తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవడానికి గొంతెత్తి అరిచే విపక్షాలు మన చారిత్రక సంపద విషయమై కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యకరం. రామప్ప ఆలయ సంరక్షణ విషయమై కేంద్రం చూపుతున్న ఉపేక్ష ఇందుకు తాజా నిదర్శనం. పురాతత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ ఆలయ మరమ్మత్తులను చేపట్టడం కేంద్రం బాధ్యత. ఈ కళాఖండం శిథిలం కాకుండా సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన సర్వ శక్తులు ఒడ్డుతున్నది. ఈ ప్రక్రియ కీలక దశకు చేరుకున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మరి ఈ విషయంలో జాతీయ పార్టీలకు చెందిన నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నట్టు?
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చటానికి యునెస్కో చారిత్రక, నిర్మాణ కళా నైపుణ్యాల విశిష్టతలను ప్రాతిపదికగా చేసుకుంటుంది. ఇప్పటిదాకా మన దేశంలో 38 చారిత్రక కట్టడాలు, సహజ ఆకృతులను వారసత్వ సంపదగా గుర్తించింది. వీటిలో 30 సాంస్కృతిక స్థలాలు కాగా ఏడు సహజ సిద్ధమైనవి, ఒకటి మిశ్రమమైనది. వాటిలో తాజ్మహల్, ఖజురహో, హంపీ, అజంతా- ఎల్లోరా గుహలు, సూర్యదేవాలయం, ఎర్రకోట, జంతర్మంతర్, కుతుబ్మినార్, మహాబలిపురం, రాజస్థాన్ హిల్ ఫోర్ట్, సాంచి, కజిరంగ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉన్నాయి. మరి తెలంగాణలోని రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, చార్మినార్, గోల్కొండ కోట మొదలైన వాటికి ఈ గుర్తింపు ఎందుకు రాలేదనేది ప్రశ్న.
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఈ దిశగా కృషి చేయాలంటూ కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఇక్కడి ప్రతిపక్షాలు తమ వంతుగా కేంద్రంపై ఒత్తిడి తేకపోగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శించడం ఆశ్చర్యకరం. ఉస్మానియా దవాఖానకు కొత్త భవనాలను నిర్మిద్దామంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. కొత్త సచివాలయ నిర్మాణం చేపడితే సంతోషించాల్సింది పోయి బురద జల్లుతాయి. వరంగల్ జైలును తరలించి అంతర్జాతీయ శ్రేణి దవాఖాన నిర్మిస్తామంటే సహించలేక పోతున్నాయి. మరి మన చారిత్రక సంపద విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి వారికి కనిపించడం లేదా? ప్రతిపక్షాలయినంత మాత్రాన ప్రభుత్వాన్ని విమర్శించాలనేమీ లేదు. బంగారు తెలంగాణ నిర్మాణానికి, ఆత్మగౌరవ బావుటా ఆకాశమంత ఎత్తున ఎగురవేయడానికి కలిసి రావలసిన ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలకు దిగడం విచారకరం.