గోన బుద్ధారెడ్డి తన రామాయణాన్ని గద్యం,పద్యాల్లో చంపూ
మార్గంలో కాక ద్విపద ఛందస్సులో రచించాడు. ద్విపద అచ్చమైన
దేశీ తెలుగు ఛందస్సు. తెలంగాణ గడ్డపై అచ్చమైన తెలుగు
దేశీ ఛందస్సులో రామాయణం రాయబడటం ఒక గొప్ప విశేషం.
ద్విపద ఒక్కొక్క పాదంలో మూడు ఇంద్రగణములు, ఒక సూర్యగణం ఉంటాయి. ప్రతి పాదంలోని మూడవ గణము మొదటి అక్షరం మీద ‘యతి’ చెల్లుతుంది. ద్విపదలో రెండు పాదాలుంటాయి. ద్విపదం నుంచే మంజరి, తరువోజ, మధ్వాక్కర మొదలైన దేశీ ఛందో భేదాలు ఏర్పడుతుంటాయి. వేములవాడ చాళుక్యుల కాలంలో పద్మకవి సర్వదేవుడు కవులు రాసిన తెలుగు, జైన కావ్యాలు సంస్కృత కావ్య పద్ధతిలో గద్యం లేకుండా ఉన్నాయా? లేదా, చంపులో ఉన్నాయా? మనకు తెలియదు.
ద్విపద కావ్యంలో మాత్రం మొదటి నుంచీ చివరి వరకు ద్విపదలే ఉంటాయి. ఎక్కడా వచనం ఉండదు. ఇది గేయ రచనలా సాగుతుంది. పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ద్విపద కావ్యాలు పండిత, పామరుల్లో సైతం వ్యాప్తిలో ఉంటాయి. కొన్ని ద్విపదలు సరళంగా పాదాలు దేనికవే అర్థం సంపూర్ణమై ఉన్నాయి. ఒక పాదంలోని చివరి పదం, రెండవ పాదంలోకి చొచ్చుకొని పోరాదనే లక్ష్యణంను తాళ్లపాక చిన్నన్న చెప్పాడు.
గోన బుద్ధారెడ్డి ద్విపదలో ఏ పాదానికి ఆ పాదము స్వతంత్రంగా ఉండేట్లు రచించాడు. అది గొప్ప రచనాశైలి. తర్వాత ద్విపదకు కావ్యగౌరవ స్థాయిని కల్పించినవాడు పాల్కుర్కి సోమనాథుడు. ద్విపద కావ్య కర్తలల్లో అతడే మొదటివాడని అంటారు. కానీ పాల్కుర్కి సోమన రెండో ప్రతాపరుద్రుని కాలం వాడు కాగా, గోన బుద్ధారెడ్డి గణపతి దేవుడి కాలం వాడు. అంటే మొట్టమొదటి ద్విపద కవి గోన బుద్ధారెడ్డి. తర్వాత ద్విపదకు పండితాదరణను కల్పించి నిలబెట్టినవాడు పాల్కుర్కి సోమనాథుడు. ద్విపదలో కూడా కావ్య ప్రౌఢిని సాధించినవాడు సోమన. సోమనాథుని తర్వాత శివకవులేగాక ఇతర కవులు కూడా ద్విపద కావ్యాలను రచించారు. దాదాపుగా తెలుగులో 245 పైన ద్విపద కావ్యాలున్నాయని అంటారు. సోమనాథుని తర్వాత తెలంగాణ కవి గౌరన ద్విపదకు గౌరవాన్ని తెచ్చాడు.
తర్వాత వైష్ణవ కవులు తాళ్లపాక అన్నమాచార్యులాది కవులు ద్విపదలో కావ్యాలు రాశారు. ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగంలో కూడా రఘునాథనాయకుడు తిరువేంగళ కవి, విజయరాఘవ నాయకుడు రెండవ ఏకోజీ, కట్టావరదరాజు, మరిగంటి కవులు
(రామాయణం) మొదలైన కవులెందరో ద్విపద ఛందస్సును ఎన్నుకొని కావ్యాలు రచించారు. తెలుగుకే ప్రత్యేకమైన దేశీ ఛందస్సుకు చెందిన ద్విపదను మొట్టమొదట తెలంగాణ కవులు
ఆదరించి ఆచరించి వ్యాప్తి కల్గించారు.
ఇది తెలంగాణ సాహిత్యంలోని కవులు అందించటం గొప్ప విశేషం.
హుళక్కి భాస్కరుడు రచించిన రామాయణానికి ‘భాస్కర రామాయణం’ అని పేరున్నది. కేవలం భాస్కరుడు అని మల్లికార్జునభట్టు చెప్పినా అయ్యలార్యుడు అతన్ని ‘హుళక్కి భాస్కరుడు’ అని పేర్కొన్నాడు. ‘భాస్కర రామాయణం’ పేరుతో పిలువబడుతున్న ఈ రామాయణాన్ని నలుగురు కవులు రచించారు. భాస్కరుని కుమారుడైన మల్లికార్జునభట్టు బాల, కిష్కింధ, సుందరకాండలను రచించాడు.
-ముదిగంటి సుజాతారెడ్డి 99634 31606