రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరిగింది. ఇందులో 32 మంది శాశ్వత న్యాయమూర్తులుగా, మరో పది మంది అదనపు జడ్జీలుగా ఉంటారు. ఈ లెక్కన న్యాయమూర్తుల సంఖ్య 75శాతం పెరిగింది. ఇటీవలి కాలంలో ఇంత భారీగా దేశంలో ఎక్కడా పెరగలేదు. దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన ఎన్వీ రమణ పట్టుదల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆయన అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న మరుక్షణం నుంచే న్యాయవ్యవస్థలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఆ క్రమంలోనే ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సకల వసతులున్న తెలంగాణ హైకోర్టుకు కోరిన విధంగా న్యాయమూర్తుల నియామకం జరుగాలని కేంద్రానికి నివేదించటంతో కొన్ని ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆశ సఫలమైంది.
ఉమ్మడి హైకోర్టులో 61 మంది న్యాయమూర్తులు ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 37మందిని కేటాయించగా, తెలంగాణకు 24మంది మాత్రమే మిగిలారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో పనిభారం పెరిగిపోయింది. పెండింగ్ కేసులు 2.46 లక్షలకు చేరుకున్నాయి. న్యాయమూర్తులు పనిగంటలు పెంచుకొని అదనంగా పనిచేస్తామన్నా పేరుకుపోయిన పెండింగ్ కేసుల గుట్టలు తరిగే పరిస్థితి లేదు. అందుకే న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని 2019 ఆరంభంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదనలు పంపా రు. ముఖ్యమంత్రి కూడా ప్రధానికి, సీజేఐకి లేఖలు రాశారు. వాటిని పరిశీలించిన ప్రధాని కార్యాలయం, కేంద్రన్యాయశాఖ ముందు ఖాళీలను పూరించమంటూ సూచించి, సంఖ్య పెంచే ప్రతిపాదనను పక్కనపెట్టాయి. చీఫ్ జస్టిస్ చొరవతో న్యాయమూర్తుల సంఖ్య పెరగడం హర్షణీయం.
దేశంలోని వివిధ కోర్టుల్లో మూడున్నర కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు మరో 350 ఏండ్లు పడుతుందని అంచనా! ఇప్పటికైనా భారీ వ్యయంతో నిమిత్తం లేని బలమైన పరిష్కారాల దిశగా ఆలోచించాలి. న్యాయం దక్కడంలో ఏండ్లతరబడి ఎదురుచూసే దుస్థితి, న్యాయం అందని స్థితికి తార్కాణమనే నానుడి ఉండనే ఉన్న ది. ఇప్పటికైనా సత్వర న్యాయం దిశగా అడుగులు పడాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రజాస్వామ్య పరిణామక్రమంలో చాలా దేశాలు అవసరాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థలో మార్పులు చేసుకున్నాయి. రాజ్యాంగపరమైన అంశాల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పా టు చేసుకున్నాయి. మన దేశంలో న్యాయవ్యవస్థలో కాలానుగుణమైన సంస్కరణలు ప్రవేశపెట్టాలి.