సమాజ పోకడలను, గమనాన్ని ప్రభావితం చేసే నాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు
ఏటా ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకొంటున్నాం. జాతీయస్థాయి థియేటర్
ఇనిస్టిట్యూట్ వారు 1961 మార్చి 27న ‘ప్రపంచ థియేటర్స్ డే’ జరుపాలనినిర్ణయించారు.
నేడు ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం
రంగస్థలం ప్రాముఖ్యాన్ని చెబుతూ 1962 లో ప్యారిస్లో మొజీన్ కోకటియ్ ఒక వ్యాసం రాశారు. అది విస్తృత చర్చకు దారితీసింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా కళా రంగాల్లో నిష్ణాతులు ఒకరు మార్చి 27 నాడు నాటకరంగ పోకడలు, విశిష్టతలను సోదాహరణగా వివరిస్తూ పత్ర సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా వివిధ దేశాల రంగస్థల కళాకారులంతా వారి వారి రంగస్థల వేదికలపై ఘనంగా ప్రదర్శనలు, చర్చలు జరుపుతారు. ఏ కళారూపమైనా ఆలోచనతో మొదలై సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ దేశ భాషలు సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలను ప్రపంచ దేశాలకు ఏకీకృతంగా చూపించగలుగుతుంది.
మూస పద్ధతిలో ప్రదర్శిస్తున్న నాటకాల పోకడలకు కొత్త బీజం వేస్తూ రచయితలు సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకోవాలి. సామాజిక సమస్యలను, మహిళల స్థితిగతులను ఎత్తిచూపి మార్పుకోసం దారులు వేయాలి. మానవ హక్కులను ఎత్తిపట్టాలి. సహజత్వంతో కూడిన సందేశాలతో, సార్వజనీనకంగా ఉన్న రచననలతో సమగ్రంగా చూపించే ప్రయత్నాలు చేయాలి.
నాటకరంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రధానాంశం. నేటి ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీ సాయంతో నాటకాలను ప్రదర్శించడానికి ప్రయోక్తలు టెక్నీషియన్స్ ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు. సంగీతంలోనూ లైటింగ్లోనూ పాత్రల ఫ్రీజింగ్ లాంటివి సాంకేతికంగా చొప్పించి వాస్తవికంగా చూపించడానికి కృషి చేస్తున్నారు.
మన రాష్ట్రంలోనూ నాటక రంగంలోని అంశాలను కళారూపంగా దృశ్యరూపంగా చూపించటానికి ప్రయత్నిస్తున్నారు.సమస్యలను నాటకంలో సృజనాత్మకతతో ముగించగలిగినప్పుడు కళ దేశ భాషలకు సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది.
నాటక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగస్థల నిష్ణాతులు తమ అనుభవాలను, కొత్త ప్రయోగాలను, సిద్ధాంత వ్యాసాలను నాటక ప్రియులకు అందిస్తున్నారు. గతేడాది పాకిస్థాన్లోని ప్రముఖ నాటక రచయిత షాహిద్ నదీమ్ విలువైన సందేశాన్ని అందించారు.
సమకాలీన జీవన వైఫల్యాలతో పాటు మనుషుల బతుకు వ్యథలను చూపించగలిగే నాటకమే ప్రజాదరణ పొందుతుంది. అవే సామాజిక ప్రయోజనాన్ని సాధించగలుగుతాయని నాటక రచయిత పీవీ రమణ అంటారు. దీనికితోడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలను ఏటా నిర్వహిస్తూ కళాభిమానులను నాటక అభిమానులను ఇతోధికంగా ప్రోత్సహించటం హర్షణీయం.
నాటకం మరింత పరిఢవిల్లడానికి విశ్వవిద్యాలయాలు కృషిచేయాలి. నాటకం దశ- దిశ గురించి చర్చలు, ప్రదర్శనలు నిర్వహించాలి. సమాజ గమనానికి వెలుగుదారులు వేసే నాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వాలు పెద్ద పీట వేయాలి. నాటకరంగంలో కృషిచేస్తున్న వారిని తగు విధంగా ప్రోత్సహించాలి.
-రావుల పుల్లాచారి