పోటీ ప్రపంచంలో ఎవరికైనా నైపుణ్యమే అతిపెద్ద బలం. కరోనా నేపథ్యంలో ఉపాధి రంగంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఈ తరుణంలో యువత నైరాశ్యంలో కూరుకొనిపోకుండా నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు, చొరవ మూలంగా దేశంలోనే హైదరాబాద్ నగరం నైపుణ్యాల రాజధానిగా వెలుగొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేండ్లకోసారి ఐటీ పాలసీని తీసుకురావటం ముదావహం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలకు మన హైదరాబాద్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతున్నది. మన నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా ఆసియా ఖండంలోనే ప్రధాన పాత్ర పోషిస్తున్నది. భౌగోళిక స్థితి, వాతావరణం, మానవ వనరులు, సుస్థిరమైన పాలన, మెరుగైన వసతులు మొదలైనవన్నీ మన హైదరాబాద్ నగరానికి అనుకూలాంశాలు. అందుకే ప్రపంచంలోని అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రెండో ఐటీ పాలసీతో హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్గా మారుతుంది.
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య సుమారు 6 లక్షలు. ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచడంతో పాటు ఐటీ ఎగుమతులను 3 లక్షల కోట్లకు పెంచడమే రెండో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2021-26 (ఐసీటీ) పాలసీ లక్ష్యం. వచ్చే ఐదేండ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత ఎలక్ట్రానిక్ రంగాల్లో భారీగా ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం రెండవ ఐసీటీ పాలసీని తీసుకువచ్చింది. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో ఐటీ హబ్ను ఏర్పాటుచేయడంతో పాటు, 2026 నాటికి టీ-ఫైబర్ పనులను 100 శాతం పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను విస్తరించి, ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరిలోనైనా డిజిటల్ లిటరసీ తీసుకురావాలనే యోచనలో ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైసెస్ ఆటోమొబైల్ రంగాల్లో 75 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టడం ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్తగా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ‘ఇన్నోవేషన్ ఎకో సిస్టం’ను వృద్ధి చేసేందుకు టీ-హబ్, టీఎస్ఐసీ, వీ-హబ్, రిచ్, టాస్క్ టీ-వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ లను ఏర్పాటుచేసింది.
గడిచిన ఐదేండ్లలో పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా దేశంలోనే అత్యధిక ప్లేస్మెంట్ రేట్ ఉన్న సెంటర్గా టాస్క్ నిలిచింది. ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్తో ఓపెన్ డాటా, బ్లాక్చైన్, డాటా అనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అడాప్షన్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో సెక్టోరల్ పాలసీలు ప్రారంభించింది. డబ్ల్యూ ఈఎఫ్, యూఎన్డీపీ, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ ఎంతో ముందంజలో ఉన్నది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు ఉండగా, 2020-21 నాటికి లక్షా 45 వేల కోట్లకు పెరిగాయి. తద్వారా దేశానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచే కీలక రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020-21’ తెలిపింది.
ప్రజల జీవనానికి హైదరాబాద్ ఉత్తమమైనదని ‘మెర్సర్’, డైనమిక్ సిటీ అని ‘జేఎల్ఎల్’ సర్వేలు పేర్కొన్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల డాటా సెంటర్లకు హైదరాబాద్ కేరాఫ్గా నిలుస్తున్నది. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారీ డాటా సెంటర్లను ఏర్పాటుచేశాయి. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మరిన్ని కంపెనీలు డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకువస్తున్నాయి. రెండో ఐటీ పాలసీలో క్లౌడ్ కంప్యూటింగ్ పాలసీ తీసుకురావడంతో రాబోయే రోజుల్లో క్లౌడ్ ప్రొవైడర్స్కు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా హైదరాబాద్ మారుతుంది. ఐటీ రంగంలో నూతన సాంకేతిక విప్లవం క్లౌడ్ కంప్యూటింగ్ను పాలనా సేవల్లో వినియోగించుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శమవుతుంది. సాఫ్ట్వేర్, అప్లికేషన్లు, ఫైళ్లను ఇంటర్నెట్లో నిల్వచేసే స్థలంగా క్లౌడ్ కంప్యూటింగ్ గుర్తింపు పొందింది. తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచడం, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్, సర్వర్లు అవసరం లేకుండా వినియోగించడం దీని ప్రత్యేకత. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచై నా డిజిటల్ వనరులను పంచుకోవడం నిర్వహించుకోవ డం సులభంగా ఉంటుంది. పాలనా వ్యవహారాలను గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర సచివాలయం స్థాయి వరకు ఇంటర్నెట్ ద్వారా అత్యంతవేగంగా, సురక్షితంగా అందించేందుకు ఈ సాంకేతికత తోడ్పడుతుంది. ఐటీ రంగంలో ప్రభుత్వ పురోగామి విధానాలు సరికొత్త ఆలోచన ద్వారా హైదరాబాద్ మహానగరం ఇప్పటివరకు సిలికాన్వ్యాలీగా ఉన్న బెంగళూరుకు గట్టి పోటీనిస్తూ చెరగని ముద్ర వేసుకున్నది. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని, ‘ఇంటెలిజెంట్ టెక్నాలజీ’ అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ మాటలు అక్షర సత్యం.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్)
గుర్రం రజితాదేవి