బంగ్లాదేశ్ యాభైయవ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల వేళ భారత ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవటం ఇరుదేశాల సహజ అనుబంధానికి నిదర్శనం. బంగ్లా ప్రధాని షేక్ హసీనా వాజెద్ ఆహ్వానం మేరకు గత శుక్ర, శనివారాల్లో పర్యటించిన మోదీ అక్కడి అమరవీరుల స్మారక స్థలిని సందర్శించి ఇరుదేశాల సాంస్కృతిక సంబంధ, బాంధవ్యాలను నొక్కిచెప్పారు. ఆదినుంచీ బంగ్లాలో మతచిచ్చు రేపుతున్న ఉన్మాదశక్తులు హిఫాజత్ ఎ ఇస్లాం ఆధ్వర్యంలో మోదీ పర్యటనను నిరసిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య స్నేహానుబంధాలను ఇష్టపడని మతోన్మాదులు దేశ రాజధాని ఢాకా మొదలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస, దహనకాండకు పాల్పడ్డారు. అల్లర్లలో 11 మంది దాకా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవటం విషాదం.
భారత్-బంగ్లాదేశ్ది శతాబ్దాల చారిత్రక అనుబంధం. భారత్తో విడదీయలేని భాషా, సాంస్కృతిక అనుబంధం కలిగిన ఆ ప్రాంతం తూర్పు పాకిస్థాన్గా ఏర్పడిన తొలినాళ్ల నుంచీ బంగ్లాదేశ్గా అవతరణ దాకా ఓ పరాయి దేశంగా ఎన్నడూ పరిగణించబడలేదు. దేశ విభజన సమయంలో మత ప్రాతిపదికన తూర్పు పాకిస్థాన్గా అవతరించిన బంగ్లా ప్రాంతం తీవ్ర వివక్ష, అణచివేతలకు గురైంది. ముజబుర్ రహ్మాన్ నేతృత్వంలో సాగిన స్వయం నిర్ణయాధికార ఉద్యమంపై పాక్ సైన్యం అంతులేని నిర్బంధాన్ని అమలుచేసింది. ఆ నేపథ్యంలోనే 1970 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ సాధించినా అధికారం అప్పగించేందుకు ససేమిరా అన్నది. చివరికి వంగ బంధు ముజిబుర్ రెహ్మాన్ భారత్ సాయాన్ని అర్థించి, భారత్ సేనల అండదండలతో విముక్తి చెందింది. భారత్ అండతో 1971లో ప్రపంచ పటం మీద సర్వసత్తాక స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ సాక్షాత్కారించింది.
భౌగోళిక పొరుగు దేశంగా బంగ్లా ఏనాడూ దాయాదిగా వ్యవహరించలేదు. ఇరుదేశాలూ పరస్పర సహకారంతో ముందుకుపోతున్నాయి. కొవిడ్ పరిస్థితుల్లోనూ అన్నిరకాలుగా భారత్ అండగా నిలిచింది. వ్యాక్సిన్ అందించి ఇతోధికంగా ఆదుకుంటున్నది. 2015లో భారత్-బంగ్లా మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. మోదీ పర్యటనలో కీలకమైన ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసినా, రెండు దేశాల మధ్య తీస్తా జలాలు సహా, నదీజలాల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల విషయంలో పరిణతితో వ్యవహరించాలి. వర్తక వాణిజ్యరంగాల్లో సహకారం ఇరుదేశాల ప్రయోజనాలకు, అవసరాలకు పెద్దపీట వేయాలి. అలాగే ఉమ్మడి సమస్యగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమిష్టి కార్యాచరణతో ముందుకుపోవాలి. దీర్ఘకాలిక ఆచరణాత్మక సహకార విధానాలతోనే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది.
ఇవీ కూడా చదవండి..
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
గిరిజనులపై దాడి.. అధికారులపై మంత్రి సత్యవతి ఫైర్