మనిషికి శ్వాస ఎంత ప్రాణాధారమో, దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్ఠికి విద్యుత్తు అంతటి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. భారీ వర్షాలను కారణంగా చూపి, తప్పంతా ప్రకృతిపై నెట్టి వేసి, తన బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి ఆర్థికరంగం పుంజుకోవటంతో కరెంటు వినియోగం పెరిగింది. దేశంలో 69 శాతం అవసరాలను తీర్చే థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గుకొరత ఏర్పడింది. దీంతో కొన్ని సగానికి మించి ఉత్పత్తి చేయలేకపోతుంటే, మరికొన్ని మూతపడే స్థితికి చేరుకున్నాయి. కేంద్రం ముందుచూపులేకుండా వ్యవహరించడమే దీనికంతటికీ కారణం. రానున్నది వానకాలమని తెలిసి కూడా బొగ్గు ఉత్పత్తి, సరఫరాలను తగురీతిలో నిర్వహించలేకపోవటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే.
సాధారణంగా థర్మల్ కేంద్రాల్లో కనీసం 20 నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉండాలి. దేశవ్యాప్తంగా 136 థర్మల్ పవర్ స్టేషన్లుంటే, అందులో 70 కేంద్రాలలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే పంజాబ్లో మూడు, కేరళలో నాలుగు, మహారాష్ట్రలో 13 కేంద్రాలు మూతపడ్డాయి. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నుంచి రోజూవారీగా అందాల్సిన బొగ్గులో సగం కూడా అందటం లేదని రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశీయ అవసరాల కోసం 600 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన సీఐఎల్ కొన్నేండ్లుగా లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.
ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ దాకా రాష్ర్టాలన్నీ కరెంటు కొరతతో హాహాకారాలు చేస్తున్నాయి. రాజస్థాన్ ఇప్పటికే రోజుకు రెండు గంటలు కోత విధిస్తున్నది. పంజాబ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఇదే బాటన నడుస్తున్నాయి. ఢిల్లీకి చీకట్లో మగ్గే దుస్థితి రాబోతున్నదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా విద్యుత్ కోతలు తప్పవనే హెచ్చరికలు జారీ అయ్యాయి. స్వదేశీ బొగ్గుపైనే ఆధారపడి స్వావలంబన దిశగా నడువాలని 2016లో కేంద్రం చెప్పుకొచ్చింది. మరో వైపు బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పగించి, ఉత్పత్తి- సరఫరాల సమతుల్యతను కాపాడటంలో విఫలమైంది. పలు రాష్ర్టాలు తీవ్ర సంకటస్థితిని ఎదుర్కొంటుంటే, తెలంగాణను మాత్రం సింగరేణి బొగ్గు ఆదుకుంటున్నది. తెలంగాణ ఏర్పడితే కరెంటు కొరత పీడిస్తుందని కొందరు దుష్ప్రచారం చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా, ఇటువంటి క్లిష్ట సమయాలలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.