కేంద్ర ప్రభుత్వానికి నిధుల వేటలో ‘పెట్టుబడుల ఉపసంహరణ’ బంగారు బాతువలె తయారైంది. ఏ ప్రభుత్వానికైనా నిధుల సమీకరణ తప్పనిసరి. కానీ ప్రభుత్వం తన ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఇలా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ పోతే భవిష్యత్లో కేంద్రానికి దారులు మూసుకుపోతాయి.
పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఈ రోజు మొదలైంది కాకపోయినా ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ప్రైవేటీకరణ అత్యంత వేగంగా జరుగుతున్నది. దీనికి 1999-2004 మధ్యకాలంలో జరిగిన పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం రూ.33655.63 కోట్లుగా ఉండటమే ఉదాహరణ. ఇప్పుడు అదే ధోరణి మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దేశ చరిత్రలో తొలిసారిగా మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటుచేసింది.
గత ఎన్డీయే ప్రభుత్వాలు ఫిస్కల్ పాలసీని మెరుగుపరుచుకోవడానికి పెట్టుబడుల ఉపసంహరణ మీదే ఆధారపడ్డాయనేది నిజం. ఈ విషయం 2019లో కాగ్ విడుదల చేసిన నివేదికలోనే స్పష్టమైంది. ప్రభుత్వ మూలధన రాబడుల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిధులదే సింహభాగమని కాగ్ తెలిపింది. మోదీ ప్రభుత్వ పనితీరుకు, ప్రైవేటీకరణలో వాళ్లకున్న మోజుకు ఇది నిదర్శనం. మోదీ హయాంలో 2017-19లో ప్రైవేటీకరణ శిఖరాగ్రానికి చేరుకున్నది. చెప్పాలంటే ఇప్పుడు మన దేశం ఆర్థిక సంక్షోభపు కోరల్లో చిక్కుకోవడానికి మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణం.
వాజపేయి, మన్మోహన్సింగ్ ప్రభుత్వాలు పది ప్రభుత్వ సంస్థలను మూసివేస్తే, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరేండ్ల కాలంలో ఏకంగా 23 ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించిది. 2014-15లో 21321.04 కోట్లు, 2015-16లో 24348.71 కోట్లు, 2016-17లో 46256.58 కోట్లు, 2017-18లో గరిష్టంగా 100,056.91 కోట్లు, 2018-19లో 85063.17 కోట్లు, 2019-20లో 50,298.64 కోట్లు సమకూర్చుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 18,223. 22 కోట్ల మేర పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. అంతేకాకుండా ఇంకా 2 లక్షల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ బాహాటంగా చెప్పడం చూస్తే వారి ప్రభుత్వ మూలధన రాబడికి పెట్టుబడుల ఉపసంహరణే మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటిదాకా జరిగిన ప్రైవేటీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ తతంగంలో బీజేపీ ప్రభుత్వమే 3 రెట్ల మేర ఎక్కువగా చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వాలు వ్యవస్థలపై తమ నియంత్రణను కోల్పోతా యి. అప్పుడు బడా కార్పొరేట్లు ఎలా చెప్తే అలా వినాల్సి వస్తుంది. ఇది దేశ ప్రయోజనాలకు భంగ కరం. ఇప్పటికే మన దేశ రాజకీయాలు ఓ మూడు నాలుగు కార్పొరేట్ల చేతుల్లో, వారి కనుసన్నల్లో నడుస్తున్నయనేది నగ్నసత్యం. అలాంటిది ఇప్పు డు మోదీ ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించడం కష్టం కాదు.
(వ్యాసకర్త:వై.సతీష్రెడ్డి , టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్)