హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మినీ లెదర్ పార్కులను ఏర్పాటుచేయాలని తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎల్ఐపీసీ) నిర్ణయించింది. నల్లగొండ జిల్లా దండేపల్లి, సిద్దిపేట జిల్లా దుద్దెడ, మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వీటిని ఏర్పాటు చేసేందుకు త్వరలో దరఖాస్తులను ఆహ్వానించనున్నది. మరోవైపు లెదర్ ఉత్పత్తుల మార్కెటింగ్కు కూడా టీఎస్ఎల్ఐపీసీ తగిన ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో జిల్లాల వారీగా రూ.25 లక్షల వ్యయంతో షోరూంలను ఏర్పాటు చేయడంతోపాటు ఈ-కామర్స్ ఫుట్వేర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ను అభివృద్ధిచేసి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం తదితర నగరాల్లో ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరపాలని నిర్ణయించింది. అంతేకాకుండా మండల కేంద్రాల్లో వ్యాన్ల ద్వారా మొబైల్ ఫుట్వేర్ సర్వీసెస్ను ప్రారంభించి నైపుణ్యం కలిగిన చర్మ వృత్తి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిశ్చయించింది. ప్రస్తుతం టీఎస్ఎల్ఐపీసీ తన ఉత్పత్తులను ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు సరఫరా చేస్తున్నది. ముఖ్యంగా సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ, పోలీసు శాఖలతోపాటు నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ (న్యాక్) లాంటి సంస్థలు టీఎస్ఎల్ఐపీసీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. 2015-16 నాటికి రూ.3 కోట్లుగా ఉన్న టీఎస్ఎల్ఐపీసీ విక్రయాలు 2019-20లో ఏకంగా రూ.13 కోట్లకు పెరగడం విశేషం.
ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో లెదర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు. దీని అంచనా వ్యయం రూ.53 కోట్లు. ఇందులో 80 శాతం మొత్తాన్ని గ్రాంటు రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. మిగిలిన 20 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. లెదర్ క్లస్టర్ ఏర్పాటుకు త్వరలో తుది అనుమతులు వచ్చే అవకాశమున్నదని, ఆ వెంటనే స్థలాల కేటాయింపు చేపడతామని అధికారులు తెలిపారు. 150 ప్లాట్లతో కూడిన ఈ క్లస్టర్ ద్వారా దాదాపు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.