తెలంగాణను జలదృశ్యంగా మార్చి, దేశానికే ధాన్యాగారంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహార శుద్ధియూనిట్ల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు బృహత్తర ప్రణాళికను ప్రకటించటం హర్షణీయం. సాగు అనగానే వరి, వాణిజ్యపంటలు అనగానే పత్తి, మిర్చి అనే సంప్రదాయ పాత పద్ధతులకు చెల్లుచీటి చెప్పి మారుతున్న సామాజిక అవసరాలు, ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండేలా దిశానిర్దేశం చేశారు. ఆహారశుద్ధి యూనిట్లద్వారా వాణిజ్యపరంగా విజయాలు సాధించటానికి మౌలిక వనరులు, వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ధాన్యం నిలువకు అవసరమైన గిడ్డంగులు మొదలైన వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నది.
జల వనరుల కల్పన ద్వారా ఇప్పటికే కోటి 40లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలసాగు దిశగా దృష్టిసారించింది. అందుకనుగుణంగా 20 లక్షల ఎకరాల్లో పెద్ద ఎత్తున ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనికోసం ఎకరానికి మొదటి ఏడాది రూ. 26వేలు, రెండవ, మూడవ ఏండ్లలో ఐదేసి వేల చొప్పున సబ్సిడీ అందించనుంది. దేశంలో పామాయిల్కు భారీ డిమాండ్ ఉన్నది. ఏటా దాదాపు రూ. 75వేల కోట్ల విలువగల పామాయిల్ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనకు 22 మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం కాగా ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. అందుకే కొంత కాలంగా పామాయిల్ ధరలు నింగినంటాయి. ఏడాది కింద క్వింటాల్కు దాదాపుగా పది వేలున్న పామాయిల్ ధర ఇప్పుడు రూ.19వేలకు చేరుకున్నది. ప్రజల అవసరాలకు, మార్కెట్లో డిమాండ్తో సంబంధం లేకుండా కొనసాగుతున్న మూస పద్ధతి సాగువిధానాల మూలంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.
రైతులు పంట పండించడానికి అవసరమైన అన్ని వనరులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చింది. ఎరువులు, విత్తనాలు, ఉచిత విద్యుత్, పెట్టుబడి వ్యయం మొదలైనవి రైతుకు సజావుగా అందుతున్నాయి. నీటిపారుదల సౌకర్యం గురించయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇక మార్కెటింగ్ అనేది ప్రధానంగా నిలిచింది. అయితే ఉత్పత్తి దశలోనే మార్కెటింగ్ గురించి రైతులు ఆలోచించాలి. అందుకే రాష్ట్రప్రభుత్వం వ్యవసాయాన్ని శాస్త్రీయంగా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నది. రైతులను ఎప్పటికప్పుడు అన్ని విధాలా చైతన్యపరుస్తున్నది. వ్యవసాయదారులు కూడా సామాజిక పోకడలను, ఆహార అవసరాలను , మార్కెట్ తీరు తెన్నులను గుర్తెరిగి సాగుకు ఉపక్రమించాలి. ప్రభుత్వ ప్రయత్నానికి రైతులు తోడ్పడినప్పుడే వ్యవసాయం పండుగ అవుతుంది. ఇంటా, బయటా ఎదుర్కొంటున్న సకల సమస్యలు కనుమరుగై రైతు రాజవుతాడు.