(1991 అక్టోబర్ 4న న్యూఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశంలో పీవీ ప్రసంగం)
ఇటీవల కొద్ది మాసాలుగా షెడ్యూల్డు కులాలు, తెగల వారిపై అత్యాచారాలు తరచుగా జరుగుతుండడాన్ని దేశం గమనించింది. వీటన్నింటినీ చూస్తుంటే ఈ దేశంలో వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంలో ఇంతవరకూ మనం కృతకృత్యులం కాలేకపోయాం. ప్రభుత్వం ఈ పీడిత తాడిత వర్గాలకు భూములు వగైరా ఆస్తులు ఇచ్చినప్పుడు, వారి హక్కుల సంరక్షణకు సంబంధించిన శాసనాలను అమలు జరిపినప్పుడు ఈ చర్యలను వ్యతిరేకించేవారు ఇలాంటి దాడుల్ని మరింత తీవ్రంగా జరుపుతున్నారు. ఇలాంటి సంఘటనలు షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల కారణంగానే జరుగుతున్నాయన్న సంగతిని మనం గుర్తించాలి.
షెడ్యూల్డు కులాలు, తెగల వారిలో చాలామంది పాలికాపులుగాను, సన్నకారు – చిన్నకారు రైతులుగాను ఏదో విధంగా బతుకు నెట్టుకొస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన వారి భూముల యాజమాన్యం, హక్కు భుక్తాలు, సాగుబడి వంటి కారణాల వల్ల ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. వ్యవసాయేతర పనులలో కూడా ఇతర వర్ణాలవారు చేయటానికి ఇష్టపడని వాటిని మాత్రమే ఈ షెడ్యూల్డు కులాలు, తెగల వారికి వదలివేయడం జరుగుతోంది. ఈ షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన ప్రజలు తమకు న్యాయంగా రావలసిన హక్కులను కోరుతున్నారు. తమ స్థితిగతులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి.
ఈ షెడ్యూల్డు కులాలు, తెగల వారి హక్కులను సంరక్షించడానికి వారిపట్ల వివక్షల్ని, అసమానతలవల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి రాజ్యాంగంలో ఎన్నో అవకాశాలు, ప్రత్యేక శాసనాలు ఉన్నాయి. అయినా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ‘పౌరహక్కుల రక్షణ చట్టం, 1955’, ‘షెడ్యూల్డు కులాలు, తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989’ ఇప్పటికే వచ్చాయి. ఈ వర్గాలపై అత్యాచారాల నివారణకు ప్రభుత్వం ఎంతో విపులమైన వివరణలతో కూడిన మార్గదర్శక సూత్రాల్ని తయారుచేసి అందజేసింది కూడా. ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, ఎస్టీల అభ్యుదయం కోసం ట్రైబల్ సబ్ ప్లాన్ వంటి ప్రత్యేక పథకాలు కూడా రూపొందించాం. అలాగే ఈ వర్గాలకు చెందిన ప్రజల విద్యాభివృద్ధికి ఆర్థికపరమైన మద్దతును ఇవ్వడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్నో ప్రత్యేక పథకాల్ని కూడా తయారుచేశాం.
అయినప్పటికీ వారి పరిస్థితి ఆశించినంతగా బాగుపడలేదు. పల్లెటూళ్ళలో వారి జీవితాలకు తరచూ కనీస రక్షణ కూడా లేకుండా పోతున్నది. ఎప్పటిలాగే వారు దారుణంగా పీడింపబడుతున్నారు.
వారి సాంఘిక పరిస్థితులలో ఎలాంటి మార్పులేక వారి స్థితి ఎంతో శోచనీయంగా ఉంది. అందుచేత వారికోసం ఏదైనా చేయవలసి ఉంది. ఆ చేసేది ఏదో సార్థకమయ్యేట్టుగా, సమర్థవంతంగా చేయవలసి ఉంది. ఇలాంటి సమావేశాలు ఇకముందు జరగాల్సిన అవసరం లేని పద్ధతిలో ఈ సమావేశం సఫలీకృతమైనదీ, ఆఖరిది అయి ఉండాలి. మళ్ళీ మనమందరం ఢిల్లీకి వచ్చి ఈ సమస్య మొదటిసారి కనుగొనబడినట్లుగా చర్చించవలసిన అవసరంలేని విధంగా మనం చూడాలి. ఈ సమస్య, దీని స్వభావాలూ, పుట్టు పూర్వోత్తరాలూ అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి తుది నిర్ణయాన్ని గట్టిగా తీసుకొని దానిని కట్టుదిట్టంగా అమలు జరపడానికి అవసరమైన మార్గాలను, వనరులను గుర్తించవలసిన తరుణం ఆసన్నమైంది. మీరు మీ మీ స్వస్థానాలకు తిరిగివెడుతూనే ఈ నిర్ణయాలన్నింటినీ అమలు జరపాలి.
పార్లమెంటులోనూ, రాష్ట్ర శాసనసభలలోనూ సర్వసామాన్యమైపోయిన కొన్ని దృశ్యాలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఖ్యాతి తెచ్చేవిగా ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పార్టీ నడుపుతోంటే మిగతా రాజకీయ పక్షాలవారు కేవలం ఆ పార్టీదే బాధ్యత అన్నట్టుగా ఉటంకిస్తూంటారు. అసలు సమస్యను గురించి పట్టించుకోకుండా మనం రాజకీయాలు నడపడం జరుగుతోంది. రాష్ర్టాల వారిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడిక ఈ ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. ఇప్పుడు, ఇక్కడ, ఈ సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొంటున్నందున – ఇది రాష్ర్టానికి సంబంధించిన విషయమో లేదా పార్లమెంటు గుర్తించి వట్టించుకోవలసిన విషయమో మనం నిర్ద్వంద్వంగా నిర్ణయించవలసి ఉంది. తృతీయ పంథా అనేది లేనే లేదు. మధ్యే మార్గం ఉండకూడదు. ఏదో ఒక పార్టీకి వీలైనప్పుడు ఒక విధంగానూ, మరొక పార్టీకి వీలు కానప్పుడు ఇంకొక విధంగానూ ఇష్టానుసారం వాదించడానికి వీలు ఉండకూడదు. పరిష్కార మార్గాలను నిర్ధారించవలసి ఉంది. అత్యాచారాలు తరుచుగా పునరావృత్తం అవుతున్న రాష్ర్టాలలో తక్షణ చర్యలకు పూనుకోవలసి ఉంది. గడచిన అయిదు సంవత్సరాలలో ఇట్టి దుస్సంఘటనలు తరచుగా జరుగుతున్న రాష్ర్టాలు కొన్ని ఉన్నాయి. ఈ ధోరణులను తక్షణమే అరికట్టవలసి ఉంది.
తమ రాష్ర్టాలలో ఉంటున్న షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలపై అత్యాచారాలు జరగకుండా నివారించడానికి అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవలసిందిగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇందుకు అవసరమైన చట్టాలు, మంది – మార్బలం ఏర్పాట్లు అన్నీ సర్వసన్నద్ధంగా ఉన్నాయని హోం మంత్రి ఇప్పుడే చెప్పారు కదా! ఏదైనా ఒక చట్టాన్ని ఆమోదించడం చాలా సులువు!
దానిని అమలు జరపడం చాలా కష్టం అనేది నాకు తెలుసు. అయినా ఇలాంటి సందర్భాలలో అమలుజరపడమే మరీ ముఖ్యం. ప్రజల నిశ్చయానికి ప్రతిబింబమైన చట్టం సార్థకం కావాలంటే, తక్షణమే ఈ దిశగా కొన్ని నిర్దిష్టమైన చర్యలను తీసుకోవలసి ఉంది. అనేక సందర్భాలలో చట్టాన్ని అమలు జరపవలసినవారే వెంటనే తగు చర్యలు తీసుకోకపోవడమో, లేక అవతలివైపువారితో చేతులు కలపడమో జరుగుతోంది. ఇలాంటి సందర్భాలలో ఇలాంటివారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి మనం తటపటాయించకూడదు. ఇంతకీ కావలసిందల్లా, గ్రామం వరకు అన్ని స్థాయిలలోనూ అవసరమైన చర్యలన్నిటినీ అమలు జరపడానికి దృఢసంకల్పంతో వ్యవహరించడం.
షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన ఈ ప్రజలందరినీ మన సమాజంలో పూర్తిగా ఎవరు ఎవరో తెలియజాలనంత, తెలుసుకోలేనంతగా, సమగ్రంగా విలీనం చేయడానికి కృషి చేయడమే మన ధ్యేయం.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్డు కులాలు, తెగల వారికి శాంతి భద్రతల యంత్రాంగం ఉపయోగపడటం లేదు. వారికి సంబంధించినంత వరకు అది లేనట్టే లెక్క. దీనికి తోడు పోలీసులలోనూ, జిల్లా పరిపాలనా యంత్రాంగంలోనూ తగినంత చురుకుదనం లేకపోవడం వలన ఈ సమస్య మరింత జటిలంగా పరిణమించింది. ఈ వ్యవస్థ సుదీర్ఘ చరిత్రనీ, భారతీయుల సామాజిక మనస్తత్వంలో రాజకీయంగా ఎంతో లోతుగా కూరుకుపోయిన దీని వేళ్ళనీ గమనించి పార్టీల ధోరణులకి అతీతంగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉంది.
నేనూ రైతునే.. గుర్తించడం లేదు
పీవీ నరసింహారావుకు వ్యవసాయమంటే ఎంతో మక్కువ. స్వయంగా పంటల సాగులో అనేక ప్రయోగాలు చేశారు. వంగర రైతులతో బీటీ పత్తి వేయించారు. ఆయుర్వేద మొక్కలపై ఆసక్తి కనబరిచారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లాభసాటి పంటలపై, వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు వేయాలని ఉద్బోధించారు. ఆయన స్వయంగా సాగు కూడా చేసిన విషయాలు చాలామందికి తెలియవు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఇండియన్ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా పీవీ తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘చాలా మంది మేధావులు నన్ను రచయితగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషా కోవిదుడుగా అభివర్ణిస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా గుర్తించినా ఫర్వాలేదు. కానీ అసలు నేనొక రైతును. ఆ వాస్తవాన్ని, ఆ విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. అది నాకు బాధగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
మరాఠీ అనువాదాల్లో తప్పుల సవరణ
బహుభాషా కోవిదుడైన పీవీ- మరాఠీ నవల ‘పణ్ లక్షాత్ కోణ్ ఘెతో’ను అబలాజీవితం పేరిట తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. ఆ నవల చదివిన తరువాత పీవీకి మరాఠీ భాషపై ఎంత పట్టున్నదనే విషయం దానిని ప్రచురించిన సాహిత్య అకాడమీ సభ్యులు గ్రహించారు. అప్పటినుంచి మరాఠీ నుంచి హిందీ, ఇంగ్లీషు, తెలుగులోకి అనువాదమైన ప్రతి పుస్తకాన్ని పీవీకి పంపించి, తప్పులను సవరించాల్సిందిగా కోరేవారు. కేంద్ర మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పీవీ ఎంతో ఆనందంగా ఆయా రచనల్లోని తప్పులను సవరించి తిరిగి పంపించేవారు. అంతటి సాహిత్యాభిలాషి ఆయన.