విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ‘ఉన్నత విద్యామండలి’ సైతం రాష్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల సహకారంతో ఉన్నత విద్యావిధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఈ నేపథ్యంలోంచే.. ‘దోస్త్’ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పక్రియలో పారదర్శకతను తీసుకొచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నూతన విద్యావిధానం’ అనుగుణంగా ఉన్నత విద్యలో సంస్కరణలను వేగవంతం చేసింది. అందులో భాగంగా డిగ్రీ స్థాయిలో ‘క్లస్టర్’ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. దీనికి అనుగుణంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సైతం విధి విధానాల రూపకల్పన చేస్తున్నది. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని కొన్ని కళాశాలల్లో ప్రవేశపెడుతున్నది.
ప్రస్తుత విధానం ప్రకారం.. విద్యార్థి ఇంటర్మీడియె ట్ తర్వాత డిగ్రీలో తనకు నచ్చిన కోర్స్ను ఎంపిక చేసుకొని చదవాలి. దీనికి ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలోని ‘దోస్త్’ద్వారా కాలేజీలో ప్రవేశం పొందుతాడు. ‘దోస్త్ వెబ్ సైట్’లో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలను ఎంచుకున్న తర్వాత ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంచుకున్న ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ కేటాయించ బడుతుంది. విద్యార్థులకు నచ్చిన కళాశాలలో డిగ్రీ చదువాలని ఉంటుంది. మార్కుల ప్రకారం, రోస్టర్ విధానం ప్రకారం విద్యార్థి కోరుకున్న కాలేజీలో అడ్మిషన్ లభించకపోవచ్చు.అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ‘క్లస్టర్’ విధానాన్ని ప్రవేశ పెడుతున్నది.
కొఠారి కమిషన్, జాతీయ విద్యావిధానం సిఫారసు ల మేరకు క్లస్టర్ విధానానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసింది. దీని ద్వారా విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలను కొన్ని క్లస్టర్లు గా విభజించి, ఆ క్లస్టర్లోని ఏదైనా ఒక డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థి తనకు నచ్చిన అదే క్లస్టర్లోని ఇతర కాలేజీలో క్లాసులు వినవచ్చు. అడ్మిషన్ ఒక కాలేజీలో ఉంటది, పాఠాలు విద్యార్థికి నచ్చిన అదే క్లస్టర్లోని మరొక కాలేజీలో వినవచ్చు. విద్యార్థికి నాణ్యమైన విద్యను పొందడానికి ఈవిధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ వినూత్న విధానాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అమలుచేస్తున్నారు. అందుకు హైదరాబాద్లోని కోఠి ఉమె న్స్ కాలేజీ, నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్, రెడ్డి ఉమెన్స్, సెయింట్ ఆన్స్ కాలేజీ మెహిదీపట్నం,సెయింట్ ఫ్రాన్సిస్-బేగంపేట, భవన్స్ కాలే జీ, లయోలా అకాడమీ కాలేజీలను క్లస్టర్ విధానానికి ఎంపిక చేశారు. కళాశాలలోని ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీ, లైబ్రరీ తదితర అంశాల్లో ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని వాటిలో ఎక్కడైనా విద్యార్థులు ఒక సబ్జెక్టు ను చదువుకోవచ్చు. దానికి సంబంధించిన పరీక్ష అదే కాలేజీలో నిర్వహించి, మార్కులు మాతృ కాలేజీకి పంపుతారు. దీన్ని డిగ్రీ కాలేజీలలోనే కాకుండా, హైదరాబాద్ ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టిస్ సహా ఇతర యూనివర్సిటీలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను క్లస్టర్ విధానంలోకి తీసుకురావడం ద్వారా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్’ విద్యార్థికి సైతం మరింత మేలు జరుగుతుంది. ఏదేమైనా, క్లస్టర్ విధానం విద్యార్థులకు ‘లెర్నింగ్ ఎక్స్పీరియన్స్’ ఇవ్వడమే కాకుండా, వారికి ఉన్నత నాణ్యమైన విద్య అందిస్తుంది.
డాక్టర్ రామకృష్ణ బండారు
(వ్యాసకర్త: KIIT డీమ్డ్ యూనివర్సిటీ, ఒడిశా, కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్)