వాతావరణ మార్పును అరికట్టడం, జీవ వైవిధ్యాన్నికాపాడటంతోపాటు అడవులు పలురకాల వస్తు సేవలను అందిస్తాయి. కానీ, ఇటీవలి కాలంలో అడవుల విధ్వంసం సాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 మిలియన్ హెక్టార్ల అడవులు అంతరిస్తున్నాయి. 160 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ మన దేశంలో అభివృద్ధి పనుల పేర 5.7మిలియన్ హెక్టార్ల అడవులను కోల్పోయాం. వివిధ మానవ కార్యకలాపాల వల్ల 40శాతం అడవులను కోల్పోయాం.దీనివల్ల అనేక జీవజాతులు అంతరించటమే కాకుండావస్తు సేవలను కోల్పోతున్నాం. వాతావరణంవేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణకు,పునరుద్ధరణకు ఐక్యరాజ్యసమితి 2021-30నిపర్యావరణ పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది.
ప్యారిస్ ఒప్పందం ప్రకారం.. 2030 నాటికి 95 మిలియన్ల హెక్టార్లమేర అడవులను విస్తరించటానికి మన దేశం హామీ ఇచ్చింది. అడవుల పరిరక్షణ, పునరుద్ధరణలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నది. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి చేపడుతున్న చర్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాష్ట్రప్రభుత్వ చర్యల్లో హరితహారం ప్రధానమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వం, ముందుచూపు, నిబద్ధత మూలంగా ఈ కార్యక్రమం 2015లో ప్రారంభమైంది. రాష్ట్రంలోని అడవుల విస్తీర్ణం ఇప్పుడు 24శాతం ఉండగా, దీన్ని 33శాతానికి పెంచడం హరితహారం లక్ష్యం.
అడవులు అంతరించకుండా జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు, క్షీణించిన అడవులను పునరుద్ధరించటం హరితహారం కార్యక్రమంలో భాగం. ప్రభుత్వ విభాగాలతోపాటు భిన్న వర్గాల భాగస్వామ్యం మూలంగా 210. 85 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. 2019-20లో 38.17 కోట్ల మొలకలను నాటడం దేశంలోనే అత్యధికం. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. మొక్కలు పాతి, నగర అడవులను సంరక్షించటంలో జీహెచ్ఎంసీ చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ, ఆర్బర్ డే ఫౌండేషన్ హైదరాబాద్ను ప్రపంచ వృక్ష నగరాలలో ఒకటిగా గుర్తించాయి.
క్షీణిస్తున్న అడవులను సంరక్షించటానికి రాష్ట్రప్రభుత్వం జంగల్ బచావో-జంగల్ బడావో కార్యక్రమాన్ని చేపట్టింది.ఇది ప్రకృతి ఆధార పరిష్కార విధానానికి అనుగుణమైన పథకం. ‘కాంపా’ నిధులతో స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వ్యూహాలు చేపట్టడం ద్వారా 3.90లక్షల ఎకరాలలో అటవీ భూముల పునరుద్ధరణ జరిగింది. జంగల్ బడావో పథకం కింద అటవీ ప్రాంతాలు కానిచోట్ల భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఈ విధంగా నగర ప్రాంతాల్లో అటవీ క్షేత్రాలు ఏర్పడ్డాయి. నగరవాసులు ప్రకృతి సేవలు పొందుతున్నారు. నగరం లోపల, శివారులో 71వేల హెక్టార్ల మేర
238 అటవీ బ్లాక్లను వృద్ధి చేస్తున్నారు. 35 నగర అటవీ క్షేత్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 70 అటవీ బ్లాకులను వృద్ధి చేసి సంరక్షిస్తున్నారు. మానవ కార్యకలాపాల వల్ల ఇవి దెబ్బతినకుండా పరిరక్షణ చర్యలు తీసుకున్నారు. హరితహారం పథకం కింద చేపడుతున్న వివిధ రకాలకార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధిలక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి.
ప్రకృతి వ్యవస్థలను సుస్థిరాభివృద్ధి కోసం వినియోగించుకోవటం, అడవుల క్షీణతను అరికట్టడం, జీవవైవిధ్యం దెబ్బతినకుండా నిరోధించటం మొదలైనవి ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. విప్లవాత్మకమైన విధాన మార్పులు, హరితహారం కార్యక్రమం మూలంగా పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ మొదలైన ఆశించిన ఫలితాలు నెరవేరుతాయి. ఈ కార్యక్రమాన్ని మరింత భారీ ఎత్తున చేపట్టే ముందు- అడవులపై ఆధారపడే సామాజిక వర్గాల భాగస్వామ్యం, ఆయా వర్గాలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం, భిన్న శాఖల మధ్య సహకారం, శాస్త్రీయ పునరుద్ధరణ చర్యలు మొదలైన అంశాలను సమీక్షించుకోవాల్సి ఉంది.
(రేపు ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవం)
మోహన్ చంద్ర ,పర్గాయి