హంతకుడే ‘అయ్యో.. పాపం’ అని ఏడ్చినట్లుంది రాష్ట్రంలోని కొన్ని పార్టీల వ్యవహారం.
తెలంగాణను నెత్తుటేర్లలో ముంచినవాళ్లు, అన్నిరంగాలను ఆగం చేసినవాళ్లు, ఇప్పుడే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదంటున్నరు. అమరులను తలుస్తున్నరు. ఆరాధిస్తామంటున్నరు. గుండెలు బాదుకొని బావురుమంటున్నరు! ఇంతవరకు బాగానే ఉంది. రాజకీయ నటన నటనలాగే ఉంటే బాగుంటుంది. కానీ వీళ్లు తమ మాటలు, చేతలతో నటనలో జీవిస్తున్నరు.
స్వరాష్ట్రం కోసం తెలంగాణ నలభై ఏండ్లు పోరాడింది. ఈ క్రమంలో వేల మంది ప్రాణాలు కోల్పోడానికి కారకులెవరు? ఎందరో తల్లులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చెందెవరు? తెలంగాణను వల్లకాడు చేసెందెవరు? చరిత్రలో ఈ ఘోరాలు, నేరాలన్నీ రికార్డు చేయబడ్డాయి. అది చెరిపేస్తే చెరిగిపోయే రాత కాదు. చారిత్రక సాక్ష్యం. తెలంగాణ సమాజం గుండెల్లో లావాలా రగులుతున్న వేదనాభరిత సన్నివేశం. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఓ రాజకీయ డ్రామా ఆడితే చేసిన పాపం సమసిపోతుందా? తప్పులు ఒప్పులవుతాయా? చరిత్ర క్షమిస్తుందా? 1948 నుంచి 2014 వరకు జరిగిన అన్నీ ఘటనలను ఇప్పుడు నోర్లు బార్లా తెరుచుకొని అరుస్తున్నవారు వెనక్కి చూసుకుంటే మంచిది. అమరులు అంటున్నదెవరు? వారి ప్రాణాలు తీసిందెవరు? ఆ గోసకు, వేదనకు ముగింపు పలికిందెవరు?
1948లో నాటి నిజాం రాష్ట్రంపై ఆపరేషన్ పోలో చేపట్టింది నాటి నెహ్రూ ప్రభుత్వం. హైద్రాబాద్ రాష్ట్రం విలీనమైంది. ఆ తర్వాత కూడా మిలట్రీ ఇక్కడే ఉన్నది. వందల మంది ఆ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై జేపీసీ కమిటీ వేసి వాస్తవాలు తెలుసుకొని రావాలని చెప్పిందెవరు? నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? నెహ్రూ కాదా? నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో చనిపోయిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందా? నాటి నెత్తుటి మరకలు అంటిన చేతులతో అమరుల స్థూపాలకు అభిషేకం చేస్తారా? అంతేకాదు ఎనిమిదేండ్ల్ల పాటు హైద్రాబాద్ రాష్ట్రంలో స్వయం పాలన సాగింది. ఆ తర్వాత కుట్రలు చేసి 1956లో ఆంధ్రా, తెలంగాణలను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేశారు. ఇది తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ ఉద్యమం వచ్చింది. అప్పుడూ తెలంగాణ బిడ్డలు బలయ్యారు. ఈ బలిదానాలకు బాధ్యత కాంగ్రెస్ది కాదా?
నీళ్లడిగితే, ఎరువులు అడిగితే, బతుకు దెరువు అడిగితే.. తెలంగాణ ప్రజల గుండెలపై తూటాల వర్షం కురింపించిందెవరు? వీళ్లా ఇప్పుడు తెలంగాణలో అమరవీరుల గురించి మాట్లాడేది. ఎంత విడ్డూరం. దీన్నిచూసి జనం నవ్వుకోరా? అంతెందుకు మలివిడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఊపందుకున్న తర్వాత కూడా ఈ పార్టీలే కదా తెలంగాణ ప్రజలను బలి తీసుకున్నది. ఓ వైపు ప్రపంచమే అబ్బురపడేలా ప్రజాసామ్యబద్ధ శాంతియుత ఉద్యమం జరుగుతున్నప్పుడు అంతులేని నిర్ల్యక్ష్యాన్ని ప్రదర్శించి 2009 నుంచి ఎన్ని వందల మంది బలవన్మరణాలకు కారకులయ్యారో వాళ్లకు తెలియదా? ఒకరా, ఇద్ద రా.. వందల మంది బిడ్డలు బలయ్యారు. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, నాటి అధికార పార్టీ వేసిన తప్పటడుగుల వల్లే కదా తెలంగాణ పల్లెలు బిడ్డలను కోల్పోయి కన్నీటి సంద్రాలైంది. ఇవన్నీ ప్రజలు మర్చిపోతరా?.
ఈ చిక్కటి నెత్తురు చేతులకు అత్తరులా పూసుకొని అమరులంటూ రోడ్లపై డ్రామాలు చేస్తే తెలంగాణ సమాజం నమ్ముతుందని మీరనుకోవడం భ్రమ. కొన్నిసార్లు గోబెల్స్ ప్రచారాలు పనిచేస్తాయి కావొచ్చు. కానీ అన్నిసార్లు, అన్ని తీర్లు మీ తప్పుడు ప్రచారాలు పనిచేయవు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ప్రాణాలు పోవడానికి అసలు సిసలైన కారకులు మీరే. తమకు తాము ఈ పార్టీలు, నాయకులు ఆలోచించుకుంటే హంతకుని ఆత్మకథ నెమరువేసుకు న్నట్లు ఉంటుంది. అందువల్ల నిజాలు దాచేయాలని చూస్తే దాగవు. ఎప్పటికైనా బయటకువస్తాయి. నిజం నిప్పులాంటిది. కాబట్టి ప్రజలను మోసం చేయాలని చూడొద్దు. ‘తెలంగాణ రాష్ట్రం విఫల ప్రయోగం’ అని చెప్పి చూపించడానికి ప్రయత్నాలు చేయొద్దు. కనీసం గతంలో చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పినా ప్రజలు క్షమిస్తారు కావొచ్చు. నిప్పుపై నిందలేయడం తగదు. పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగితే మిగతా ప్రపంచం చూడదా? విపక్ష పార్టీలు అమరుల గురించి హాహాకారాలు చేయడం మాని గతంలో వారికి చేసిన నష్టానికి, ఆ కుటుంబాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి. తెలంగాణలో అప్రతిహతంగా సాగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కండి. చిల్లర రాజకీయాలు మానుకోండి. రాష్ర్టానికి పెద్ద కొడుకులా గతకాలపు విషాదాలను పునరావృతం కాకుండా భద్రంగా రాష్ర్టాన్ని పాలిస్తున్న కేసీఆర్ను అడ్డుకోకండి.
(వ్యాసకర్త: క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే)