రాజకీయక్షేత్రంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో విపక్షనేతల మాటల తీరు సామాన్యునికి సైతం వెగటు పుట్టిస్తున్నాయి. విమర్శలు పరిధిని దాటి వ్యక్తిగత నిందల దాకా పోవటం సత్సంప్రదాయం కాదు. వాడు-వీడు, అరే-తురే లాంటి మాటలు రాజకీయ భ్రష్టత్వానికి నిదర్శనం. ఎమ్యెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అయినవారు ప్రజలందరి ఆమోదంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై రాజ్యాంగానికి బద్ధులై పాలన నిర్వహిస్తున్నవారే. రాజకీయాల్లో వ్యక్తులే కాదు, వారు నిర్వహిస్తున్న పదవినైనా గౌరవించాలి. విచక్షణ మరిచిన విమర్శలు విలువల పతనానికి పరాకాష్ఠ. ప్రజా సమస్యల విషయంలో నిర్మాణాత్మక విమర్శలు ఆహ్వానించదగినవే. కానీ అవి శృతిమించి ఉచితానుచితాలు మరిచి వ్యక్తిత్వాలను కించపరిచే స్థితికి రాజకీయ నాయకులు చేరుకోవటం ప్రజాస్వామ్యానికే ప్రమాదం.
అసెంబ్లీ నుంచి పార్లమెంటు దాకా చట్టసభల్లో కొలువుదీరిన శాసనకర్తల గుణగణాలే ప్రజాస్వామానికి ముఖచిత్రంగా చెప్తారు. కానీ ఈ డబ్భు ఏండ్ల కాలంలో ప్రజాప్రతినిధులైన వారు చట్టసభల్లో కూర్చొని చేసిన వికారాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ఉచితానుచితాలను మర్చిపోయి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. సమాజంలో వారివైపు తలెత్తి చూడటానికి కూడా సిగ్గుపడే పరిస్థితి ఉన్నవారు చట్టసభల్లో దూరటం వల్ల, వారితో భుజం కలిపి నడువాల్సివస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తున్నదని ఉమ్మడి రాష్ర్టానికి గవర్నర్గా పనిచేసిన కృష్ణకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి దుస్థితిని చూస్తే ఆయన ఎంతగా వగచేవారో ఊహించుకోవాల్సిందే.
భారత ప్రజాతంత్రం క్రమేణా పరిణతి సాధిస్తుందని లోక్సభ తొలి స్పీకర్ మౌలంకర్ గంపెడాశ పెట్టుకున్నారు. కానీ జాతీయోద్యమకాలం నాటి త్యాగధనుల ఆశలు అడియాసలవుతున్నాయి. స్వతంత్ర పాలనలో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిణతి చెందాల్సింది పోయి వికృతంగా మారుతున్నది. ఇందుకు జాతీయపక్షాల నాయకులే కారణభూతమవడం బాధాకరం. దేశ రాజకీయాలను నడిపించిన పార్టీ ఒకటైతే, కొత్తగా సత్పరిపాలనను అందిస్తామంటూ కేంద్రంలో అధికారానికి వచ్చిన పార్టీ మరొకటి. ఈ రెండు పార్టీలూ వీధిరౌడీల వంటి నాయకులను, విలువలను పాతరేసిన వారిని అందలమెక్కించడంతోనే రాజకీయ కాలుష్యం పెరిగింది. వీరు వ్యక్తులను విమర్శి స్తున్నట్టు పైకి కన్పిస్తున్నప్పటికీ, నిజానికి వ్యవస్థలను నిర్వీర్యపరు స్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకత్వాలు ఇటువంటి వికృత పోకడలను తక్షణం అరికట్టాలి.