ఓ యువకుడు ముంబైలో కరోనా బారినపడి చావు బతుకుల్లో ఉన్న తన తల్లిని రక్షించుకోవడానికి విధి లేని పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ దొంగిలించిన ఘటన చూస్తే ఓ విషయం గుర్తుకు వస్తున్నది. నలభై ఏండ్ల కిందట ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నేరం నాది కాదు ఆకలిది’ సినిమాలో ఓ మహిళ ఆకలికి తట్టుకోలేక రొట్టె ముక్కను దొంగిలిస్తే చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను దోషిని చేసి రాళ్లతో కొట్టడం అప్పటివాళ్లకు గుర్తుండే ఉంటుంది. దిక్కులేని పరిస్థితుల్లో తల్లిని బతికించు కోవడానికి ఆక్సిజన్ సిలిండర్ దొంగిలించిన యువకుడు నేరస్తుడా? కరోనా ఫస్ట్ వేవ్లో అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలన్నీ చేతులెత్తేస్తే, ధైర్యంగా నిలబడింది భారత్. అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలకు కూడా క్లోరోక్విన్ మాత్రలందించి సాయం చేసింది. కానీ ఏడాది తిరిగేసరికి సీన్ రివర్సయింది. కరోనా సెకండ్ వేవ్ భారత్ను బలంగా తాకింది. మిగతా దేశాలు భారత్పై సానుభూతి వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. పాక్, బంగ్లా లాంటి దేశాలు కూడా సాయం అందిస్తామంటూ ముందుకొస్తున్న స్థితి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
అసలేమైంది..? ఉన్నట్టుండి భారత్ ఎందుకు ఇంత బేలగా మారింది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎంతో మంది మేధావులు, ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రపంచాన్ని మెప్పించే పాలకులు ఉన్న భారతదేశం ఇంత దీనస్థితిలోకి జారిపోవడం ఊహించలేని పరిణామం. ఇది స్వయంకృతాపరాధం కాదా? దేశంలో అనేకచోట్ల, అందులోనూ ఉత్తరాదిలో బెడ్లు దొరకక దవాఖానల చుట్టూ తిరుగుతున్న పేషెంట్లు కొందరైతే, వారి బంధువులు, రెమ్డెసివిర్, తోసిలిజుమాబ్ ఇంజెక్షన్లు దొరకక ప్రాణ భయంతో ఎంత డబ్బైనా ఖర్చుచేసి కొంటామంటూ తెలిసినవాళ్ల ద్వారా వాకబు చేస్తున్నవారు మరికొందరు. ఢిల్లీ, ముంబై, యూపీల్లో తీవ్ర లక్షణాలతో ఉన్నవారు ఆక్సిజన్ దొరకక కండ్లముందే కాటికి ప్రయాణం కడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సిన హృదయవిదారకమైన పరిస్థితులు. దేశమంతా ఒక భయానకమైన వాతావరణం నెలకొని ఉన్నది.
ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో భీతిల్లుతున్న ప్రజలకు మనోధైర్యాన్ని నింపడంలో, తక్షణ అవసరాలకు వైద్య సహాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆశించిన స్థాయిలో లేదు. కరోనా మహమ్మారి దేశాన్ని కబలిస్తుంటే, రాష్ర్టాలు కూడా అన్ని పనులు పక్కనపెట్టి ఈ వైరస్ బారి నుంచి ప్రజలను ఎలా రక్షించుకోవాలో తెలియక అతలాకుతలమవుతున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కరోనా కట్టడికి ఇప్పటివరకు కేంద్రం ఒక సరైన జాతీయ విధానాన్ని రూపొందించలేకపోయింది. ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రజలు చనిపోతుంటే కూడా పట్టించుకోరా? అని మందలించింది. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం లాక్డౌన్లు ప్రకటించుకుంటుంటే ఇది కేవలం రాష్ర్టాలకు సంబంధించిన సమస్య మాత్రమేనా! కేంద్రానికి సంబంధం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. చప్పట్లు కొట్టడం, లైట్లు వెలిగించడం తర్వాత కరోనాపై పోరాటంలో దేశాన్ని ఉద్యుక్తపరిచే చర్యలు మళ్లీ కేంద్రం ఇంతవరకు చేపట్టలేదు.
రాష్ర్టాలకు వైద్య సహాయం అందించడంలో కూడా కేంద్రం వివక్ష చూపుతున్నది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రాష్ర్టాలకు పంపిణీ చేసిన విధానం కూడా సరిగా లేదు. జనాభా ప్రాతిపదికన పంపాల్సిన మందులు గుజరాత్కు ఎక్కువగా తెలంగాణకు తక్కువగా పంపడం చూస్తే తెలంగాణ ప్రజలు భారతదేశ పౌరులు కాదా?, వారి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అనే ప్రశ్న ఉద్భవిస్తున్నది. వ్యాక్సిన్తో పాటు, మందులన్నీ కూడా తన గుప్పిట్లోనే పెట్టుకున్న కేంద్రం ప్రజలు ఆక్సిజన్ అందక చనిపోతుంటే, ఆ వైఫల్యాన్ని రాష్ర్టాల మీద రుద్దాలని చూస్తున్నది.
కేంద్రానికి ముందుచూపు లేని కారణంగా ఈ రోజు మూడు వేల రూపాయల ఖరీదు చేసే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్లో రూ.30 వేలు పెట్టి కొనాల్సి వస్తున్నది. 45 ఏండ్లకు పైబడిన వారికి ఇప్పటికే వాక్సిన్ సరిగా అందడం లేదు. మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎలా ఏర్పాట్లు చేయగలుగుతుంది!
రాష్ట్ర జనాభా ఎన్నో రెట్లు పెరిగినప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం ఆ నిష్పత్తిలో పెరగకపోవడంతో దశాబ్దాలుగా వైద్యుల మీద, సిబ్బంది మీద పని ఒత్తిడి విపరీతంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయడంతోపాటు భోధనాస్పత్రుల్లో ఏకబిగిన 109 యూనిట్లను కొత్తగా ఏర్పరిచారు. ఒక్కొక్క యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. తగిన సిబ్బంది ఉంటారు. అదేవిధంగా వైద్య విధాన పరిషత్లో దాదాపు 4500 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని కొత్తగా ఏర్పాటుచేశారు. మాతా శిశు సంరక్షణ కోసం ఏర్పాటుచేసిన కేసీఆర్ కిట్ పథకం ఎంతగా ప్రభావం చూపెడుతున్నదో, ఏ రకంగా పేద ప్రజల జీవితాలతో పెనవేసుకపోయిందో వేరే చెప్పనవసరమే లేదు. రాష్ట్రంలో పలుచోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేసి నెలకు రూ. 25 వేలు ఖర్చుచేసి వైద్యం చేయుంచుకునే స్తోమత లేక ప్రాణాలు కోల్పోతున్న పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రజలకెంతో ఉపయోగకరంగా మారింది. ఇవన్నీ కండ్ల ముందు కనబడుతున్న వాస్తవాలు. వేర్వేరు అవసరాల కోసం చేసుకున్న ఏర్పాట్లన్నీ ఇప్పుడు కొవిడ్ సంక్షోభంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి.
రాష్ట్రం చేతిలో లేని కొన్ని అంశాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. తోసిలిజుమాల్, రెమ్డెసివిర్, టీకాలు ఇవన్నీ కేంద్రం నియంత్రణలో ఉండిపోయాయి. వాటి ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్ని సరిగా నిర్వహించడంలో కేంద్రం విఫలమవుతున్నది. విచిత్రమైన పరిస్థితి ఏమంటే.. రాష్ట్రంలో తయారవు తున్న కొవాక్సిన్ మనకే సరిగా అందటం లేదు. ఇక ఇప్పుడు అనుమతి పొందిన రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ రాష్ర్టాలకు విడుదల చేయబోతున్నది కేంద్రం. అయితే దీంట్లో జలుబును కలిగించే వైరస్ ఉందని బ్రెజిల్ ఆ వాక్సిన్ను తమ దేశంలో నిషేధించినట్టుగా వార్తలొచ్చాయి. మరి ఆ విషయం తెలిసిన తర్వాత కూడా మనదేశంలో ఎంతమంది ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముం దుకొస్తారో తెలియదు. ఇప్పటికే కొవిడ్ వల్ల, తదనంతర లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో దేశం ఎంతో నష్టపోయింది. మళ్లీ ఒకసారి దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లాల్సిన పరిస్థితులే కనుక ఉత్పన్నమైతే దేశాభివృద్ధి ఎన్నేం డ్లు వెనక్కి వెళ్తుందో చెప్పడం కష్టం. కరోనా పరిస్థితి తీవ్రతకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం గా కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ అందరికీ ఉచితంగా, పల్స్పోలి యో తరహాలో వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నద్ధమవుతుండ టం హర్షనీయం. ఆక్సిజన్, రెమ్డెసివిర్ కొరతను అధిగమించడానికి జనాభా ప్రాతిపదికన గానీ, కరోనా రోగు ల సంఖ్య తీవ్రత ఆధారంగా గాని రాష్ర్టాలకు పంపిణీ చేసే విధానం అనుసరించాలి. వివిధ రాష్ర్టాల నుంచి నిపుణలను కమిటీగా ఏర్పరిచి ఈ మహమ్మారిని అధిగమించడానికి జాతీయ విధానం తీసుకరావాలి.
ఇవీ కూడా చదవండీ…
బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు