అన్నపు రాశులు ఒకవైపు.. ఆకలి మంటలు ఒకవైపు అన్నట్లుగా ఉంది ప్రపంచం పరిస్థితి. గోదాముల నిండా ధాన్యరాశులు పొంగిపొర్లుతుంటే మరోవైపు అన్నమో రామచంద్రా అంటూ పొట్ట చేత పట్టుకునే అన్నార్థులు అనేకమంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన ఆహారవృథా సూచిక-2021 దీనికి అద్దం పడుతున్నది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 93.10 కోట్ల టన్నుల ఆహారం వృథా అయినట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. అదే ఏడాది దాదాపు 81 కోట్ల మంది తినటానికి సరైన తిండి లేక అలమటించారు. అంటే దేనిదారి దానిదే. పారవేసేవాళ్లు పారేస్తున్నారు. ఆకలితో నకనకలాడేవాళ్లు ఆ దుస్థితితో మగ్గిపోతున్నారు. ఒక సమన్వయంగానీ, ప్రణాళికగానీ లేని పరిస్థితిని ఈ సమస్య పట్టిచూపుతున్నది. అంతేకాదు.. నేటి ప్రపంచం పయనిస్తున్న దారిని, మనం నెలకొల్పుకున్న రాజకీయ, సామాజిక వ్యవస్థల నిర్మాణాల్లోని ఔచిత్యాన్ని నిలదీస్తున్నది.
21వ శతాబ్దం ముంగిట ప్రపంచదేశాల అధినేతలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సమావేశమై కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. అంతర్జాతీయ సమాజం సాధించాల్సిన ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు’గా వీటికి పేరు పెట్టారు. వీటిలో ఒకటి.. 2030 నాటికి ప్రపంచంలో ఆకలి కేక వినిపించకూడదని. ఈ ప్రతిజ్ఞ చేసి 22 ఏండ్లవుతున్నది. ఇంకా ఎనిమిదేండ్ల వ్యవధి మాత్రమే ఉన్నది. కానీ, లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నామని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020 లో ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సరిపోయినంత ఆహారం లభించలేదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అర్ధాకలితో పొట్ట నింపుకొన్న వీరి సంఖ్య 237 కోట్లు. విషాదం ఏమంటే.. అంతకుముందు సంవత్సరం కన్నా ఈ సంఖ్య 32 కోట్లు ఎక్కువ. అంటే ఏటా పరిస్థితి క్షీణిస్తున్నదే తప్ప మెరుగుపడటం లేదు. ఈ లెక్కన 2030 నాటికి కనీసం 66 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితులున్నాయని అంచనా.
ఆహార వృథాలో తొలి ఐదు స్థానాల్లో చైనా, భారత్, అమెరికా, జపాన్, జర్మనీ దేశాలు ఉండగా.. ఆకలి, పౌష్టికాహారలోపం సమస్యలను అత్యధికంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు ఎదుర్కొంటున్నాయి. అగ్రదేశాలు అడ్డగోలుగా వృథా చేస్తుంటే.. ఆ ప్రభావం పేదదేశాలపైన పడుతుందా అన్నది పరిశోధించాల్సిన అంశం. ఇక మనదేశం విషయానికొస్తే.. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఏటేటా పతనోన్ముఖంగా సాగుతున్నది.
మోదీ అధికారం చేపట్టకముందు 2014లో భారత్ ర్యాంకు 55 కాగా.. గత ఏడాది ర్యాంకు 101 (మొత్తం 116 దేశాల్లో). ఏడేండ్లలో 46 స్థానాల దిగువకు పడిపోయింది. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. అదే సమయంలో ఆహారవృథాలో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాం. ఇదీ కేంద్రంలోని పాలకులకు ఉన్న దక్షత. ఇటువంటి సమస్యలను పరిష్కరించే బాధ్యతను పక్కనపెట్టి, దేశ లౌకిక, ప్రజాస్వామ్య, సమా ఖ్య తత్వాన్ని ఎలా ధ్వంసం చేయాలన్నదానిపై మాత్రం నిరంతరం సమాలోచనలు జరుగుతున్నాయి. కేంద్రమా.. కళ్లు తెరు!