దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అరెస్టుకు నిరసనగా భగ్గుమన్న నిరసనలు క్రమంగా దోపిడీ, విధ్వంసాలకు దారితీయడం గమనార్హం. షాపింగ్ మాల్స్ను దోచుకొంటూ, వాటిని తగులబెట్టడం యథేచ్ఛగా సాగుతున్నది. దోపిడీలు సాగుతున్నప్పుడు తొక్కిసలాటల్లో కొందరు మరణించగా, పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. డెబ్బయి మందికి పైగా మరణించి ఉంటారని అంచనా. విధ్వంసకాండలో అనేక ఫ్యాక్టరీలు దగ్ధమయ్యాయి. రహదారులు, నౌకాశ్రయాలు ధ్వంసమయ్యాయి. దక్షిణాఫ్రికాలో కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది. కరోనా వ్యాప్తి కూడా అనిశ్చితికి, అసంతృప్తికి దారితీసింది. రాజకీయ విభేదాలను అధిగమించడంలో దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసా విఫలమయ్యారు. ఈ కారణాలన్నీ అల్లర్లను ఎగదోశాయి.
2009-18 మధ్య దక్షిణాఫ్రికాను పాలించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా జాకబ్జుమాపై ఆరోపణలున్నాయి. భారత సంతతికి చెందిన, అత్యంత సంపన్న ‘గుప్తా కుటుంబం’ దక్షిణాఫ్రికా రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నది. ఈ కుటుంబంతో జాకబ్జుమాకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా దర్యాప్తు కమిషన్ ముందు జాకబ్జుమా హాజరు కాకపోవటంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు 15 నెలల జైలు శిక్ష విధించింది. జుమాను జైలుకు తరలించడంతో ఆయన మద్దతుదారులు రహదారులను దిగ్బంధిస్తూ ప్రారంభించిన నిరసనలు క్రమంగా అల్లర్లకు, దోపిడీలకు దారితీశాయి.
లాటిన్ అమెరికాలో క్యూబా, ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా పరిణామాలు రాబోయే పరిస్థితులకు హెచ్చరికలా అనేది ఆలోచించవలసి ఉంది. ఇటీవలి కాలంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక పోకడలను సమీక్షించుకోవాలనే మాట కొంతకాలంగా వినబడుతున్నది. ఈలోగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. మూలిగే నక్కమీద తాటికాయ పడినట్టు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత కకావికలమయ్యాయి. కరోనా తరువాత ప్రపంచం ఏ విధంగా ఉంటుందో అనే భయాలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో క్యూబా, దక్షిణాఫ్రికా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దక్షిణాఫ్రికాలో నిరుద్యోగం 46.3 శాతంగా నమోదైంది. సగానికిపైగా జనాభా పేదరికంలో మగ్గిపోతున్నది. అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. జుమా అరెస్టుకు నిరసనగా ఆయన మద్దతుదారులు ఆందోళన ప్రారంభించినప్పటికీ, ఈ స్థాయిలో అల్లర్లను పురికొల్పినవి అక్కడి ఆర్థిక పరిస్థితులే. ఈ పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి.