రంగారెడ్డి/ వికారాబాద్, మార్చి 30, (నమస్తే తెలంగాణ):ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నగారా మోగించబోతున్నది. జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచు, వార్డు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. రంగారెడ్డి జిల్లాలో ఐదు, వికారాబాద్ జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రంగారెడ్డి జిల్లాలో 53 మంది వార్డు మెంబర్లు, ఒక ఎంపీటీసీ స్థానం కూడా ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో 58 వార్డు మెంబర్లు, 3 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుండగా.. మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేసిన వ్యయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అనేక మందిపై అనర్హత వేటు పడడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఏప్రిల్ 3న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించి ఏప్రిల్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి ఏప్రిల్ 12న తుది జాబితాను ప్రకటించనున్నారు.