పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు భారీ పరివర్తనకు లోనవుతున్నాయి. ఇజ్రాయెల్తో కొద్ది కాలం కిందట అరబ్బు దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్ దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాయి. తాజాగా యూఏఈ, ఇజ్రాయెల్, అమెరికాలతో భారత్ చతుర్భుజ కూటమిగా ఏర్పడటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఇప్పటికే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ దేశాలతో చతుర్భుజ కూటమి (క్వాడ్) ఏర్పడింది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఏర్పాటైన కూటమిని క్వాడ్-2 గా పేర్కొంటున్నారు. క్వాడ్-1 కూటమిని చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిందనేది స్పష్టం. ఇప్పుడు క్వాడ్-2 కూడా అమెరికా వ్యూహంలో భాగమే. అయితే అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్ళకు ఈ కూటమి పరిష్కారం చూపుతుందా అనేది అనుమానమే.
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ మిగతా దేశాల విదేశాంగ మంత్రులతో వర్చువల్ సమావేశంలో పాల్గొని క్వాడ్-2 ఏర్పాటును ఖరారు చేశారు. గత ఏడాది అమెరికా ప్రేరణతో యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్నాయి. పాలస్తీనా వివాదాన్ని పక్కన పెట్టి ఈ అరబ్బుదేశాలు ఇజ్రాయెల్తో స్నేహం నెరపడం ఆశ్చర్యకరమే. కానీ అంతర్జాతీయ రంగంలో వచ్చిన మార్పుకు ఇది నిదర్శనం. క్వాడ్-2 ఆర్థిక కూటమి మాత్రమేనని ఇటీవల ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయినప్పటికీ దీని వెనుకున్న రాజకీయం దాచిపెట్టలేనిది. అగ్రరాజ్యంగా పెత్తనం చేసిన అమెరికా క్రమంగా బలహీనపడుతున్నది. ఇండోపసిఫిక్లో చైనాను ఎదుర్కొంటూ పశ్చిమాసియాపై పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించలేకపోతున్నది. దీంతో ఇరాన్ ప్రాబల్యం పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంతకాలం అమెరికా మిత్రదేశంగా ఉన్న టర్కీ ఇప్పుడు సొంత విదేశాంగ విధానం అనుసరిస్తూ, పశ్చిమాసియాలోకి చొచ్చుకువస్తున్నది. రష్యా, చైనాల ప్రాబల్యం పెరుగుతున్నది. దీంతో అమెరికా వేగంగా తన అనుకూల దేశాల మధ్య బంధాన్ని పటిష్ఠం చేస్తున్నది.
అమెరికా కోణంలో క్వాడ్-2 ఏర్పాటును ముందడుగుగానే చెప్పుకోవచ్చు. కానీ భారత్కు ఇది ఏమేరకు ఉపయోగకరమనేదే ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం, యూఏఈ ఆర్థిక పాటవాన్ని ఉపయోగించుకుంటే మానవ, ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న భారత్ పారిశ్రామిక శక్తిగా ఎదుగవచ్చు. పశ్చిమాసియా దేశాలతో సంబంధాలు దృఢపడటం మంచిదే. కానీ ఈ క్రమంలో మనతో చారిత్రకంగా సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలున్న ఇరాన్ను విస్మరించకూడదు. ఇప్పటికే అమెరికా ఒత్తిడి మూలంగా భారత్ దూరంగా ఉంటున్నదని ఇరాన్ కినుక వహించింది. పశ్చిమాసియాలో భిన్న ధ్రువ రాజకీయాలు నెలకొంటున్న నేపథ్యంలో భారత్ ఏ వైపూ పూర్తిగా మొగ్గకపోవడమే శ్రేయస్కరం.