‘ఎచ్చమ్మ’ ముచ్చట్లు ఎడతెరిపి లేని వాన తీరు వాగులుబారి పోటెత్తుకుంట అలుగులు పారుతయి. ఆ కతల్ని వినేటొల్లు, చదివేటొల్లు ఆ ప్రవాహంల పడి కొట్టుకపోవా ల్సిందే. యశోదమ్మ ‘ఎచ్చమ్మ’ ఎట్లాయెనో ముందుగాల చెప్పాలె.
జాను పలుకుల తెలంగాణ తెలుగు భాష కు వాటిల్లిన ముప్పునకు మూతి ముడ్సుకొని కూసోలేక పల్లెల్లో బతికున్న తెలంగాణ భాషను కథలల్ల పొదిగి కలానికి కంకణం కట్టుకొని ‘కత’ల ఎవుసం చేసింది. ‘ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవనవిధానం ప్రతిఫలిస్తుంది. ఆ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఆ భాష ఆ జాతి కి ప్రత్యేకమైన ఆచార వ్యవహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలధాతువులను జీర్ణించుకొని రససిద్ధిని పొంది పలుకుబళ్లలో జాతీయా ల్లో, సామెతల్లో పొందుబడి ప్రభుత్వాన్ని నెరుపుతుంది..’ అంటుంది యశోదమ్మ.
నుడికారపు ఇంపుసొంపులు భాషకు జీవనాడి ప్రాణధాతువుల వంటివని ఎచ్చమ్మ చెప్తుంది. అంతటితో ఆగుతుందా ఆయమ్మ.. ‘అసలు సిసలు తెలుగు భాషా రుచిని ఆస్వాదించదలిచితె తెలంగాణ తెలుగును చదవండి, వినండిగాని అవగాహన లేకుండా అది అనాగరికుల భాషని, శిష్ట వ్యవహారికం కానిదని అవమానించకండి..’ అని సూటిగా చెప్పేస్తుం ది. అలాగే.. ‘భాషా సామ్రాజ్యానికి అధినేతలై ప్రభుత్వాన్ని నెరిపిన మహాకవులు తిక్కన, నాచన సోమన, గౌరన, ఎర్రన మొదలైన వారి ఘంటము నుంచి జాలువారిన భాషే తెలంగాణ భాష’ అని కుండబద్దలు కొడ్తుంది. తెలంగాణ పలుకుబడికి ముడిసరుకుగా కథలల్లి ‘మావూరి ముచ్చట్లు’, ‘ఎచ్చమ్మ కతలు’గా సంపుటాలు ప్రచురించింది. మనందరి భాష అయిన తెలుగు భాష అభివృద్ధే మన ధ్యేయం. ఈ తన కృషిని మనం మెచ్చితే తన ప్రయత్నం సఫలీకృతమైనట్లే అని చెప్పింది.
యశోదారెడ్డి కథలన్నీ వాస్తవిక ఘటనలు, సందర్భాలకు చెందినవే. తానే అన్నట్లుగా అవి ఆకాశం నుంచి ఊడిపడలేదు. జన సామాన్య పు జన జీవనదృశ్యాలనే కథలుగా మలిచినవి. మాటమాటకో జాతీయం, పలుకుబడి, సామెతలు విరివిగా గుప్పించే రచనాశైలి ఆమెది. ‘ఎచ్చమ్మ కతలు’ కథా సంపుటిని 2000లో 21 కథలతో ప్రచురించారు. అందులో ఒక కథ ‘పుర్రెకో బుద్ధి జివ్వకోరుచి’ ఈ సామెత మనం తరచూ వినేదే.
చిన్న విషయాన్ని తీసుకొని కథను అల్లడం, ఆ కథలో కవి త్వం పరుగులెత్తించడం యశోదారెడ్డి కథా కథనశైలికి ప్రత్యేక నిదర్శనం. ‘గర్భవతి అయిన కోడలు కొత్త రుచులు కోరుతుందని చేన్లకెల్లి తెచ్చిన పుంటికూరల శెనగపప్పేసి కూర వండితే ఆ కోడలమ్మకు అది రుచించక మూతి మూడు దిక్కులుగాంగ తూర్పు నుంచి పడమర దాంక దిప్పుకుంట ముక్కు వట్కగూసుండె. అందికె అన్నరు పెద్దలు ‘పుర్రెకో బుద్ధి, జివ్వకో రుచి’ అని పక్కింటి సీతమ్మ నిత్య పారాయణం మొదలుబెట్టింది. సామెతను జార్చిన ఆ నిత్యపారాయణంతోనే కథను మొదలుపెట్టిన రచయిత్రి ఆ కథలో తెలంగాణ జన జీవితాన్ని చిత్రి కడ్త్తుంది.
ఆమె ధ్యేయం సాహిత్యంలో సంస్కృతిని చిత్రించడం, భాషను శిల్పాలుగా చెక్కి అక్షరాల్లో నిలబెట్టడం. అందుకోసం ఏ చిన్న అం శాన్నీ వొదిలిపెట్టకుండా కలాన్ని కదిలిస్తుంది. సీతమ్మ నోట వచ్చిన సామెత ‘పుర్రెకో బుద్ధి జివ్వకో రుచి’ తన కండ్లు తెరిపిచ్చింది అంటుంది.
మరో చోట.. ‘అందరి రుచులు ఒక్కటి కా దని.. మనుషులకు ఎన్నో యావలుంటయని, వాటితోటే బతుకుల తీపి, రుచులు ఏర్పడుతయని.. వంకరలేని పొంకం యాడుండది? అని సరిపెట్టుకుంటుంది. మబ్బులిడిసి పున్నమి సందమామ వెల్గులు జల్లుకుంట వచ్చినట్లు అప్పుడు ఆమె మాడ్పుమొకం యిడ్సి నెత్తిదువ్వుకొ ని..’ అని వర్ణిస్తుంది. ఈ తీరి న యశోదారెడ్డి ‘కథల జడివాన కమ్మని తెలంగాన’ తెలుగు తీపి రుచులు వడ్డిస్తది.
(నేడు ఆచార్య పాకాల యశోదారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె కథా ముచ్చట్లు)
-అనిశెట్టి రజిత