(1993 జూన్ 29న కలకత్తాలోని (ఐఎస్ఐ)లో మహలనోబిస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ ఇచ్చిన ప్రసంగం)
19వ శతాబ్ది చివరి పాదంలో జన్మించిన, జాతీయతావాదం నరనరాన ఆవహించి ఉన్న ఆనాటి తరపు అగ్రశ్రేణి మేధావి ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్. బెంగాళీ పునరుజ్జీవన ఆవరణంలో విరబూసిన మేధో కుసుమం. మహలనోబిస్ తాత రవీంద్రుడి తండ్రి దేబేంద్రనాథ్ ఠాగూర్ అనుచరుడు, ప్రముఖ బ్రహ్మసమాజ ఉద్యమకారుడు. జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రే వంటి శాస్త్రవేత్తలు ఆయన గురువులు. ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రముఖ ఖగోళవేత్త మేఘనాత్సహా ఈయనకు ఒక ఏడాది జూనియర్. సుభాష్ చంద్రబోస్ రెండేళ్ళు జూనియర్. ఆయన భౌతికశాస్త్ర వేత్తగా రాణించవలసి ఉన్నా, గణాంక శాస్త్రంపై ఆసక్తి పెంచుకొని మాతృభూమికి ఈ రంగంలో కొరత తీర్చారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. స్వతంత్ర భారతంలో గణాంక శాస్ర్తానికి పురుడు పోసి తీర్చిదిద్దిన మహలనోబిస్ 1950 దశకంలోనే మనదేశంలో డిజిటల్ కంప్యూటర్లు ప్రవేశ పెట్టాలని ఆకాంక్షించారు.
ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ శత జయంతి ఉత్సవాల సమావేశాన్ని ప్రారంభించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్కు కృతజ్ఞతలు. భారతీయ మేధో ప్రపంచంలో మహలనోబిస్ మేరునగం వంటి వారు. ఆధునిక భారత నిర్మాణానికి సాగించిన ప్రయత్నాలకు ఆయన ప్రతీక. ఆయనకు అనేక అంశాలపై ఆసక్తి ఉంది. గణితశాస్త్రంలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రముఖ గణితవేత్త రామానుజంకు సమకాలికుడు. మహలనోబిస్ గణి త పరిశోధనలకు ఈయన తోడ్పా టున్నది. భౌతిక, గణిత, ఆర్థికాది ఎన్నో రంగాలకు సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశవిదేశాల్లోని యువతకు మహలనోబిస్ స్ఫూర్తిప్రదాత. ఆయన సునిశిత మేధస్సు విశ్లేషణ శక్తి వల్ల నెహ్రూతో పాటు ఎంతోమంది మిత్రులయ్యారు. దేశ ఆర్థిక ప్రణాళికారచన సారథ్య బాధ్యతను నెహ్రూ మహలనోబిస్కు అప్పగించారు. ఈయన మూలంగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ మేధోశక్తి కేంద్రంగా విలసిల్లింది.
మహలనోబిస్ గొప్ప పండితుడు, దేశభక్తుడు, చుట్టూరా పరిణామాలకు స్పందించేవారు. గురుదేవ్, రవీంద్రనాథ్ ఠాగూర్ అనుచరుడు. నాటి సామాజిక ఆలోచనా విధానాన్ని, బ్రహ్మసమాజ్ భావజాలాన్ని ఎంతో ప్రభావితం చేశారు. మొదట గణిత శాస్త్రవేత్త అయిన మహలనోబిస్ ఇంగ్లండ్ నుంచి వచ్చిన తర్వాత కలకత్తాలోని ప్రెసిడెన్సి కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. ఆ తర్వాత గణాంకశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. నాడు మన దేశంలో గణాంకశాస్త్రం శేశవదశలో ఉంది. దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి గణాంకశాస్త్రం శక్తివంతమైన సాధనమని ఆయన గుర్తించారు. అప్పటివరకు మన దేశంలో గణాంకశాస్త్రమనేదే లేదని నేను అనడం లేదు. ప్రతి గ్రామంలో ఒక గణాంకవేత్త ఉండేవాడు. అతడిని పట్వారీ అంటాం. ఎంత వానలు పడ్డాయి, ఏయే పంటలు పండుతున్నాయి, ధరలు, ఎట్లా ఉన్నాయి మొదలైన అంశాలతో 39 రిజిష్టర్లు నిర్వహించేవారు. ఒక గ్రామంలోని పట్వారీ తన దఫ్తర్లో ఏయే అంశాలు రాసేవాడో జ్ఞప్తి పెట్టుకోవడం కష్టం. అందువల్ల మన దేశంలో గణాంకశాస్త్రమే లేదనకూడదు. కొన్ని రాష్ర్టాల్లో పట్వారీ రద్దుచేశారు. ఏ భూమి ఎవరికి చెందుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం. అప్పుడున్న వ్యవస్థను వక్రబుద్ధితో చూడటం వల్ల వచ్చిన సమస్య ఇది. వీలైతే ఉన్న వ్యవస్థను మెరుగుపర్చాలి, కానీ కూల్చివేయడం వల్ల గ్రామ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. కొన్ని రాష్ర్టాల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ వ్యవస్థ చాలా బలమైనది, తోడర్ మల్ కాలం నుంచి అమలవుతున్నది. ఇంకా ముం దునుంచే ఉన్నదా తెలువదు. మనదేశంలో, ఆ కాలంలో వికేంద్రీకృత పద్ధతి ఉన్నది. ఇప్పుడు కేంద్రీకృత పద్ధతిలో ప్రణాళికా రచన జరపవలసి ఉన్నది. ఇందుకు ‘మహలనోబిస్ నమూనా’తో సహా వివిధ నమూనాలను పరిశీలించవలసి ఉన్నది. మనం గణాంకాల పద్ధతిని మెరుగుపర్చుకోవలసి ఉన్నది.
మనవంటి విస్తృత దేశంలో శాంపిల్ సర్వేల ద్వారా దేశ వివరాలను అంచనా వేయడం అవసరమని మహలనోబిస్ గుర్తించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు ఇటువంటి సర్వేలు ఎంతో అవసరం. ఆయన ప్రారంభించిన శాంపిల్ సర్వే విధానం దేశానికి ఎంతో ఉపయోగపడింది. మనవంటి ఉత్తమ మైన ఆర్థిక, గణాంక వివరాల ప్రాతిపదికలు ప్రపచంలో మరెక్కడా లేవు. జాతీయాదాయం, ధరలు మొదలైన వివరాలను వెంటదివెంట సేకరించడం ఇప్పటికీ ప్రయాతో కూడిన పనే. మరింత కచ్చితమైన వివర సేకరణ, పద్ధతులను రూపొందించవలసిందిగా మహలనోబిస్ శతజయంతి సందర్భంగా గణాంకవేత్తలను కోరుతున్నాను.
మహలనోబిస్ భారత గణాంకశాస్త్ర పితామహుడు. 1931లో ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ)ను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఇక్కడికి ఆకర్షించారు.
ఈయనకు ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తిత్వం వల్ల ఇతర దేశాల్లోని గణాంక ప్రముఖులు ఐస్ఐకి తీర్థయాత్రలకు వచ్చినట్టు వచ్చేవారు. గణాంకశాస్త్ర అభివృద్ధికి సామాజికశాస్ర్తాలలో శాస్త్రీయ రచనలకు మహలనోబిస్ స్థాపించిన ‘సంఖ్య’ పత్రిక ఎంతగానో ఉపయోగపడింది. భారతదేశంలో ప్రణాళికరంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
సభ్యులు ఎంత చక్కగా ఉపయోగించుకుంటే, పార్లమెంటు అంతటి ఉపయోగకర, ప్రభావవంతమైనదిగా నిలుస్తుంది. పార్లమెంటు వ్యవహారాలు సాగవచ్చు, చట్టాలను చేయవచ్చు. కానీ ఆ విధిని పార్లమెంటు ఏవిధంగా నిర్వహిస్తున్నదనేదే ప్రజలకు కావాలి. పార్లమెంటు సమయాన్ని ఎంత ఉపయోగకరంగా గడిపామనేది ప్రధానం. ప్రజలను విద్యావంతులను చేయడం కూడా పార్లమెంటు బాధ్యత అని కూడా సభ్యులు గుర్తుంచుకోవాలి. పార్లమెంటు చర్చలు ప్రజల జీవితాలకు సంబంధించినవై ఉండాలి.