మాటే మంత్రం’ అన్నాడో సినీ కవి. ఆ కవి అన్నట్లే తన మాటలతో సామాన్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు యువనేత కల్వకుంట్ల తారకరామారావు. పలు వేదికలపై తన ప్రసంగాల ద్వారా కార్పొరేట్ దిగ్గజాలనూ ఆకట్టుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ వేదికైనా, ఏ సదస్సయినా ఆఖరికి విదేశాల్లోనూ మాట జారిపోకుండా మాట్లాడటం కేటీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. ఆ మాటే ఆయన్ను రెండు సార్లు మంత్రి అయ్యేలా, టీఆర్ఎస్ పార్టీలో కీలకపాత్ర పోషించేలా చేసింది. ఏ నాయకుడైనా రాజకీయాల్లో రాణించాలంటే మంచి వక్త అయి ఉండాలి. నలుగురిని మెప్పించి, ఒప్పించే వాక్చాతుర్యం ఉండాలి. తన మాటల్ని తూటాలుగా మలిచినప్పుడే కదా నాయకుడు అనిపించుకుంటాడు. కేటీఆర్లో అలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పెద్ద ఎత్తున యువత కూడా ఆయనను ట్విట్టర్లో ఫాలో అవుతుంటారు. ట్విట్టర్లో కేటీఆర్ చేసే ట్వీట్లు, విసిరే చెణకులు, ప్రతిపక్షాలకు అంటించే చురకలు వైరల్ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి.
సందర్భం ఏదైనా దానికి తగినట్లుగా సమయస్ఫూర్తితో కేటీఆర్ మాట్లాడే మాటలు ప్రజల్ని ఆకట్టుకుంటాయి. ప్రాంతాలు, పరిస్థితులకు అనుగుణంగా ఉపన్యసించే తీరు అమెరికా మొదలుకొని పల్లెల్లో ముసలవ్వల దాకా ఆయనకు అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అందరికీ అర్థమయ్యే రీతిలో కేటీఆర్ ప్రసంగాలు ఆకట్టుకుంటాయి. ఇక ఎన్నికల విషయానికి వస్తే తన వాగ్ధాటితో హేమాహేమీలను కూడా బోల్తాకొట్టిస్తూ తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాష్ర్టానికి దిక్సూచిగా మారాలని మనసారా కోరుకుంటున్నా.
– గుండమల్ల సతీష్ కుమార్