కరోనా మహమ్మారి కారణంగా పాలన నెమ్మదించకూడదని తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినది. కొవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కృషి చేస్తున్నది. పాలన లో పారదర్శకత, జవాబుదారితనం పెంచడం, అవినీతి నిర్మూలనతో పాటు ప్రజలకు అత్యంత నాణ్యమైన సేవలు వేగంగా, సౌకర్యవంతంగా చేరవేసేలా అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొంటున్నది.
కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఈ-గవర్నెన్స్ తోడ్పడుతుంది. అలాగే కాగిత రహిత పాలనతో పర్యావరణ పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఎంతటి సమాచారమై నా, ఎన్నేండ్ల క్రితం నాటిదైనా డిజిటల్ విధానంలో నిక్షిప్తం చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ డిజిటల్ టెక్నాలజీ ప్రగతిని తాజాగా పార్లమెంట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమోక్రటిక్ (ప్రైడ్) సంస్థ అభినందించటం గమనార్హం. పాలనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా అండ్ డీప్ లెర్నింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలను వినియోగించడం ద్వారా దేశంలోనే లీడింగ్ ఈ-గవర్నెన్స్ స్టేట్ గా తెలంగాణ మారింది.
రవాణా శాఖలో నాణ్యమైన సేవలు అందించేందుకు ఆర్టీడీఏఈ ఆధారంగా తెలంగాణ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (ఫెస్ట్) అనే డిజిటల్ వేదికను అభివృద్ధి చేశారు. దీంతో ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలకు వెళ్లకుండానే నాలుగు కేటగిరీల్లో 17 రకాల సేవలను అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇందులో భాగంగా ఆవిష్కరించిన ‘టీ-యాప్’ ద్వారా ‘ఫెస్ట్’ సేవలను పౌరులు పొందగలుగుతున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా కళాశాల విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేయడం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. సృజనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలుగా రూపుదిద్దుకునే సంస్థలకు వేదికగా ‘టీ-హబ్’ నిలుస్తున్నది.
ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యలకు చెక్ పెట్టడంతో పాటు రెవెన్యూ సంబంధిత అంశాలు పారదర్శకంగా, సత్వర సేవలు అందేటట్టుగా చేయడం గొప్పవిషయం. ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’ ద్వారా వ్యవసాయ భూములను సమగ్ర డిజిటల్ సర్వేచేసి ఆన్లైన్ చేయడం భూ వివాదాలకు శాశ్వత ముగింపు పలికింది. రాష్ట్రంలోని 36 ప్రభుత్వ శాఖ ల్లో 350కి పైగా సేవలను ‘మీ-సేవ’ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ-ఫైబర్ ప్రాజెక్ట్ అమలు ద్వారా ఏజెన్సీ, మారుమూల ఆవాసాల్లో బ్రాడ్ బ్యాండ్, మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి రానుంది. దీని ద్వారా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడంతో పాటు నేరాలను అదుపు చేయగల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
డిజిటల్ పాలన కోసం అట్టడుగు వర్గాలను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వా మ్యం మరింత అవసరం ఉంది. డిజిటల్ పాలనలో సైబర్ ప్రమాదం ఏర్పడుతున్న దరిమిలా పాఠ్యాంశాలలో సైబర్ భద్రత గురించి అవగాహన కల్పించాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ హర్షణీయం.
-డాక్టర్ గుర్రం రజితాదేవి
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, కంప్యూటర్ సైన్స్,గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, హయత్నగర్)