మనిషి దృష్టి అంతరంగ ప్రయాణం ఆరంభిస్తుందో అప్పుడు సమకూరే అవగాహన, స్పష్టత పరిపూర్ణుడిని చేస్తుంది. మనిషి అంతర్ముఖుడు అయ్యేకొద్దీ భౌతిక ప్రపంచపు బాధల నుంచి విముక్తి లభిస్తుంది. మనుషులు, స్వభావాలూ, అంచనాలూ, అనుభవాలూ.. అన్నీ మనస్సులో అలజడి సృష్టించడం మానేసి తనను తాను తెలుసుకోవడం మొదలవుతుంది. తన బాల్యం నుంచి వయస్సు పెరిగేకొద్దీ అనుభవాల రూపంలోనూ, ఆలోచనల రూపంలోనూ నేను చాలా ప్రత్యేకం, అంటూ తనకు తాను పెంచుకున్న అహం మెల్లగా దాని అస్తిత్వాన్ని కోల్పోవడం మొదలవుతుంది.
అసలు నేనెవరు? అనే శోధనే జ్ఞానాన్వేషణను ముందుకు నడిపిస్తుంది. భౌతికంగా బతికేటప్పుడు తన రంగంలో కొద్దిగా జ్ఞానం సంపాదిస్తే, నాలుగు మాటలు గట్టిగా మాట్లాడగలిగితే, వ్యవహారాలు చక్కబెట్టగలిగితే అదే విజయం అనే భ్రమ కలిగేది. కానీ హృదయపు లోతులకు వెళ్లేకొద్దీ ఇంతకాలపు ఆ భ్రమలన్నీ పటాపంచలవుతాయి. తన హృదయానికి పైన ఎన్నో పొరలు కమ్ముకున్న భావన కలుగుతుంది. అన్నింటినీ విసిరికొట్టి మనిషి తనలోకి తాను చూసుకుందామనుకునేలోపు మరో సూత్రప్రాయపు జ్ఞానం వెంటాడుతుంది.
పర్వతంలా పేరుకుపోయిన అజ్ఞానాన్ని గ్రహించి, దాన్ని తొలగించుకొని జ్ఞానం వైపు మనిషి ప్రయాణం మొదలుపెట్టేసరికే జీవితంలో శక్తియుక్తులు క్షీణించుకుపోతాయి. అప్పుడు
సాగే ప్రయాణం అంతా జీవితం పట్ల నిర్లిప్తత, నిస్సత్తువ, నిస్సహాయత నుంచి ఏర్పడేదే. అది కూడా నిజమైన ఆత్మ జ్ఞానం కాదు.. జీవితం పట్ల ఓ వైరాగ్యం మాత్రమే అది!
హృదయపు లోతుల్లో ఉండే నిర్వికార, నిశ్చలస్థితిని; భయాలూ, భావోద్వేగాలకు అతీతమైన స్థితిని మనిషి చవి చూడటానికి ఎన్ని అడ్డుగోడలో కదా.. ఈ సంక్లిష్టతని ఛేదించినవాడే మనీషి అవుతాడు
నువ్వు ఫలానా విధంగా ధ్యానం చేస్తే.. ఫలానా క్రతువులు చేస్తే.. ఫలానా నిడివిలో ధ్యానంలో కూర్చుంటే నీకు ఆత్మ జ్ఞానం ప్రాపిస్తుంది, ముక్తి లభిస్తుంది అనే బోధనలు. ఈ ప్రపంచంలో అన్నీ నిర్వచించబడి ఉంటాయి. నిర్వచనాలకు లోబడి ప్రవర్తించేది బానిసత్వం అనే ప్రజ్ఞ కూడా తెలియనంతగా ఆ నిర్వచనాలు మెదళ్లలో పాతుకుపోయి ఉంటాయి. జ్ఞానమంటే నిర్వచనాల్లో కొట్టుకుపోవడం కాదు. అంతరంగ శోధనంటే రెండు క్షణాలు కండ్లు మూసుకొని మూడో క్షణం పుస్తకంలో రాయబడిన మార్పులు తనలో జరుగుతున్నాయో లేదో బేరీజు వేసుకోవడం కాదు. అలా బేరీజు వేసుకున్నప్పుడు ఆశించిన ఫలితాలు లభించకపోతే అసంతృప్తి మొదలవుతుంది. అసంతృప్తిని పెంచేది జ్ఞానమెలా అవుతుంది? స్పష్టత కలిగించేదీ, హృదయపు లోతులకు సహజసిద్ధంగా తీసుకువెళ్లేదీ.. స్వీయానుభవంతో అనుభూతి చెందేదీ స్వేచ్ఛ. జ్ఞానం లభించేది స్వేచ్ఛలోగానీ అస్పష్టతతో, ఎవరో చెప్పిన, ఎవరో నిర్వచించిన విషయజ్ఞానంతో కూడిన బానిసత్వంలో కాదు.
ఆత్మజ్ఞానానికి ఆధ్యాత్మిక, తాత్త్విక పేర్లు తగిలించడం కూడా సరికాదు. ఓ మనిషి అంతరంగ శోధనను సమూలంగా ఓ భావజాలంలోకి లాక్కెళ్లి నువ్వు అనుభవిస్తున్నదీ, నీకు జరుగుతున్నదీ ఇదీ అని మరో నిర్వచనంలో పడేయడమూ మనిషి స్వేచ్ఛను హరిస్తుంది. రోజుకో పది నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే చాలు నిన్ను నువ్వు తెలుసుకోగలవు.. అనే కొన్ని ప్రమాణాల మధ్య ఆ మనిషి ఆలోచనను ఈ భావజాలాలన్నీ ఇరికించేస్తాయి. పది నిమిషాలు కండ్లు మూసుకొని, తలనొప్పి తగ్గించుకొని, పీచంత ప్రశాంతతను సంపాదించేసుకుని ఎంత బాగుందో కదా అనే ప్రాథమిక స్థాయిలోనే మనిషి ఆగిపోతాడు వీటి వల్ల!
-కేఎస్