‘మీరు టీకా తీసుకున్నారా? తీసుకున్న తర్వాత ఎలా ఉంది? ఏమైనా దుష్పరిణామాలు సంభవించాయా? కోవిషీల్దా, కోవాక్సినా? తీసుకోకుంటే ఏమవుతుంది? టీకా తీసుకున్నా వైరస్ సోకుతుందట కదా? కొత్త వైరస్ చాలా ప్రమాదకరం అంటున్నారు నిజమేనా?’ .
ఇవన్నీ నేడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు, కలుగుతున్న భయాందోళనలు. మొన్నటిదాకా టీకా వస్తే చాలు కరోనా మహమ్మారి పీడ విరగడవుతుందని భావించిన ప్రజలు టీకా వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీకా తీసుకోవడానికి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంత మంది భయపడుతున్నారు.
ట్యాబ్లెట్, ఇంజక్షన్, వాక్సిన్ వీటిలో ఏది తీసుకున్నా కొంతమందిలో రియాక్షన్లు కలగడం సహ జం. అవన్నీ వాటిపై ముద్రించి ఉంటాయి. కలగబోయే రియాక్షన్ల గురించి ముందే తెలిసి ఉంటే రియాక్షన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా వైద్య సేవలు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలు భయపడకుండా ఉండాలని. అంతేకానీ ఇలా జరగొచ్చని చెప్పి ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి కాదు. అంతేకాకుండా ఏ డ్రగ్స్ అయినా, వాక్సిన్లు అయినా ఏ రకమైన ప్రాణాపాయం కాని, ప్రమాదకరమైన రియాక్షన్లు కాని జరగవని ధృవపరుచుకున్నాకే మార్కెట్లోకి విడుదల చేస్తారు.
ప్రచార సాధనాలు అంతగా వాడుకలో లేని సమయంలో బీసీజీ, డీపీటీ, మీజిల్స్ లాంటి వాక్సిన్లు వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి అనుమానాలు, భయం లేకుండా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా విస్తరించి ఉంది కాబట్టి, చీమ చిటుక్కుమన్నా క్షణంలో ప్రపంచమంతా తెలిసిపోతున్నది. వాక్సిన్ తీసుకుంటే కలిగే చిన్న చిన్న దుష్పరిణామాలను కూడా మీడియా ఎక్కువగా చూపిస్తుండటం, ప్రజలను కొంతవరకు జాగ్రత్త పరుస్తున్నప్పటికీ మరికొంత భయాన్ని కలిగిస్తున్నది కూడా.
వాక్సినేషన్ నడుస్తుండగానే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. అదే కరోనా సెకండ్ వేవ్. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ర్టాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి వైరస్ స్ట్రెయిన్లు అన్నీ కూడా సింగల్ మ్యూటం ట్ (ఉత్పరివర్తనాలు) వైరస్లు కాగా సెకండ్ వేవ్లో కనపడుతున్న కరోనా వైరస్ను డబుల్ మ్యూటంట్ వైరస్గా పరిగణిస్తున్నారు. ఇలాంటి డబుల్ మ్యూటంట్ వైరస్కు మనుషుల్లో దుష్పరిణామాలు కలిగించే ప్రభావం ఎక్కువగా ఉం టుంది. ఈ సెకండ్ వేవ్తో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇన్నిరోజులు అపోహలతో వాక్సిన్ తీసుకోవడానికి విముఖత ప్రదర్శించినవారు సైతం వాక్సిన్ తీసుకుంటుండటం గమనార్హం.
ఇలా ఒకవైపు టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో వైరస్ను ఎదుర్కొనే ఇమ్మ్యూనిటీ తయారవుతుండగా, మరోవైపు వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా ఇమ్మ్యూనిటీ పెరుగుతున్నది. తేడా ఏమంటే టీకా వల్ల ప్రాణాపాయం లేకపోగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రభుత్వ సూచనలను పాటించాలి. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. తెలంగాణలో స్కూళ్లు, కళాశాలలు మళ్లీ మూసివేసిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో లాక్డౌన్ మాత్రం ఉండబోదని ప్రకటించింది. కాబట్టి బాధ్యతగా వ్యవహరిద్దాం. భయపడకుండా టీకా వేసుకుందాం.
డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి
(వ్యాసకర్త: ఈఎన్టీ స్పెషలిస్ట్, ప్రభుత్వ చెవి, ముక్కు,
గొంతు వైద్యశాల, కోఠి, హైదరాబాద్)
ఇవీ కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో మూడు రోజుల్లో 66 మందికి పాజిటివ్
హోలీ వద్దన్న వృద్ధురాలిని కొట్టి చంపారు