భారతదేశ జాతీయోద్యమంలో మూడు విధాలైన పోరాట మార్గాలు కనిపిస్తాయి. మొదటిది అహింసా సత్యగ్రహాలు ఆయుధాలుగా చేసుకొని మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగింది. తనతోటి యువకులతో కలిసి మార్క్సిజం ఆలోచనా ధోరణులతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపే ప్రయత్నం చేశారు. ఇక మూడో మార్గం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేపట్టిన స్వాతంత్య్ర పోరాటం. దేశంలోనే ఉంటూ అహింసా సత్యాగ్రహంతో పాటు విప్లవోద్యమంతో స్వాతంత్య్రం సాధించలేమనీ, విదేశీ శక్తుల సహకారంతో విదేశీ ప్రభుత్వాల, సైన్యం మద్దతు మన దేశంలోనే ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి బయటినుంచి తిరుగుబాటు చేయాలని సుభాష్ చంద్రబోస్ భావించారు. స్వాతంత్య్రం సిద్ధించడానికి ఇలాంటి అన్ని ప్రయత్నాలు తోడ్పడ్డాయి. అందుకే మన స్వాతంత్య్ర పోరాటం ఒక విశిష్టతను సంతరించుకున్నది.
‘జీవిత లక్ష్యం అంటే మనస్సును నియంత్రించడం మాత్రమే ఎంతమాత్రం కాదు. దాన్ని సామరస్యంగా అభివృద్ధి చేయాలి. జీవిత పరమార్థం భవిష్యత్తులో జీవిత చరమాంకంలో మోక్షం పొందడం కాదు. దాన్ని ఇప్పుడే పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. వాస్తవాన్ని గ్రహించడమేకాదు దాన్ని ఎదుర్కోవాలి. సౌందర్యం, మంచితనం అనేవి ఆలోచనలలో మాత్రమేకాక దైనందిన వాస్తవ జీవిత అనుభవంలోనే ఉంటాయని మనం తెలుసుకోవాలి. సామాజిక పురోగతి ఏ కొందరి వ్యక్తిగత ప్రతిష్ఠలపై మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, రాజకీయ, వ్యక్తిగత జీవితంలో మనుషులకు మానవత్వానికి ప్రాధాన్యం కల్పించడం ద్వారా విశ్వజనీన సహోదరత్వం సాధ్యమవుతుంది’.. ఈ మాటలు రాసింది ఏ మత ప్రబోధకుడో లేక తత్వవేత్తనో కాదు చిన్న వయసులోనే తత్త్వవేత్తల కంటే ఎక్కువగా తన మనోభావాలను అక్షరీకరించిన నవ యువకుడు భగత్సింగ్. తన జైలు డైరీలో రాసుకున్న ఆ మాటలు నేటికీ ఆచరించదగ్గ అక్షర సత్యాలు.
వ్యక్తిపూజతో పాటు మతాల పేరుమీద మనుషులను విభజిస్తున్న నేటి కాలంలో- మానవ సమాజానికి భగత్సింగ్ స్ఫూర్తి అత్యావశ్యకం. బ్రిటిష్వారిని పారదోలేందుకు తీవ్ర ప్రతిఘటనే అనుసరణీయమని భావించారు.
భగత్సింగ్ 1928 మే- సెప్టెంబర్ మధ్యకాలంలో పంజాబీ వార్తాపత్రిక కీర్తిలో అరాచకత్వంపై అనేక కథనాలను ప్రచురించారు. నిజమైన అరాచకత్వం అంటే భారతదేశంలో ఆచరించే వసుధైక కుటుంబ భావనేనని భగత్సింగ్ విశ్వసించారు. విశ్వజనీన సహోదరత్వం అనే మాట- సంస్కృతంలో చెప్పినట్లుగా వసుధైక కుటుంబకం అనే భారతీయ తత్వశాస్త్ర భావనకు దగ్గరగా ఉందని ఆయన తన రచనలలో వివరించారు.
భగత్సింగ్ మార్క్సిజానికి కూడా ప్రభావితుడయ్యారు. అందుకే భారతదేశంలోనే ప్రథమ మార్క్సిస్టులలో భగత్సింగ్ ఒకరని ప్రఖ్యాత భారతీయ చరిత్రకారుడు కేఎన్ ఫణిక్కర్ అభివర్ణించారు. 1926 మొదలుకొని భారతదేశంతోపాటు విదేశాల్లోని విప్లవోద్యమ చరిత్రలను భగత్సింగ్ చదివారు. సమసమాజ స్థాపన ఆశయంగా చిన్న వయసులోనే తన బలిదానం ద్వారా భారత స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చారు.
బండారు రామ్మోహనరావు