ప్రొఫెసర్ రామ్రెడ్డి చెప్పినట్టుగా, నేను ఇక్కడ ప్రసంగించడానికి నిలబడగానే నా మస్తిష్కంలో ఎన్నో పాత జ్ఞాపకాలు, ఎన్నెన్నో దృశ్యాలు కదలాడుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి విద్యార్థిగా నేను వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న రోజు ఇంకా గుర్తున్నది. వరంగల్లోని ప్రిన్సిపాల్ దగ్గరికి సెలవు తీసుకోవడానికి వెళ్లాను. నేను మంచి విద్యార్థిని కనుక నా పట్ల అభిమానంతో ఉండేవారు. నేను కళాశాలకు ఎంతో పేరు తెస్తానని భావించేవారు. పరీక్షలకు ముందు ఈ ఘటన (వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను బహిష్కరించడం) చోటుచేసుకున్నది. నేను ఎంతో ఉద్వేగంతో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. ‘నేను నిన్ను ఆపలేను. నీవు ఏ కారణం కోసం వెళ్ళవలసి వస్తున్నదో అది తప్పు అనలేను. ఇక్కడి నుంచి, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిన తర్వాత నీకేమవుతుందో నీకు తెలువదు, నాకూ తెలువదు. నీ భవిష్యత్తుకు వీలైనంత తక్కువ హాని జరగాలని కోరుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. ఏ వ్యక్తికైనా ఇటువంటి జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. అవి నేడు విశ్వవిద్యాలయానికి, మరే వ్యక్తికి సంబంధించినవి కాకపోవచ్చు. కానీ ఆ నాటి పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
ఉన్నత విద్యకోసమే కాకుండా, అంతకు మించిన విస్తృత ప్రయోజనాల కోసం కృషి చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు, విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయం 75 ఏండ్లు పూర్తిచేసుకున్నది. ఈ కాలంలో ఎంతోమంది విశిష్ట వ్యక్తులను దేశానికి అందించింది. నేను వివిధ పదవుల ద్వారా ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగి ఉన్నా. ఈ క్రమంలో ఎంతోమంది ప్రముఖ అధ్యాపకులు, విద్యార్థులతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ అనుబంధాన్ని ఎంతో ఆనందంగా, గర్వంగా జ్ఞాపకముంచుకుంటాను. దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి విశ్వవిదాలయం తనదైన రీతిలో సేవలు అందించింది. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో ప్రత్యేకమైనది. హైదరాబాద్ నగరం ఇస్లామిక్, హిందు, ఉత్తర దక్షిణ, తూర్పు పశ్చిమ సంస్కృతుల సంగమమిది. భిన్న భాషలు మాట్లాడేవారు ఇక్కడ శతాబ్దాలుగా, సంతోషంగా, ప్రశాంతంగా సహజీవనం చేస్తున్నారు. అటువంటి నగరంలో ఈ విశ్వవిద్యాలయం ఉన్నది. దేశంలో ఉర్దూను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టిన మొదటి విశ్వవిద్యాలయం ఇదే.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనువాద విభాగం ఉన్నది. కళలు, సాహిత్యం, వైద్యం వంటి భిన్నరంగాలలోని నిష్ణాతులు వివిధ భాషలలోని పుస్తకాలను ఉర్దూలోకి అనువదించేవారు. అంతటి కృషి ఈ కాలంలో ఇంకెక్కడా చూడం. ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నానని నేను గర్వంగా చెప్పుకొంటా. అలీగఢ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులకు ఈ విషయం చెప్పాను. ఈ విధంగా చెప్పుకొంటున్నప్పుడు నాకు ఇతరులకన్నా ఒక మిల్లిమీటరు ఎత్తుగా ఉన్నట్టనిపిస్తుంది. సహన సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు, నాకు గొప్ప కవి, గొప్ప దేశ భక్తుడు, గొప్ప మనిషి మఖ్దూం మోహియుద్దీన్ గుర్తుకువస్తాడు. ఆయన హోలీ బాగా ఆడేవారు. ఎమ్మెల్యే హాస్టల్కు కూడా వెళ్ళి హోలీ ఆడేవాడు. ఆ రంగు పదిహేను రోజుల వరకూ పోదు. రంగు చల్లి రేపు ఇనామ్ కోసం వస్తా అని సరదాగా అంటూ వెళ్ళిపోయేవాడు. అటువంటి సహనపూరిత వాతావరణంలో మేము పెరిగాం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వందేమాతర ఉద్యమం సాగించారు. మేం అందులో వినమ్రమైన కార్యకర్తలం. మా నాయకుడు అచ్యుత్రెడ్డి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. ఆ తర్వాత కాలంలో ఆయనను నా మంత్రివర్గంలోకి తీసుకున్నా. కానీ ప్రమాదం ఆయనను కబళించడం వల్ల కొద్దికాలమే మంత్రిగా ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా అచ్యుత్రెడ్డి అధికారులను ఎలా ఎదుర్కొనేవారో నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆయన విద్యార్థులకు ఎంతో ఓదార్పునిచ్చేవారు. విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగించడానికి నాగ్పూర్, జబల్పూర్ వెళ్ళినప్పుడు ఎంతో తోడ్పడేవారు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ను కూడా మరిచిపోలేను. ఆ రోజుల్లో ఆయన అంత సాహసం చూపి మ మ్ములను చేర్చుకోకపోతే, విద్యార్థుల చదువు కొనసాగకపోయేది. ఆయన చాలా అతి తేలికగా మమ్మల్ని చేర్చుకొని ఒక పరీక్ష పెట్టారు. దీంతో మేము గట్టెక్కాం.
ఆ రోజుల్లో విద్యార్థులం మా భవిష్యత్తు గురించి ఆలోచించకపోయేవారం. విస్తృతస్థాయిలో దేశంలో భాగంగా ఆలోచించేవారం. భారత స్వాతంత్య్రం కోసం పోరాటం సాగుతున్నది. అదే సమయంలో స్వతంత్ర హైదరాబాద్ రాజ్యం ఏర్పడే ప్రమాదాన్ని తప్పించాలని ఇక్కడి ప్రజలు భావించారు. రెండు స్వాతంత్య్రాల మధ్య ఘర్షణ. ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత భారతదేశ సమైక్యత సాధ్యమైంది. నిజంగా అవి చిరస్మరణీయమైన రోజులు. మనం స్వతంత్ర దేశాన్ని కోరుకున్నాం. కానీ బ్రిటిషర్లు 500 స్వతంత్ర దేశాలు ఉండాలని అనుకున్నారు. దేశ విభజన జరిగి ఉండవచ్చు, కానీ మన దేశం సమైక్యంగా ఉండిపోయింది. మనం ఇక ముందూ సమైక్యంగానే ఉంటాం. విభజన బీజాలు ఆ రోజుల్లో చల్లారు. హైదరాబాద్లో కనుక విభజన బీజం మొలకెత్తినట్టయితే, అది బద్ధలై దేశంలో ఐదు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడేవి. బ్రిటిష్ వారి నుంచి మచిలీపట్నం రేవు కొనుగోలు చేసి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యానికి సముద్ర మార్గం ఏర్పాటు చేసుకోవాలనే మాట కూడా ఆ రోజుల్లో వినిపించింది. ఇవి అందరికి తెలిసిన విషయాలే. కానీ ఆ తెలిసినవారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది.
ఉస్మానియా దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. 75 ఏండ్లుగా విద్యా, బోధనా మాధ్యమాలలో ఎంతో సేవ చేసింది. ఉస్మానియా క్యాంపస్ను వేలాది మంది లేదా లక్షలాది మంది కావచ్చు, ఇతర చోట్ల నుంచి వచ్చి సందర్శిస్తుంటారు. ఇతరదేశాల నుంచి క్యాంపస్ను చూడటానికే వస్తుంటారు. హెర్చర్ట్ మారిసన్ అని ఎంపీ అనుకుంటా, క్యాంపస్ చూడటానికి వచ్చాడు. దీనిని ఇంకా అలాగే నిర్వహిస్తున్నామా అనేది చెప్పలేను గానీ, దేశంలోనే విశిష్టమైన విశ్వవిద్యాలయ ప్రాంగణమిది.
నేను విద్యామంత్రిగా ఉన్నప్పుడు అనంతపూర్ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాను. ఈ భవన నిర్మాణం ఎందుకు ఆగిపోయిందని అడిగాను. ‘ఏమి చేయాలి సార్, ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉన్నాడే, ఈ బిల్డింగ్ అంతా చేసేవాడు. అతను ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. మా పనంతా ఎక్కడిదక్కడ ఆగిపోయింది’ అని ప్రిన్సిపాల్ అన్నాడు. మరి మీరు కూడా ఇంజినీర్లే. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ది చీఫ్ ఇంజినీరింగ్ ర్యాంక్. మరి మీరు సొంత భవనాన్ని ఎందుకు నిర్మించుకోరు? అన్నాను. అందువల్ల కళాశాలలు పరిశ్రమలతో అనుసంధానమై ఉండాలి.