రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉంటాయో, ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అర్థం అవుతున్నది. కళ్ళముందర కనిపిస్తున్న అభివృద్ధికి ప్రజలు జేజేలు పలుకుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం విమర్శించడానికి సరియైన హేతువు లేక, సాధికారికంగా ఏ ఆరోపణను నిరూపించే సత్తా లేక వ్యక్తిగత దూషణకు దిగుతున్నాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతినిధి ముఖ్యమంత్రి అన్న ప్రాథమిక విషయాన్ని మరచిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి.
విమర్శ రెండు విధాలు. సహేతుక విమర్శ, కువిమర్శ. విమర్శించాలంటే ఆయా అంశాలవారీగా ఉన్న గణాంకాల ఆధారంగా విమర్శించాలి. పాలన అంటే అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు, సుస్థిరపాలన, సాంస్కృతిక వికాసం, ఆత్మగౌరవ జయకేతనం! గత వర్తమానాలను బేరీజు వేస్తే వీటి స్థాయి ఎక్కడ ఉందో చెప్పేదే సమర్థపాలనకు గీటురాయి. ఈ ప్రాతిపదికన టీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి గతంతో పోల్చినపుడు ఎన్ని రెట్లు మెరుగైన స్థితిలో ఉన్నదో గణాంకాలతో నిరూపించవచ్చు. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే వ్యక్తిగత విమర్శలు ఆయా పార్టీల నాయకుల స్థాయిని దిగజార్చక మానవు.
పాలకుడికి ప్రాధాన్యతా రంగాల పట్ల సరియైన అవగాహన ఉన్నపుడే సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలతో పాటు, సాంస్కృతిక విలువల పట్ల పూర్తి అవగాహన ఉన్నవారు కాబట్టే, తెలంగాణ సమాజ ఆత్మను పట్టుకొని అభివృద్ధిని పునర్లిఖిస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే ప్రతిపక్షాలు భావోద్వేగాలు రెచ్చగొట్టే చవకబారు విమర్శలు చేస్తున్నాయి.
కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన అనేక అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరుచేయకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, ఐఐటి, ఐఐఎవ్ు, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటి, ఎన్ఐడి, మెడికల్ కళాశాలలు, నవోదయ కళాశాలలు మొదలైనవెన్నో రాష్ర్టానికి ఒక్కటి కూడా మంజూరుచేయకున్నా, రాష్ట్ర బాధ్యులుగా ఉన్న బీజేపీ నాయకులు ఒక్కరూ నోరు మెదపరు! ఇస్తామని ప్రకటించి రద్దు చేసిన ఐటిఐఆర్ గురించి పల్లెత్తు మాట పలకరు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెనుకకు తీసుకున్నా, విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయకున్నా మాట్లాడేందుకు సాహసించని వాళ్ళు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు.కేసీఆర్కు రాజకీయాలంటే అధికారం ఒక్కటే కాదు. ఆ అధికారం ఆధారంగా నిరంతరం నిలబెట్టుకొనే తెలంగాణ ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవ తండ్లాట ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. కువిమర్శలు, శాపనార్థాలు పెట్టిన వారి ఆటలు సాగవని ఎప్పటికప్పుడు కాలం నిరూపిస్తూనే ఉన్నది.
ఇక ఇప్పటి ఎన్నికల విషయానికొస్తే.. ప్రతి ఎన్నిక ప్రజాజీవితాల్ని ప్రభావితం చేసే అనేక అంశాల కలయిక. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమంటే కేవలం ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్కు మద్దతు తెలిపినట్లు మాత్రమే కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్లు. తెలంగాణ భద్రతకు బాటలు వేసినట్లు. అభివృద్ధి దిశలో తెలంగాణను మరింత బలోపేతమవ్వడానికి ఊతమిచ్చినట్లు. తెలంగాణ స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడానికి తోడ్పాటునందించినట్లు. అలా కాని పక్షంలో జరగబోయే విపరిణామాలు ఏమిటో తెలంగాణ బుద్ధిజీవులు ఆలోచించాలి. తాత్కాలిక ఉద్వేగాలకు లోనైతే ఏం జరుగుతుందో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ద్వారా మనం ఊహించవచ్చు.
ప్రతి ఎన్నికలో ఎవరిని, ఎందుకు గెలిపించుకోవాలో తెలిసినప్పుడే మెరుగైన ప్రజాస్వామ్య ఫలాలను పొందగలుగుతాం. ఇప్పుడు జరుగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దానిలో భాగమే. సురభి వాణీదేవిని అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఇతర ఏ పార్టీ ఇవ్వనంత గౌరవాన్ని ఇచ్చినట్లయ్యింది. పీవీ ఏ పార్టీకి చెందినవారు అనే దానికంటే, ఏ మట్టి బిడ్డ అన్న అంశానికే ప్రాధాన్యమిచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని లోకానికి చాటారు. అందుకే సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు మనందరి గెలుపు కావాలి.రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, పరిగణనలోకి తీసుకుంటూ, అవసరమైన పథకాలను రూపకల్పన చేస్తూ కేసీఆర్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ముందుకు పోతున్నారు. ఆయన అడుగులో అడుగేయాల్సిన అవసరం, అతని విజన్కు చేయూతనివ్వాల్సిన బాధ్యత బంగారు తెలంగాణ కోరుకునే ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అభివృద్ధి ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ తెలంగాణకు రక్ష.
(వ్యాసకర్త:నారదాసు లక్ష్మణ్రావు, శాసనమండలి సభ్యులు)