ప్రజలారా.. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినయో మీ అందరికీ తెలుసు. గీ ఎన్నికలకు కారకులెవరో మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమచరిత్ర గురించీ, ముఖ్యమంత్రి కేసీఆర్కు మన కరీంనగర్ ప్రజల మీదున్న ప్రేమ గురించీ మీకు తెలియంది కాదు. సీఎం కేసీఆర్ మనసు గొప్పది కాబట్టే ‘రైతుబంధు’ పథకాన్ని హుజూరాబాద్లోనే షురూ చేసిన సంగతి మీకు ఎరికే. అలాగే ‘దళిత బంధు’ను కూడా ఇక్కడే షురూ జేసిండు. ఈ ఏడేండ్ల కాలంలోకేసీఆర్ తెలంగాణకు, హుజూరాబాద్కు ఎంతచేసిండో మనందరికీ అనుభవమే.
కానీ ఇరువై ఏండ్ల నుంచి తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతూ వచ్చిన టీఆర్ఎస్లో అనేక ఉన్నత పదవులు పొంది, రెండుసార్లు మంత్రి అయ్యి.. ‘నాకు ఆత్మగౌరవం ఎక్కువ, నేను మనసును చంపుకోను, నాకు పదవుల కంటే పరువే ఎక్కువని’ ఇప్పుడు ఈటల అంటున్నడు. 20 ఏండ్లలో టీఆర్ఎస్ పార్టీ గానీ, కేసీఆర్ గానీ ఎప్పుడైనా రాజేందర్ను చిన్నచూపు చూశారా? చిన్నచూపు చూస్తే ఇన్ని పదవులు వచ్చేవా?
ఇప్పుడు జరిగే హుజూరాబాద్ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య అని ఈటల అంటున్నడు. ఆత్మగౌరవానికి, అన్యాయానికి మధ్య అంటుండు. గీ మాటలు నమ్మదగ్గవేనా? ‘ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా తెలంగాణ ప్రజలకు తనను ఎరుక చేసినది కేసీఆర్’ అని నిన్నటిదాకా అన్నడు కదా ఈటల. ఇప్పుడు బజారుకెక్కి ఎందుకు లొల్లి పెడ్తున్నడు! ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మంచిదేనా? ఈటల మాటమాటకూ ‘నేను ప్రజల మనిషిని, నేను హుజూరాబాద్ ప్రజల ఎదలో ఉన్నా’ అంటున్నడు. ఈ ప్రజల మనిషికి ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినయి? ఆయన చేరిన బీజేపీ దేశాన్ని, దేశ ప్రజలను, రైతులను, విద్యార్థులను, విద్యావ్యవస్థను ఎట్లా నాశనం చేస్తున్నదో మనందరికి తెల్వదా? డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పెంచుతున్న బీజేపీలో చేరిన ఈటల ప్రజల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదా. ధరలు పెంచి ప్రజలను దారిద్య్రంలోకి నెట్టడం ధర్మమా? ఈటల చెప్పాలి.
దేశాన్ని అమ్మే పార్టీలో చేరి ఆత్మగౌరవం గురించి ఈటల చెప్తున్నడు! అభివృద్ధి గురించి అరుస్తున్నడు. తెలంగాణలో ఉన్నన్ని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అలాగే హుజూరాబాద్ ప్రజలను ఎవరు కొనలేరంటండు. మరి ఈ రాజేందర్ సార్ ఢిల్లీ పార్టీకి ఎంతకమ్ముడు పోయిండో చెప్పాలె. ఏమేం ఒప్పందం చేసుకున్నడో చెప్పాలె. దేశాన్ని, దేశ ప్రజలను బీజేపీ ఎన్ని కష్టాల పాల్జేస్తున్నదో మనం చూస్తలేమా? దేశంలో దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగని దినమున్నదా? ఏడాదినుంచి ఇప్పటిదాకా కొత్త వ్యవసాయ చట్టాలు వద్దని రైతులు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే పట్టించుకోని బీజేపీ సర్కార్, తెలంగాణ ప్రజల గురించి పట్టించుకుంటదంటే నమ్మాలా? ఇక రాష్ట్ర బీజేపీ నేత మాటలకు అంతుండదు, పొంతుండుదు. గోల్కొండను గొల్లకొండగా చేస్తడట. ప్రతి దాన్ని వక్రీకరించడం బీజేపీ నాయకులకు అలవాటైంది. తెలంగాణ లౌకిక ప్రజాస్వామ్య వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు తప్ప మరో మాట లేదు. మొన్న బీజేపీ నేత కొడుకు రైతులను తన వాహనాలతో ఎలా గుద్ది చంపాడో మనం చూడలేదా? మోదీకి ప్రపంచ దేశాలు తిరగడానికి సమయం ఉంటది. గాయపడ్డ రైతులను పరామర్శించడానికి మాత్రం టైం దొరకదు. ఇట్లా చేసే మోదీ పార్టీ మన తెలంగాణకు అవసరమా? ఈ రాజేందర్ గెలవటం అవసరమా?
పేద బిడ్డ, విద్యార్థి నాయకులే హుజూరాబాద్కు అవసరం. కొత్త తరానికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం రావడం మంచిపరిణామం. కాబట్టి పేదింటి బిడ్డను ఆశీర్వదిద్దాం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పార్టీల నుంచి కాపాడుకుందాం.