రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో 72.45 శాతం, వరంగల్- ఖమ్మం- నల్లగొండలో 76.35 శాతం పోలింగ్ నమోదైంది. నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య పెరుగడమేకాదు, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు రెట్టింపు ఓటింగ్ జరిగింది. 2015 ఎన్నికల్లో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో 37.72 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. వరంగల్- ఖమ్మం- నల్లగొండలో కొంచెం ఎక్కువగా 54.62శాతం పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఈసారి ఈ రెండు స్థానాల్లోనూ, ఎండ తీవ్రత ఉన్నా, భారీ బ్యాలెట్ పేపర్లతో ఓటు వేయటానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతున్నా ఓటర్లు ఎంతో ఓపికతో బారులు తీరి తమ బాధ్యతను నిర్వర్తించారు. మహిళలు, వృద్ధులు సైతం సాయంత్రం ఐదు గంటలదాకా వరుసలో నిలబడి ఓటేయటం పెరిగిన చైతన్యానికి నిదర్శనం.
ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలే. కొన్నాళ్లుగా సాధారణ ఎన్నికలతోపాటు స్థానిక ఎన్నికల దాకా అన్నింటిలో ఓటర్ల అనాసక్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రత్యేకించి చదువుకున్నవారు, నగరవాసులు ఓటేయవలసిన బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదనే విమర్శ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పెరిగిన అవగాహన ఓటింగు సరళిలో మార్పు తీసుకొచ్చింది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయనే అభిప్రాయం ఏర్పడినప్పుడల్లా ప్రజలు అప్రమత్తం కావడం ప్రతి దశలో గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుత భారీ పోలింగ్తో బెంబేలెత్తిన కొందరు అక్రమాలు జరిగాయనే రొడ్డకొట్టుడు ఆరోపణలే చేయడం, వాస్తవాన్ని గుర్తించలేకపోవడమే. స్వరాష్ట్రంలో స్వీయ పాలనా ఆకాంక్షలు వయోభేదం లేకుండా అందరినీ ముందుకు నడిపిస్తున్నాయనేది కండ్లముందు కనిపిస్తున్న వాస్తవం.
ప్రజాస్వామ్యంలో ప్రజల విజ్ఞతకు తగిన ప్రభుత్వం ఏర్పడుతుందంటారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించుకోవడం కోసం ప్రజలు ప్రతి అంశంలోనూ చొరవచూపుతున్నారు. అది ఈ పట్టభద్రుల ఎన్నికల్లోనూ స్పష్టమైంది. ఈ చొరవను బంగారు తెలంగాణ నిర్మించుకోవడంలోనూ చూపించాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరించాలి. అమెరికా ఆధ్యాత్మికవేత్త జేమ్స్ ఫ్రీమన్ క్లార్క్ అన్నట్లు- రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికల కోసం ఆలోచిస్తే, రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల కోసం ఆలోచిస్తాడు. ప్రభుత్వ ప్రణాళికలను సాకారం చేయడంలో పట్టభద్రుల పాత్ర కీలకమైనది. ఎన్నికలలో పాల్గొనడం ద్వారా వ్యక్తపరిచిన చైతన్యాన్ని పట్టభద్రులు మరింత ముందుకు తీసుకుపోవాలి. భవిష్యత్ తరాల కోసం తమ శక్తియుక్తులను వినియోగించాలి.