సమస్యను పూర్తిగా ముదరబెట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలకు కొంత వెసులుబాటును ప్రకటించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం వల్ల కునారిల్లిన సంస్థలకు మళ్ళీ జవజీవాలు లభిస్తాయా అనేది ఇంకా అనుమానంగానే ఉన్నది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్), స్పెక్ట్రమ్ బాకీల చెల్లింపులపై నాలుగేండ్ల పాటు మారటోరియం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మూతబడే స్థితిలో ఉన్న సంస్థలకు తక్షణ ఊరట లభించవచ్చు. కానీ టెలికం రంగం మాత్రం ఇంకా సంక్షోభం నుంచి గట్టెక్కలేదనేది వాస్తవం. ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పడం వంటి దీర్ఘకాలిక విధానాలేవీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో లేవు. ప్రైవేటు పెట్టుబడుల కోసం టెలికం రంగం తలుపులు తెరిచిన ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేటు సంస్థలు పాదుకోవడానికి అనుకూల పరిస్థితులు కల్పించడంలో మాత్రం విఫలమైంది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించినట్టే లేదు.
టెలికం రంగం పీకల్లోతు సంక్షోభంలోకి కూరుకుపోయిన నేపథ్యంలో, ప్రభుత్వం ఈ మాత్రం వెసులుబాటు కల్పించక తప్పలేదు. ఏజీఆర్ అంటే స్పెక్ట్రమ్ ఉపయోగానికి అంటే మూల వ్యాపారానికి మాత్రమే వర్తిస్తుందని టెలికం కంపెనీలు వాదించాయి. కానీ టెలికం శాఖ మాత్రం డివిడెండ్, వడ్డీ, ఆస్తుల అమ్మకాలపై కాపిటల్ గెయిన్స్, సెక్యూరిటీలు, విదేశీ మారక హెచ్చుతగ్గుల వల్ల కలిగే లాభాలు మొదలైనవన్నీ ఏజీఆర్ కిందికి వస్తాయని పేర్కొన్నది. టెలికం వివాద పరిష్కార ట్రిబ్యునల్ కంపెనీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. 2020 జనవరి 16న సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించడానికి కూడా తిరస్కరించింది. దీంతో పదిహేనేండ్లుగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక సంస్థపై 35,600 కోట్లు, మరొక సంస్థపై 53,039 కోట్లు, ఇంకో సంస్థపై 14,000 కోట్ల రూపాయల భారం పడింది. దీంతో ఒకట్రెండు సంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే దాదాపు పది టెలికం కంపెనీలు మూలకుపడ్డాయి. ఇప్పుడు మరో రెండు కంపెనీలు మూతపడితే గుత్తాధిపత్యానికి దారి తీసేది. అనేకమంది కస్టమర్లు ఇబ్బందుల పాలయ్యేవారు, వేలాది ఉద్యోగాలు పోయేవి. టెలికం సంక్షోభం ప్రభావం డిజిటల్ ఎకానమీపై కూడా పడేది. ఈ కామర్స్తో సహా పలు వ్యాపారాలను మొగ్గదశలోనే చిదిమివేసినట్టయ్యేది. ఇకనుంచైనా ప్రభుత్వం మార్కెట్ ఆర్థికవ్యవస్థలో తన పాత్ర ఏమిటో అవగతం చేసుకోవాలి. ఇవాళ టెలికం కావచ్చు రేపు మరో రంగం కావచ్చు. విధాన నిర్ణయాలు తీసుకునే ముందు పరిణామాలను అంచనా వేయాలి. మార్కెట్ ఎకానమీ అయినప్పటికీ పూర్తిగా ప్రేక్షక స్థానం ఎంచుకోకూడదు. వ్యాపార క్రీడ నియమబద్ధంగా సాగేలా రెఫరీ పాత్ర పోషించాలి. వ్యాపార పోటీ ఆరోగ్యకరంగా ఉంటేనే మార్కెట్ స్థిరంగా ఉంటుంది. వినియోగదారులకు మేలు జరుగుతుంది. ఆర్థిక రంగంలో స్థిరత్వం నెలకొంటుంది.