దేశంలో రెండో విడత కరోనా వ్యాప్తి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో విస్తరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నది. రోజుకు 2.70లక్షలకు మించి వైరస్ బారిన పడుతున్నారు. కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాలు తొలి ఐదు స్థానాల్లో నిలుస్తుండగా, మరణాల్లో 86శాతం పది రాష్ర్టాల్లోనే నమోదవుతున్నాయి. ఢిల్లీ, యూపీలో పరిస్థితి చేయిదాటిపోయింది. తెలంగాణలోనూ ఈ రెండో దశ ప్రమాదకరంగా మారింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. బాధితులతో దవాఖానలన్నీ కిక్కిరిసిపోతున్న స్థితి. అత్యవసర మందుగా ఇస్తున్న రెమిడెసివిర్ లాంటి ఔషధం కొరతగా ఉన్నది. వైరస్ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, అటు కేంద్రం బాధ్యతాయుతంగా రాష్ర్టాలకు తోడ్పాటును ఇవ్వడం లేదు. ఇటు జనం కూడా నేరపూరిత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటం విస్మయం గొలుపుతున్నది.
కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రమే ఇతోధికంగా రాష్ర్టాలకు సాయపడుతూ దేశాన్ని ముందుండి నడిపించాలి. వర్తమానాన్ని చక్కదిద్దుతూనే భవిష్యత్ అవసరాలకు వ్యూహరచన చేయాలి. కానీ కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా అన్నింటినీ కాలానికే వదిలేసినట్లుగా వ్యవహరిస్తున్నది. ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేసి దాతృత్వాన్ని చాటిన కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఎదురయ్యే కొరతను గమనించకపోవటం గర్హనీయం. దేశంలో చాలా రాష్ర్టాల్లో వ్యాక్సిన్ కొరతతో డోసులు నిలిపేసే పరిస్థితి రావటం విధానలోపమే. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ప్రమాదమని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించినప్పటికీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి వదిలేసింది. ఎన్నికలు, కుంభమేళా లాంటివి కరోనా విస్తరణకు కారకాలనటంలో సందేహం లేదు. రాష్ర్టానికి 30 లక్షల డోసులు అవసరమని ప్రజారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాస్తే, రెండున్నర లక్షల డోసులే పంపి చేతులు దులుపుకొన్నది. వ్యాక్సిన్ పంపిణీలోనూ ఈ నిర్లక్ష్యం ఏమిటి? ఇది చాలదన్నట్టు తప్పుడు లెక్కలు చెప్తున్నది.
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం వైరస్ను కట్టడి చేయటానికి ప్రజలను చైతన్యపరుస్తూ లాక్డౌన్ లాంటి కఠిన, కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నది. ఫలితంగా మిగతా దేశాలతో పోలిస్తే దేశంలో కరోనా తీవ్రత కనిష్ఠ స్థాయిలోనే ఉంది. లాక్డౌన్ కారణంగా ఆర్థికవ్యవస్థ కుదేలైన తీరును గమనించి, సంపూర్ణ ప్రతిష్టంభన లేకుండా కొంత సడలింపులివ్వడం అప్పటికి సముచితమే. కానీ అదే సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సందర్భోచితంగా వ్యవహరించాలి. ఇటు పౌరసమాజం కూడా కఠిన నిబంధనలు పాటిస్తేనే సత్ఫలితాలు సాధ్యం. కనీస జాగ్రత్తలైన భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం పట్ల పౌరుల నిర్లక్ష్యం ఇప్పుడు పరిస్థితి విషమించటానికి కారణమవుతున్నది. మహమ్మారి ప్రమాద తీవ్రతను గుర్తెరిగి నడుచుకుంటేనే అందరి బతుకుకు భరోసా.