‘ముఖతః విద్య బోధించే బ్రాహ్మణులు విధాత ముఖం నుంచి, భుజబలంతో యుద్ధం చేసే క్షత్రియులు విధాత భుజం నుండి, వాణిజ్యం చేసే వైశ్యులు తొడ నుంచి, శూద్రులు విధాత పాదం నుంచి ఉద్భవించారని’ పెద్దలు చెప్పారు!
దురదృష్టవశాత్తూ దేశంలో ఈ సత్యం తలకిందులైంది. శ్రామికులు, రైతులు, బీసీ-దళితులు అణిచివేతకు గురవుతున్నారు. పాలకు లు దీన్ని గుర్తించి, వారిని విముక్తి చేసే కర్తవ్యదీక్షకు పూనుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. బహుశా ఈ వాస్తవాన్ని గుర్తించి కాబోలు.. తెలంగాణ అధినేత నిన్న ‘రైతుబంధు’, నేడు ‘దళితబంధు’ను ప్రారంభించటం ముదావహం. రేపు ‘బీసీ బంధు’నూ ప్రారంభిస్తారన్న విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పారు. ఐతే దురదృష్టవశాత్తూ హూజూరాబాద్ ఎన్నికలు సాకుగా చూపి ‘దళితబంధు’కు బ్రేక్ వేయించిందట బీజేపీ! ఇంతకన్నా సంకుచితం ఉంటదా!
నోటిదాకా వచ్చిన దాన్ని అడ్డుకున్నారని బీజేపీపై దళితులు ఆగ్రహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలలో దళితుల పట్ల వారి వైఖరిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా బీజేపీ తీరు చూస్తే.. బీజేపీ ఒక విధానంగా మతపరమైన దాడులు చేస్తున్నది. ఈ ఏడాది గత 9 నెలల్లో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో దళితులపై 300పైగా దాడులు జరిగాయని ‘ది గార్డియన్’ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. హిందుత్వవాదులు మూకుమ్మడిగా చేసిన దాడులు 288కి పైగా ఉన్నయ్. ‘కేంద్ర మానవ హక్కుల కమీషన్’ (ఎన్.హెచ్.ఆర్.సీ), కేంద్ర హోంశాఖ వీటినెందుకు ఆపలేకపోతున్నాయో ఊహకందని విషయం కాదు. పైగా ఇలాంటి సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని మానవ హక్కుల సంఘాలు ‘నిజ నిర్ధారణ నివేదికను’ ప్రకటించినయి.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై జరిగిన దాడుల కేసులను నమోదు చేసుకోరాదంటూ ఆ పార్టీ నేతలు అనధికారికంగా పోలీసులను ఆదేశిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్మాదుల ఆగడాలకు అంతులేదు. యూపీలోని హథ్రాస్లో ఠాకూర్ అనే కులానికి చెందిన నలుగురు దుండగులు ఒక దళిత యువతిపై లైంగికదాడిచేశారు. ఆ విషయం చెప్పేందుకు వీల్లేకుండా నాలుక కోసేశారు. ఆమె కాళ్ళూ, వెన్నూ విరిచేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు అర్ధరాత్రి కాల్చేశారు.
కశ్మీరులోని ‘కతువ’ ప్రాంతంలో ఓ పూజారి, అతని మేనల్లుడు, మరికొందరు అసీఫా అనే 8 ఏండ్ల బాలికను దేవాలయంలోనే నిర్బంధించి, వారం రోజుల పాటు పైశాచికంగా లైంగికదాడి చేశారు. ఆ దోషులను శిక్షించాలంటూ ప్రజలు ఆక్రోశిస్తుంటే, మా వాళ్ళను శిక్షించరాదంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ కార్యకర్తలు బీజేపీ జెండాలతో నిరసన ప్రదర్శనలు చేయటం దేశమంతా తిలకించింది!
యూపీలోని ‘ఉన్నావ్’ పట్టణంలో ఉద్యోగం కోసం సాయం అర్థించిన యువతిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడని ఆమె తండ్రిని తీవ్రంగా కొట్టించాడు. ఆ దెబ్బలతో ఆయన మరణించాడు. అంతటితో ఆగకుండా.. కోర్టుకెక్కారన్న అక్కసుతో, కోర్టుకెళ్తున్న సదరు కుటుంబ సభ్యుల కారును, మరో వాహనంతో ఢీ కొట్టించాడు. ఆ ఘటనలో బాధితురాలికి తీవ్రమైన గాయాలు కాగా.. ఆమె బంధువు మరణించింది.
గుజరాత్లో ఆవు మాంసాన్ని అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో నలుగురు దళిత యువకులను, బట్టలూడదీసి, బండికి కట్టి చితగ్గొట్టారు. వాళ్ళను అక్కడి ప్రభుత్వం ఇంతవరకూ శిక్షించలేదు.
అందుకు ఆగ్రహించిన దళితులు చనిపోయిన పశు కళేబరాలను తాకటం మానేశారు. దాంతో గుజరాత్ గ్రామాలు చనిపోయి, కుళ్ళిన కళేబరాల దుర్వాసనతో నిండిపోయాయి. గుజరాత్ ప్రభుత్వానికి, ప్రజలకు తమ విలువను ఆవశ్యకతనూ అలా చాటిచెప్పారు దళితులు.
ఈ నేపథ్యంలో ప్రముఖ దళిత నేత మోత్కుపల్లి టీఆర్ఎస్లోకి రావటంతో తెలంగాణ దళితుల్లో ఉత్సాహం పెరిగింది. నాడు ఎన్టీఆర్ వెంట నడిచిన నర్సింహులు, తిరిగి ఎన్టీఆర్ వీరాభిమాని కేసీఆర్ వెంట నడిచేందుకు వచ్చారు. ఇది శుభపరిణామం. దళితులకు ఏ పార్టీ రక్షణగా ఉంటుందో ఇది ఓ సంకేతం.
-పాతూరి వెంకటేశ్వర్లు , 98490 81889