వరంగల్లు జిల్లాలోని మహబూబాబాద్ దగ్గర కందికొండ గ్రామంలో జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న ఒక శాసనం రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన వెన్నభూపాలుడు వేసింది. ఈ శాసనం రేచర్ల మాధవనాయకుని కొడుకైన వెన్నభూపాలుడు తన తండ్రి ఆజ్ఞతో దేవపురి (దేవరకొండ) నుంచి స్కందాద్రి (కందికొండ)కి వచ్చి రాజ్యస్థాపన చేసి పరిపాలిస్తున్న సమయంలో వేసింది.
శాశ.సం.1297 = క్రీ.శ.1375 రాక్షస సంవత్సరం, శ్రావణశుద్ధ పంచమి నాడు కందికొండలో జనార్దనస్వామిని ప్రతిష్ఠించి ఆ స్వామి పూజాదికాలకు భూమిని దానమిచ్చే సందర్భంలో శాసనం వేయించాడు. వెన్న మహీపతి తాను ప్రతిష్ఠించిన జగన్నాథాలయ స్వామి పూజాదికాలకు, అంగరంగ భోగాలకు కందికొండ చెరువు వెనుక అడ్డ, నేరడిను అడ్డచేను, ఆలేరులో మరుతురు, (జనగామ దగ్గర ఆలేరు కాదు. నెల్లికుదురు నుంచి మహబూబాబాద్ వెళ్లేదారిలో ఉన్న ఆలేరు) ఏడు మరుతుర్ల తూము భూమిని ధారపూర్వకంగా దానమిచ్చినట్లు తెలుస్తుంది.
సనంలో రేచర్ల వంశ వర్ణన ఉంది. చతుర్థ కుల వంశాల్లో రేచర్ల వంశం పవిత్రమైనదిగా పేర్కొనబడింది. విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణు పాదోద్భవులైన చతుర్థకులంలో జన్మించిన రేచర్ల వంశీయుల్లో అత్యంత బల పరాక్రమవంతుడు దాచానాయకుడు. ఇతడు యుద్ధరంగంలో పాండ్యరాజులను ఓడించినట్లు తెలుస్తుంది. ఇతని కుమారుడు సింగభూపాలుడు. అతనికి ఇద్దరు కొడుకులు అనపోత, మాధవ నాయకులు. మాధవ నాయకుడి కొడుకే ప్రస్తుత శాసనకర్త అయిన వెన్నభూపాలుడు.
ఈ వెన్నభూపాలుడు వేయించిన మరో శాసనం కందికొండ గ్రామపరిధిలో ఉన్న స్కంధాద్రి మీద 19 పంక్తుల్లో సంస్కృత భాషలో ఉన్నది. ఇతడు స్కంధాద్రి మీద ఉమా సమేత శివుడిని స్కంధాద్రినాథునిగా ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించిన సందర్భంలో శాసనం వేయించాడు. ఉమా సమేతస్య సదాశివస్య క్రీడార్థం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడింది.
వెన్నభూపాలుడు హరిహరాభేదాన్ని పాటించినట్లుగా ఈ రెండు కందికొండ శాసనాల వల్ల తెలుస్తుంది. వెన్నభూపాలుడు తన అనుచరుల పట్ల వెన్నవలె చాలా సున్నితంగా ఉంటాడనే ఉద్దేశంతో దేశికులవారు ఈ పేరు పెట్టినట్లు చెప్పబడింది.