గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కావాలి. ఎలా? సమాచారం తెలుసుకున్న అధికారులు డ్రోన్ సాయంతో ఔషధాలను పంపించి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు. ఆకాశం నుంచి వానలు వస్తాయి కానీ, ఇప్పుడు ఔషధాలు కూడా వస్తున్నాయి! ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్టు ఘనత. దూరప్రాంతాలకు డ్రోన్ ద్వారా మందులను పంపించటం ద్వారా దేశానికి మరోమారు మార్గదర్శకంగా తెలంగాణ నిలిచింది. ఈ నెల 11వ తేదీన వికారాబాద్ నుంచి ఐదు కిలోల బరువున్న ఔషధాలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యారోగ్య కేంద్రానికి ప్రయోగాత్మకంగా పంపించారు. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, హెల్త్నెట్ గ్లోబల్, నీతి ఆయోగ్ సంయుక్తంగా జరిపిన కృషి ఫలితమిది.
ఐటీ విస్తరణ నుంచి కులవృత్తి నైపుణ్యాలను గుర్తించడం వరకు పలు రంగాల్లో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. ఆరోగ్య రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. గర్భిణీలకు పౌష్టికాహారం, సర్కారు దవాఖానల్లో ప్రసవాలకు ప్రోత్సాహం.. ఇలా ప్రతి దశలోనూ ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నూటికి తొంభై శాతం వ్యాధులు కలుషిత నీటితో వచ్చేవి కనుక గిరిజనుల తండాల వరకూ మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నది. కంటి పరీక్షలు మొదలుకొని ఉచిత డయాలిసిస్ వరకు అనేకవిధాల పేదలను ఆదుకుంటున్నది. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత మాత్రమే కాదు, అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొనే దూరదృష్టీ తమకు ఉన్నదని డ్రోన్ టెక్నాలజీ వినియోగం ద్వారా చాటిచెప్పింది కేసీఆర్ ప్రభుత్వం.
వలసపాలనలో మరుగునపడిపోయింది గానీ, తెలంగాణ వైద్యరంగం చరిత్ర ఎంతో ఘనమైనది. 1948కు ముందే ఇక్కడ వైద్యరంగం ఎంతో విస్తరించింది. మానసిక రుగ్మత మొదలుకొని ఎముకల చికిత్స వరకు ప్రతి వ్యాధికి ప్రత్యేక దవాఖాన ఇక్కడ ఉన్నది. పిల్లల వ్యాధులకు, ప్రసవాలకు వైద్య వసతులున్నాయి. శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే క్లోరోఫామ్పై ఇక్కడే ప్రయోగాలు జరిగాయి. మలేరియా వ్యాధికి దోమ కారణమని కనుగొన్నది ఇక్కడి ప్రయోగాలలోనే. జాజ్వల్యమానమైన గత వైభవం మళ్లీ నేడు స్వరాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సాక్షాత్కరిస్తున్నది. మంత్రి కేటీఆర్ చెప్పినట్లు.. బెంగాల్ నేడు ఏం ఆలోచిస్తుందో ఇండి యా రేపు అదే ఆలోచిస్తుంది అనేది పాత మాట. తెలంగాణ నేడు ఏం చేస్తుందో.. ఇండియా రేపు అదే చేస్తుంది అనేది నేటి మాట.