‘సమాజంలోని అత్యంత బలహీనుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తామనేదే దేశ గొప్పతనానికి కొలమానం’ అన్నారు గాంధీజీ. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమానికి పాటుపడటమే. ఈ సంక్షేమ రాజ్య భావజాలాన్ని కేసీఆర్ అణువణువునా ఒంటబట్టించుకున్నారనేది బుధవారం వాసాలమర్రి గ్రామంలో దళితులను ఉద్దేశించి మాట్లాడిన తీరును బట్టి అర్థమైంది. ‘దళిత బంధు’ పథకం అత్యుత్తమమైనదీ, అపూర్వమైనదనేది అనడంలో సందేహం లేదు. దళితులతో ఆయన సంభాషించిన విధానంలో ఈ పథకం విజయవంతం కావాలనే ఆరాటం, వారు బాగుపడాలనే ఆకాంక్ష ద్యోతకమవుతున్నది. తరతరాలుగా అభివృద్ధి మార్గాలు మూసుకుపోయి ఉన్న జనానికి హఠాత్తుగా పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నారనే భరోసాను వారికి కేసీఆర్ ఇవ్వగలిగారు.
తెలంగాణ జనజీవితంలో తరచూ తారసిల్లే మార్వాడీ వ్యాపారులను కేసీఆర్ తన ప్రసంగంలో ఉదాహరణగా చెప్పారు. ఒక మార్వాడీకి పది లక్షలు ఇస్తే ఏడాదిలో ఇరువై లక్షలు చేస్తారు. ఇందుకు కారణం డబ్బు పట్ల, దానిని వాడుకోవడం పట్ల వారి ఆలోచనా విధానం. ఇదేవిధంగా దళితులు పది లక్షల రూపాయలను తగు విధంగా వ్యాపారంలో పెడితే అవి పిల్లలు పెడతాయని వివరించారు. ఏ వ్యాపారం చేయాలనేది తొందరపడి నిర్ణయించుకోవద్దని, ఇంటిల్లిపాది అంతా వారమైనా, నెలరోజులైనా చర్చించుకోవాలని సూచించారు. తాము నిరాడంబర జీవితాన్ని గడుపుతూనే వ్యాపారంలోని సొమ్మును పెంపొందించుకోవాలని విడమరిచి చెప్పారు. అభివృద్ధికి సామాజిక ఐక్యత దోహదపడుతుందనేది కూడా కేసీఆర్ వారికి వివరించారు. ప్రభుత్వాధినేతగా కాకుండా ఆత్మబంధువుగా ఆయన మారిపోయారు.
ముఖ్యమంత్రిగా విధాన రూపకల్పనకే పరిమితం కాకుండా ప్రజలలో ఒకరిగా మారిపోయి వారికి ప్రేరణ ఇవ్వడం కేసీఆర్ ప్రత్యేకత. వాసాల మర్రిలో దాదాపు మూడు గంటల పాటు ఇంటింటికీ కలియ తిరిగి వారి జీవన పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. పేరుపేరునా పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మామూలు ముఖ్యమంత్రులు వేరు, ప్రజాభిమానం గల కేసీఆర్ వేరు. కేసీఆర్కు పేదల పట్ల ఎంత నమ్మకమో, వారికి ఆయన పట్ల అంతే విశ్వాసం. ఈ పరస్పరాభిమానం ఈ పర్యటన సందర్భంగా వెల్లువెత్తింది. కేసీఆర్ గ్రామ సందర్శన దళితుల్లో ఉత్సాహాన్ని నిం పింది. తమ కష్టాలు తీర్చడానికి దేవుడే మా వాడకొచ్చిండంటూ ఆనందపరవశులయ్యారు. ఇది దళిత జనహిత ప్రభుత్వమనే సం దేశం వాసాలమర్రికే కాదు, యావత్ తెలంగాణలోని దళితులందరికీ చేరింది.