మానవాళి చరిత్రలోనే అత్యద్భుతం కాళేశ్వరం నీటి ప్రాజెక్టు. నీరు పల్లమెరుగు అనే ప్రకృతి తత్వానికి విరుద్ధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అత్యంత తక్కువ సమయంలో, ఏకంగా ఒక నదినే ఎగువకు పారించి, బీడు భూములు సస్యశ్యామలం చేయడం ఒక అపూర్వ ఘట్టం. కాలువలు, సొరంగాల ద్వారా గోదావరి జలాలు దశలు దశలుగా నడకలు సాగిస్తూ సముద్ర మట్టానికి సుమారు ఆరువందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవడం ఒక పెద్ద వింత. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన బాహుబలి పంపులు కూడా మానవుడి సాంకేతికతకు మచ్చుతునకలు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలని తలపెడితే సాధ్యం కానిదేదీ ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికయైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, అబ్బురం కలిగించింది. ఈ మానవ నిర్మిత అద్భుతంపై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొంచిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ ఈ నెల 25న డిస్కవరీ చానెల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.
వార్ధా, పెన్గంగా నదుల కలయికతో ఏర్పడిన ప్రాణహిత… గోదావరి నదికి తోడైన తర్వాత నీటి ఉధృతి పెరుగుతుంది. ఇక్కడ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. కానీ ఈ ప్రాజెక్టు వల్ల రెండు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 1. ముంపు గ్రామాలు మహారాష్ట్రలో ఉండడం. 2. 160 టీఎంసీల కోసం ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. కానీ 100 టీఎంసీలు కూడా లభించడం కష్టం.
తెలంగాణ రాష్ట్రం సాధించాక పై సమస్యలు పరిష్కరించడానికి కొత్త డిజైన్లతో ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిని రెండు ప్రాజెక్టులుగా విభజించారు. 1.బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు. ప్రాణహిత నదిపై తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాలకు నీరు అందిస్తారు. 2. మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మేడిగడ్డ దగ్గర గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని డిజైన్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 మే 2న శంకుస్థాపన చేసి, 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 540 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకోవచ్చు. దీని కోసం అనేక బరాజ్లు, రిజర్వాయర్లు నిర్మించారు. బరాజ్ అంటే నీటిని మళ్లించడానికి నిర్మించేది. రిజర్వాయర్ అంటే నీటిని నిల్వ చేయడానికి నిర్మించేది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ను 7 లింకుల ద్వారా నిర్మిస్తున్నారు.
లింక్-1
మేడిగడ్డ దగ్గర నిర్మించిన ఈ బరాజ్ వల్ల 16 టీఎంసీల నీళ్లు నిల్వ చేయవచ్చు. ఈ బరాజ్కు లక్ష్మీ బరాజ్ అనే పేరు పెట్టారు. ఈ నీటిని పదకొండు మోటర్లతో అన్నారం బరాజ్కు ఎత్తిపోస్తారు. అన్నారం దగ్గర మరో బరాజ్ నిర్మించారు. దీనికి సరస్వతి బరాజ్గా నామకరణం చేశారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఈ బరాజ్లో 11.9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి . ఇక్కడ నిల్వ చేసిన నీటిని ఎనిమిది మోటర్లతో సుందిళ్ల బరాజ్కు ఎత్తి పోస్తారు. సుందిళ్ల దగ్గర మరో బరాజ్ నిర్మించారు. దీని పేరు పార్వతి బరాజ్. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. దీనిలో 8.83 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి.ఈ నీటిని తొమ్మిది మోటర్లను ఉపయోగించి ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తారు. లింక్-1 ద్వారా 30 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు.
లింక్-2
మొదట ఎల్లంపల్లి బరాజ్ నుంచి మేడారం రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు. దీనికోసం 2 టన్నెల్స్ ఉపయోగిస్తున్నారు.ఒక్కో టన్నెల్ పొడవు 11 కి మీ. టన్నెల్ నిర్మాణానికి కారణం దారి మధ్యలో కొండలు ఉండడం. టన్నెల్స్ మధ్యలో సర్జిపూల్ నిర్మించారు. సర్జిపూల్ అంటే భూమి కింది భాగంలో నీళ్లు నిల్వ చేయడం.ఇక్కడ ఉపయోగించే మోటర్లను బాహుబలి మోటర్లు అంటారు. ఇంత కెపాసిటీ ఉన్న మోటర్లు మరెక్కడా లేవు. గాయత్రి భూగర్భ పంపింగ్ సెంటర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువలోకి నీళ్లు పంపిస్తారు. శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి నీళ్లు మిడ్మానేరు రిజర్వాయర్కు చేరుతాయి. ఈ విధంగా లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు తరలిస్తారు.
లింక్-3
దీనిలో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని తరలిస్తారు. మొదట మిడ్ మానేరు నుంచి మాల్కంపేట రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు.అక్కడ నుంచి అప్పర్ మానేరుకు నీరు తరలిస్తారు. దీని కెపాసిటీ రెండు టీఎంసీలు. ఇక్కడ నుంచి చిన్నచిన్న రిజర్వాయర్లు నింపి పొలాలకు నీరు తరలిస్తారు. లింక్-3 ద్వారా 86,150 ఎకరాలకు నీరు అందుతున్నాయి.
లింక్-4
మిడ్ మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్కు, శ్రీరంగనాయక రిజర్వాయర్కు, మల్లన్న సాగర్కు నీరు తరలిస్తారు.ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్కు తరలిస్తారు. అక్కడి నుంచి షామీర్పేట్ రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు.ఈ విధంగా పంట పొలాలకు నీరు అందిస్తారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 50 టీఎంసీలు. కాళేశ్వరం మొత్తంలో అత్యధిక టీఎంసీల నీరు నిలువ ఉంచే రిజర్వాయర్ మల్లన్నసాగర్. కొండపోచమ్మకు నీరు తరలించడం అంటే సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించడం. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. లింకు-4 ద్వారా 5,95,754 ఎకరాలకు నీరందుతున్నాయి.
లింక్-5
దీనిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్కు గోదావరి నీరు చేరుతయి. ఇక్కడి నుంచి చిట్యాల మండలానికి కాలువల ద్వారా నీటిని పంపిస్తారు. లింక్-5 ద్వారా 2,43,500 ఎకరాలకు నీరు అందుతుంది.
లింక్-6
దీనిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి నీటిని సింగూరు ప్రాజెక్టుకు తరలిస్తారు. సింగూర్ నుంచి మంజీరా నది ద్వారా నిజాంసాగర్కు నీరు పంపిస్తారు. ఇక్కడి నుంచి మంజీరా నది ద్వారా శ్రీరాంసాగర్కు నీళ్లు చేరుకుంటాయి. లింక్-6లో భాగంగా 2,80,296 ఎకరాలకు నీటిని అందిస్తున్నారు. ఈ విధంగా గోదావరి నీళ్లు తెలంగాణ చుట్టూ తిరిగి గోదావరిలోనే కలుస్తాయి.
లింక్-7
దీనిలో భాగంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి చిన్నచిన్న రిజర్వాయర్లకు నీటిని పంపిస్తారు, వీటి ద్వారా నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలకు నీళ్లు లభిస్తాయి. లింక్ -7 ద్వారా 5,90,000 ఎకరాలకు నీటిని అందిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు
ఈ ప్రాజెక్టు వల్ల 45 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు, స్థిరీకరణ జరుగుతున్నది. మొత్తం 240 టీఎంసీలలో 169 టీఎంసీలు సాగునీటికి, 30 టీఎంసీలు హైదరాబాద్ నగర తాగునీటికి, 16 టీఎంసీలు పరిశ్రమలకు ,10టీఎంసీలు పరిసర గ్రామాల తాగునీటికి మిగిలిన నీరు ఆవిరి రూపంలో వెళుతుందని అంచనా వేశారు. పరిమాణం, సాంకేతికతలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో విశిష్టమైంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మహా అద్భుతం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజేంద్ర శ్రీవత్స కొండపల్లి రూపొందించిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ డిస్కవరీ చానెల్ అండ్ డిస్కవరీ హెచ్డిలో ఈ నెల 25వ తేదీన రాత్రి 8 గంటల నుంచి గంట సేపు ప్రసారం కానుంది. 6 భాషలలో దీనిని చూడవచ్చు. మళ్ళీ ఇదే చానెల్లో ఈ నెల 27న మధ్యాహ్నం 2.32 గంటలకు ప్రసారమవుతుంది. డిస్కవరీ సైన్స్లో ఈ నెల 28న రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మళ్ళీ ఇదే చానెల్లో ఈ నెల 29న సాయంత్రం 4.50కి చూడవచ్చు. డిస్కవరీ టర్బోలో ఈ నెల 29న రాత్రి 9.50 గంటలకు చూడవచ్చు. మళ్ళీ ఇదే చానెల్లో ఈ నెల 30న సాయంత్రం 4.50కి ప్రసారమవుతుంది. డిస్కవరీ ప్లస్లో ఓటీటీ స్ట్రీమింగ్ ఈ నెల 25న ప్రారంభమవుతుంది.
-జుర్రు నారాయణ యాదవ్