మావోయిస్టుల సాయుధ పోరాటం సమాజంలోని విస్తృత వర్గాలను ఆకర్షించటం పాతికేళ్ల కిందటి నుంచే తగ్గుతూ మారుమూల అటవీ ప్రాంతపు గిరిజనులకు పరిమితమైంది. పోరాటం అంతకు ముందునుంచే పురోగమనం లేక ప్రతిష్టంభనకు గురైంది. ప్రస్తుత పరిస్థితులలో వారి
పోరాటపు నికరమైన ఫలితం అమాయక గిరిజనులు బలికావటంగా మిగిలిపోతున్నది. కనుక వారు పునరాలోచనలు చేయటం మంచిది.
ఉద్యమకారులు అంచనా వేసినదానికి భిన్నంగా పాతికేళ్లు గడిచిపోయాయి. అనగా ఒక కొత్త తరంగడిచిపోయిందన్నమాట. పైన అనుకున్నట్లు సంస్కరణల వల్ల విపరీతమైన విధంగా సంపదల కేంద్రీకరణ జరగటం లేదని కాదు. రష్యన్ ఆలిగార్కి, మెక్సికన్ ప్లుటోక్రసీ
వంటివి రావని కాదు. అందుకు తగినఅసంతృప్తులు సమాజంలో లేవని కాదు. అయినప్పటికీ విప్లవకారులు ఆశించినట్లుగా పరిణామాలు లేవు.
కాకతాళీయమే కావచ్చు గాని దేశంలో ఆర్థిక సంస్కరణల దశ, కమ్యూనిస్టు విప్లవకారుల క్షీణదశ ఇంచుమించు ఒకేసారి మొదలయ్యాయి. సంస్కరణలు అధికారికంగా 1991 నుంచి, అనధికారికంగా అంతకు ఐదేండ్ల ముందునుంచి మొదలుకావటం తెలిసిందే. అవి నిజమైన ఊపు అందుకోవటం 2000 తర్వాత జరిగింది. వనరులు, అర్థిక వ్యవస్థ , ప్రభుత్వ విదానాలపై వ్యాపార వర్గాలది పూర్తి ఆధిపత్యం ఉంటుంది. సంపదలు, జీడీపీ, బిలియనీర్ల సంఖ్యలు, ప్రపంచ ధనిక వ్యవస్థల ర్యాంకింగులలో భారతదేశం పైపైకి పోవటం వంటివన్నీ ఈ కాలంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అదే సమయంలో దేశంలో అసమానతలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ అసమానతల విషయంలో ఈ రోజున ఆసియాలోనైతే చైనా, భారత్, మొత్తం ప్రపంచంలోనైతే ఈ రెండు దేశాలతో పాటు రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, మెక్సికో ఒకే శ్రేణిలోకి వస్తాయంటూ చెప్తున్న అధ్యయనాలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రభుత్వాల విధానాలను గమనించగా ఈ ధోరణి కనీసం సమీప భవిష్యత్తులో మారగల సూచనలు లేవు.
ఆర్థిక సంస్కరణలు గట్టిగా మొదలయ్యేనాటికి ఇండియాలో విప్లవోద్యమం వయసు ఇంచుమించు పాతికేళ్లు. అనగా ఉద్యమంలో సంస్కరణల ముందుకాలంలో ఒకతరం గడవగా, ఆ తర్వాత ఇప్పటికి మరొకతరం గడిచిందన్నమాట. మొదటి తరంలో ఉద్యమం సమాజంలోని విస్తృత వర్గాలను ఆకర్షించింది, ఉధృతంగా సాగింది. అసలు వ్యవస్థనే కూలదోయగలదనే స్థాయికి ఎన్నడూ చేరలేదు గాని, తన ఉధృతితో, వ్యాప్తితో ప్రభుత్వాలను మాత్రం కలవరపాటుకు గురిచేసింది. అదే సమయంలో ఆ మొదటి తరపు చివరి కాలానికి వచ్చేసరికి చాలా ఎదురుదెబ్బలు తిన్నది. ప్రభు త్వం నుంచి సరేసరి కాగా అంతకన్న ముఖ్యంగా సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా అంతర్గత అనిశ్చితులు తలెత్తాయి. నాయకుల మధ్య విభేదాలు ముందుకొచ్చాయి. ఉద్యమం ఉన్నంతలో జోరుగానే ఉండినా లక్ష్యాల వైపు పురోగతి కన్పించక మైదాన ప్రాంతాలలో, యువతలో ఆకర్షణ తగ్గసాగింది. దానితో ఈ వర్గాలు కొత్త ఆశల తరగతి (యాస్పిరేషనల్ క్లాస్)గా మారుతుండటం, ఆర్థిక సంస్కరణలు తమకు అవకాశం కల్పించవచ్చుననే భావనకు లోనుకావటం మొదలైంది. అది ఇప్పటికీ జరుగుతున్నది. ఈ ప్రభావంలోకి వస్తున్నవారిలో మైదాన ప్రాంతాల వారితో పాటు అటవీ ప్రాం తాల వారు కూడా ఉన్నారు. వీరంతా అంతకుముందు వర కు విప్లవోద్యమానికి రిజర్వాయర్లు.
ఆర్థిక సంస్కరణలు మొదలవుతుండిన దశలో ఉద్యమ నాయకులు ఏమి అంచనాలు వేశారు? సంస్కరణలు, క్రోనీ క్యాపిటలిజం వల్ల సంపదలు ధనికుల చేతిలోకి మరింతగా వెళ్లటం, ధనిక- పేద తారతమ్యాలు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పెరగటం గురించిన ఇతర దేశాల ఉదాహరణలను వారు బాగానే చదివి ఉంటారు. కనుక ఇక్కడ అటువంటి అసంతృప్తి విప్లవానికి కలిసిరాగలదనుకున్నారు. మొదటి విప్లవ తరం చివరి దశ నాటికి తలెత్తిన ప్రతిష్టంభనలు, అయోమయాలు తొలగిపోయి, కాలం గడిచే కొద్దీ తిరిగి విస్తృత సమాజం, యువతరం విప్లవోద్యమం వైపు ఆకర్షితం కాగలదనుకున్నారు. ఇందులో తగినంత తర్కం ఉన్నమాట నిజం. ఆ విధంగా జరిగి ఉంటే విప్లవోద్యమం ప్రస్తుతం మనం చూస్తున్నట్లు గాక మరొకవిధంగా ఉండేదేమో చెప్పలేము. దాని అర్థం విజయం సాధించేదేమోనని కాదు. కాని కనీసం ఇట్లా బలహీనపడి, విస్తృత సమాజానికి ఆకర్షణారహితంగా మారేది కాదనవచ్చు. మరొకవైపు భారత ఆర్థిక వ్యవస్థకు కంపెనీల అప్పుల భారం వంటి సమస్యలు ఉండవచ్చు. కానీ అది కుప్పకూలగల ప్రమాదమేమీ కన్పించదు. కనీసం సమీప భవిష్యత్తులో.
మొత్తానికి అట్లా జరగలేదు. ఇప్పటికీ జరగటం లేదు. ఉద్యమకారులు అంచనా వేసినదానికి భిన్నంగా పాతికేండ్లు గడిచిపోయాయి. అనగా ఒక కొత్త తరం గడిచిపోయిందన్నమాట. పైన అనుకున్నట్లు సంస్కరణల వల్ల విపరీతమైన విధంగా సంపదల కేంద్రీకరణ జరగటం లేదని కాదు. రష్యన్ ఆలిగార్కి, మెక్సికన్ ప్లుటోక్రసీ వంటివి రావని కాదు. అందుకు తగిన అసంతృప్తులు సమాజంలో లేవని కాదు. అయినప్పటికీ విప్లవకారులు ఆశించినట్లుగా లేవు పరిణామాలు. ఎందుకు లేవన్నదానిపై వారి విశ్లేషణలు ఏమిటో మనకు తెలియవు. మన దృష్టికి మాత్రం ఏడు అంశాలు కనిపిస్తున్నాయి. 1.సంస్కరణల వల్ల తగినన్ని అవకాశాలు నిజంగానే లభించటం, 2.ట్రికిల్ డౌన్ వ్యూహం అనుకున్నా లేక నిజమైన ఆర్ద్రత, మానవత్వం అనుకున్నా పలు రూపాలలో సంక్షేమం అమలవుతుండటం, 3.అభివృద్ధి అని ప్రజలు భావించేది కూడా తగినంతవరకు జరుగుతుండటం, 4.తమ అంతర్గత బలహీనతలు, సైద్ధాంతిక అయోమయాల కొనసాగుదల, 5.విస్తృత సమాజంలో తమ పట్ల గౌరవం అయితే ఉన్నా, ఇప్పటికే పోయిన గురి మళ్లీ కుదరలేకపోవటం, 6.ప్రభుత్వాలకు గల అణచివేత శక్తి గణనీయంగా పెరగటం, 7.అసలు ప్రపంచవ్యాప్తంగానే వామపక్ష ప్రభుత్వాలు, పార్టీలు బలహీనపడి ఆకర్షణ కోల్పోతుండటం.
ఇటువంటి పరిస్థితుల మధ్య మారుమూల అటవీ ప్రాంతాలకు పరిమితమైన మావోయిస్టు ఉద్యమం విస్తృత సమాజానికి అయితే స్ఫూర్తిని, విశ్వాసాన్ని కలిగించటం లేదు గాని, బాధలకు గురవుతున్న గిరిజన వర్గాలను నమ్మించగలుగుతున్నది. దానిని ఆధారం చేసుకొని ఉద్యమం ఉనికి కాపాడుకుంటుండవచ్చు. కాని పురోగమనం లేకపోవటమే గాక క్రమంగా క్షీణిస్తున్నప్పుడు ఉపయోగమేమిటి? తమ ఉనికి కోసం గిరిజనులు బలికావటం తప్ప. విప్లవకారుల ఉద్దేశమే అదని ఎవరూ అనలేరు. కాని అనుద్దేశిత అంతిమ ఫలితం అదే అవుతున్నది.
టంకశాల అశోక్