భగీరథా! నీ ప్రయత్నం హర్షణీయం.నేను ఉన్నపళంగా దుమికితే.. తట్టుకునే శక్తి ఉర్వికి లేదు’ అంది దివిజ గంగ. ఎగిసిపడుతున్న గంగను తన సిగలో ముడిచాడు శంకరుడు. సురగంగ శివగంగ అయ్యింది. జట నుంచి జాలువారి భగీరథిగా మారింది. నురగలు కక్కుతూ సాగి సగరులకు మోక్షాన్నిప్రసాదించింది. యుగాలు దాటినా అదే మార్గంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ కర్మభూమిపై పుణ్యనదిగా నర్తిస్తూనే ఉన్నది.
ఒక పాపం గౌతముడిని కకావికలం చేసింది. ఆ శాప విమోచన కోసం కఠోర తపస్సు ఆచరించాడు ముని. తల్లి గోదావరి కరుణించింది. గౌతముని వెంట నడిచింది. ఉత్తుంగ తరంగాలతో దక్షిణ గంగ అన్న పేరును సార్థకం చేసుకుంది. ఆ భగీరథ ప్రయత్నం భారతావని మెడలో గంగను హారంగా వేసింది. ఈ గౌతముడి సంకల్పం గోదారిని తల్లి భారతికి వడ్డాణంగా చుట్టింది. యుగయుగాలుగా అదే మార్గంలో ప్రవహిస్తున్నాయి. అటువంటి చరిత్ర మరోసారి భారతావనిలో అదీ తెలంగాణలో సాక్షాత్కరించింది.
దక్షిణ గంగను ఉత్తరవాహినిగా మార్చిన ఘనత తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్కే దక్కుతుంది. గౌతముడు నడకలు నేర్పిన గోదావరికి కొత్త దారి చూపించాడీ రాజర్షి. కడలి వాకిట కనిపించే అఖండ గోదారిని కరువు నేలపై సాక్షాత్కరింపజేసిన అపర భగీరథుడు ఆయన. దూరదృష్టితో గోదావరికి ‘ప్రాణ’ం పోశారు. లోకానికి ‘హిత’ం చేశారు. గంగను దారి మళ్లించి తల్లి తెలంగాణ మెడలో గోమేధిక హారంగా మలిచారు. రిజర్వాయర్లనే భుజకీర్తులుగా కొలువుదీర్చారు. కాలువలను కరభూషణాలుగా తొడిగారు. సద్దుమణిగిన మంజీర నాదాలకు గోదారి గలగలలను జతచేర్చారు. ఉపనదికి ప్రధాన నదిని ఉపనదిగా మార్చి… గత పాలకుల పాపాల కూపాలను పూడ్చారు. స్వరాష్ట్రం నలుమూలలా జలకళను వరంగా ప్రసాదించారు.
ఆధ్యాత్మిక యాత్రల్లో నదీ పరిక్రమ విధానం ఒకటి. గంగ, సరయు, నర్మద వంటి నదులకు పరిక్రమ చేసే సంప్రదాయం ఉంది. మన గోదావరి నది పరిక్రమకు కూడా విశేషమైన ప్రాధాన్యం ఉంది. గోదావరి పుట్టిన త్రయంబకంలోని బ్రహ్మగిరి మొదలు బాసర, చెన్నూరు, భద్రాద్రి, రాజమండ్రి మీదుగా యానాం వరకు కొనసాగిన పయనం.. సాగర సంగమానికి నమస్కరించి తిరిగి కొవ్వూరు, బూర్గంపాడు, కాళేశ్వరం, మంథని, ధర్మపురి మీదుగా నాసిక్ నుంచి త్రయంబకం చేరడంతో గౌతమి పరిక్రమ పూర్తవుతుంది. ఉప్పొంగే గోదారి అందాలను అనుభవిస్తూ, గౌతమి తటిపై వెలసిన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సాగిపోయే నదీమతల్లి ప్రదక్షిణ ఆధ్యాత్మిక ఆనందంతోపాటు అలౌకిక అనుభవాన్ని పంచుతుంది. ఇప్పుడు ఈ పుణ్యధామాల సరసన మరెన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు వచ్చి చేరాయి. శతాబ్దాలుగా పుణ్యస్థలాలుగానే భాసిల్లుతున్న ఎన్నో ఆలయాలు తీర్థకేంద్రాలుగా తీరు మార్చుకుంటున్నాయి. కొండపోచమ్మ, కొమురవెల్లి, పాండురంగాశ్రమం ఇలా ఎన్నో ధార్మిక ప్రాంతాలు గౌతమీ పరిక్రమలో కొత్తగా చేరుతున్నాయి. గోదారి నీళ్లతో పునీతం అయిన చెరువులన్నీ ఇప్పుడు తీర్థరాజాలే. పుష్కర కేంద్రాలే! ఆ పల్లెల పొలిమేరల్లో కాపుకాస్తున్న పోలేరమ్మ, ఊరు నడిబొడ్డున ఉన్న బొడ్రాయి అన్నీ గోదావరి గట్టు మీద ప్రతిష్ఠితమైన ఆధ్యాత్మిక ధామాలే!!
త్రయంబకంలోని బ్రహ్మగిరి నుంచి సముద్రంలో కలిసే వరకు గోదావరి పొడవు సుమారు 1,465 కిలోమీటర్లు. నిర్దేశిత గోదావరి పరిక్రమ పూర్తి చేయడానికి సుమారు 3,500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ గడ్డపైనే గోదావరి పరీవాహక దూరం 1,832 కిలోమీటర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని ప్రదక్షిణ చేయాలంటే సుమారు 4,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందేమో! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కౌశలాన్ని చూసి, కాలువల్లో బిరబిర ఉరుకుతున్న జలదృశ్యాన్ని తిలకిస్తూ, ఏడాది పొడవునా నిండుకుండల్లా తొణికిసలాడుతున్న రిజర్వాయర్ల సౌందర్యాన్ని వీక్షిస్తూ, ఊరూరా గోదారి జలాలతో మత్తళ్లు దుంకుతున్న చెరువులను చూసి మురిసిపోతూ, ఆ గౌతమి జలాలతో పసిడి రాసులు కురిపిస్తున్న పంటలను ఆస్వాదిస్తూ చేసే కాళేశ్వర గోదావరి పరిక్రమ జన్మకో అదృష్టం!
-కణ్వస