‘గంతులేసిన ఇసుకతీరం-
గరుకునేలై పోయినాది
దునికి ఈదిన కయ్యలల్ల-
కంపసెట్లే మొలిసినాయి
గాలికూగే రెల్లు పొదల-
జీవులెండి పోయినాయి
ఆరుగాలం పారె ఏరుల-
నీటి సుక్క లేకపాయె
వాగు ఎండిపోయెరో..
పెదవాగు తడిపేగు ఎండిపాయెరా..’
ఎండిన తెలంగాణ వాగుల దుస్థితిపై ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన పాడిన ఈ పాట ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది.
అందివచ్చిన టెక్నాలజీతో నైపుణ్యాన్ని సంపాదించి తెలంగాణ నేలనంతా ఎదురుగా వున్న గూగుల్ తెరపై నిద్రలేని ఎన్నో రాత్రులు శోధించిన కేసీఆర్ గోదారిని ఎదురెక్కించి కరువు నేలకు జలాభిషేకం చేశారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ హల్దీవాగుపై ఉన్న చెక్డ్యాంలను, చెరువులను నింపి ప్రాణహిత నీళ్ళను మంజీరాలో పారించి నీటి జాడలేని నిజాంసాగర్ను నింపుతున్నారు.
ఇప్పుడు కూడెల్లి, హల్దీవాగుల్లో గోదారి నీరు పొంగి పొర్లుతుంటే ఆ దృశ్యం చూసేవారి కళ్ళల్లో ఆనందబాష్పాలు సంతోషంతో అలుగు దుముకుతున్నాయి. మెతుకుసీమ మెదక్జిల్లా వాగుల్లో నీటి జాడ కరువై దశాబ్దాలు గోసపడ్డ జనానికి కొండ పోచమ్మసాగర్ నుంచి తరలివస్తున్న ప్రాణహిత జలాలు బతుకులపై భరోసా ఇస్తున్నవి. ‘తెలంగాణ వస్తె ఏమొస్తదని’ ప్రశ్నించినవారికి మత్తడి దుంకుతున్న జల ప్రవాహాలతో జవాబిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
అందివచ్చిన టెక్నాలతో నైపుణ్యాన్ని సంపాదించి తెలంగాణ నేలనంతా ఎదురుగా ఉన్న గూగుల్ తెరపై నిద్రలేని ఎన్నో రాత్రులు శోధించిన కేసీఆర్ గోదారిని ఎదురెక్కించి కరువు నేలకు జలాభిషేకం చేశారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ హల్దీవాగుపై ఉన్న చెక్డ్యాంలను, చెరువులను నింపి ప్రాణహిత నీళ్ళను మంజీరాలో పారించి నీటి జాడలేని నిజాంసాగర్ను నింపుతున్నారు.
హల్దీవాగు ప్రవాహాలు కచ్చితంగా కేసీఆర్ కళ్ళల్లో జలధారలై ప్రతిఫలించే వుంటాయి. చిరకాలపు ఆయన కలలు, ప్రజల ఆశలు ఫలిస్తున్న శుభసందర్భమిది. జల దేవత కనికరించి కరువు నేలపై కురిపించిన వర్షపు జల్లుల ప్రవాహాలు కావివి. ఆరేండ్ల కేసీఆర్ సారథ్యంలో ఇ.ఎన్.సి లు హరిరాం, వెంకటేశ్వర్లు, వందలాది ఇంజినీర్లు, వేలాది కూలీలు, కాంట్రాక్టర్లు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు అహర్నిశలు చేసిన కష్టానికి నిర్వాసితుల త్యాగనిరతికి లభించిన ఫలితమిది. పనులు సత్వరమే కావాలనే లక్ష్యంతో అప్పటి నీటి వనరుల శాఖామంత్రి హరీశ్రావు ప్రాజెక్టు స్థలాల్లోనే ఎన్నో రాత్రులు గడిపారు.
ఎక్కడి ప్రాణహిత? ఎక్కడి నిజాంసాగర్? మేడిగడ్డ వద్ద నిర్మించిన అత్యంత పొడవైన లక్ష్మీబ్యారేజీ నిలిపిన ప్రాణహిత జలాలను కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి సరస్వతి బ్యారేజీ నింపారు. అక్కడి నుంచి సుందిళ్ళ దగ్గరి పార్వతి బ్యారేజీకి పంప్ చేశారు. సుందిళ్ళ పంప్హౌజ్ ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్, సొరంగమార్గం గుండా ఈ నీరు నంది మేడారం పంప్హౌజ్కు చేరింది. అక్కడినుంచి గాయత్రి పంప్హౌజ్ సర్జ్పూల్కు, అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాల్వలోకి మళ్లించి మిడ్మానేర్ రిజర్వాయర్ నింపి అన్నపూర్ణ రిజర్వాయర్కు, రంగనాయకసాగర్కు చేర్చారు. ఇన్ని దశలు లిఫ్ట్లు, సొరంగాలు, గ్రావిటీ కాల్వల ద్వారా సుమారు 618 మీటర్ల ఎత్తులో వున్న కొండపోచమ్మ రిజర్వాయర్కు చేరిన గోదావరి జలాలు గ్రావిటీకాల్వ సొరం గం ద్వారా ప్రవహించి మందం చెరువు, పెద్ద చెర్వు, ధర్మారావుపేట చెర్వు, ఖాన్ చెర్వులు నింపుతూ హల్దీవాగుపై ఉన్న 30 చెక్డ్యాంలు నిండి తర్వాత మంజీరా నదికి చేరుకుంది. మంజీరాపై వున్న మరో రెండు చెక్డ్యాంలు నిండిన తర్వాత నిజాంసాగర్కు ప్రవహిస్తుంది.
కొండపోచమ్మ, నిజాంసాగర్ మధ్య దూరం సుమారు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఏప్రిల్ 6న కేసీఆర్ నీటిని విడుదల చేస్తే.., 15 రోజుల తర్వాత ఆ జలాలు నిజాంసాగర్కు చేరాయి. 1.2 టీఎంసీల నీరు హల్దీవాగులోకి ఇప్పటిదాకా విడుదల చేశారు. మరో 4 టీఎంసీలు నిజాంసాగర్కు విడుదల చేస్తారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద సంగారెడ్డి కాల్వ ద్వారా ఆర్థికమంత్రి హరీశ్రావు మార్చి 23న కూడెల్లి వాగులోకి విడుదల చేసిన నీరు 28 రోజులకు వాగుపై నిర్మించిన 30 చెక్డ్యాంలు నిండిన తర్వాత ఎగువ మానేరుకు చేరింది. సమయానికి నీరందడంతో అప్పర్ మానేర్ ప్రాజెక్టు కాల్వ కింది రైతులు 12 వేల ఎకరాల్లో తమ యాసంగి పంటలను కాపాడుకున్నారు. రెండు టీఎంసీల నీరు అప్పర్మానేరుకు విడుదల చేశారు. వేసవికాలంలో రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, చెక్డ్యాంలన్నీ నీటితో నిండి ఉంటాయని ఎవ్వరికీ ఊహకందనిది. అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకొని పట్టుదలతో వాటిని అమలుచేయడం, గమ్యాన్ని చేరేదాంక విశ్రమించకపోవడమే కేసీఆర్ ప్రత్యేకత.
నిజాంసాగర్, అప్పర్ మానేరు రైతులు వానాకాలం పనులు మే నెలలోనే ప్రారంభించాలని, పంటకాలం ముందుకు జరగడంతో మార్చి చివరినాటికే రబీ పంటలు చేతికందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఏప్రిల్లో ఎండల తీవ్రత పెరగడం వల్ల నీరు ఎక్కువ మొత్తంలో ఆవిరవ్వడమే కాకుండా పంట దిగుబడి కూడా తగ్గే ప్రమాదం ఉన్నది.
హల్దీ, కూడెల్లి వాగుల్లో ఆవిష్కృతమైన ఈ జల దృశ్యమే రేపు తెలంగాణ అంతటా మనం చూడబోతున్నాం. పంట భూమి మొత్తాన్ని రెండు పంటల సాగుభూమిగా నిలిపి ప్రపంచ చరిత్రలోనే అరుదైన అధ్యయాన్ని కేసీఆర్ రచిస్తున్నారు.
(వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్)
వి.ప్రకాశ్